Kodali Nani: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో ఉన్న కొడాలి నానిది ప్రత్యేకమైన రాజకీయ శైలి. భిన్నమైన శైలి. ఆయన ఏ విషయంలో అయినా సూటిగా మాట్లాడతారు. ఎదుటివాడిని తిట్టాలన్నా, పొగడాలన్నా, ఎదుటి వాడిని బ్లేమ్ చేస్తూ.., డామినేట్ చేస్తూ.., దారుణంగా., వ్యంగ్యంగా.. ఎలా మాట్లాడాలన్నా అందులో దిట్ట కొడాలి నాని. మంత్రుల అందరిలోని లేని ఈ ప్రత్యేకత కొడాలి నానికి ఉంది. టీడీపీని, చంద్రబాబుని, ఆ మీడియాని, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణని ఆ స్థాయిలో ధాటిగా మాట్లాడే నేత కొడాలి నాని. అయితే చాలా సార్లు తన వ్యాఖ్యలతో వైసీపీని కూడా ఇరుకున పెడుతుంటారు.. రీసెంట్ గా చేసిన ఓ వ్యాఖ్య మూడు జిల్లాల్లో వైసీపీ శ్రేణులను ఆందోళన కల్గిస్తోంది. ఇదేంటి కొడాలి నాని ఇలా అన్నారు. దీని వల్ల పార్టీకి ఏమైనా నష్టమా అనే విషయంపై చర్చ జరుగుతోంది..!
Kodali Nani: పీకే.. పీకే ప్రాస కోసం..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (పీకే) దశలవారీగా పోరాటం చేస్తున్నారు. నెల క్రితం విశాఖపట్నం వెళ్లి ఆందోళనలు చేస్తున్న కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. ఆ తరువాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. ఆ తరువాత డిజిటల్ క్యాంపైయిన్ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల జనసేన పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అనే సందేశాన్ని ఇస్తున్నారు. అయితే దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మా పీకే (ప్రశాంత్ కిషోర్) చూసుకుంటారు. పార్టీ విషయం మీ పీకే (పవన్ కళ్యాణ్) చూసుకోండి అని వ్యాఖ్యానించారు. ప్రాస కోసం వాడిన పదాల్లో ఇప్పుడిప్పుడే విశాఖలో చర్చలు మొదలయ్యాయి. విశాఖలో ప్రశాంత్ కిశోర్ కి పనేమిటి..!? అంటూ ప్రశ్నలు మొదలవుతున్నాయి.
ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి ఉందంటే.. ప్రశాంత్ కిషోర్ (పీకే)కి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమిటి సంబంధం. సీఎం జగన్మోహనరెడ్డి గారా లేక ప్రశాంత్ కిషోర్ గారా. కొడాలి నాని చేసిన వ్యాఖ్యల ద్వారా పరిపాలన జగన్మోహనరెడ్డి గారి చేతిలో లేదు నిర్ణయాధికారాలు, అభిప్రాయాలు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడం జగన్మోహనరెడ్డి చేతిలో లేదు. ప్రశాంత్ కిషోర్ చేతుల్లో ఉందనే విధంగా అర్ధం అవుతోంది. ప్రశాంత్ కిషోర్ ది ఆంధ్రప్రదేశ్ కాదు. ఇక్కడ పుట్టలేదు. ఇక్కడ పెరగలేదు. కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే వైసీపీ నుండి ప్యాకేజీ తీసుకుని ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్ పని చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం దశాబ్దాల తరబడి సున్నితమైన భావోద్వేగాలతో ముడి పడి ఉన్న అంశం. వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉండి ఓ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన కర్మాగారం. అటువంటి స్టీల్ ప్లాంట్ అంశం మీద ప్రశాంత్ కిషోర్ కు ఏమి సంబంధం. సీఎంగా జగన్మోహనరెడ్డి గారు ఉన్నారు. జగన్మోహనరెడ్డిని విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ప్రజలు ఎన్నుకోలేదు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఎందుకు తలదూరుస్తున్నారు. అంటే వైసీపీని, జగన్మోహనరెడ్డిని, నిర్ణయాలను, పరిపాలనను మొత్తం నడిపిస్తున్నది ప్రశాంత్ కిషోర్ (పికే) కదా అని కొడాలి నాని పరోక్షంగా చెప్పినట్లు అవుతోంది. దీంతో బీహార్ చేతిలో పాలన పెట్టారు అన్న విమర్శలు వస్తున్నాయి.
పార్టీ అధినేత, సీఎం జగన్..!?
జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత. ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఆయనకే ఆ హక్కులు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఆయన నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహనరెడ్డి. కొడాలి నాని చెప్పదల్చుకుంటే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చూసుకుంటారు అని అనాల్సి ఉంది, కానీ అయన అలా అనకుండా మా పీకే చూసుకుంటారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ (పీకే) ను విమర్శిస్తూ ప్రాసకోసం టంగ్ స్లిప్ అయి పీకే (ప్రశాంత్ కిషోర్) అని అన్నారో లేక కావాలనే వ్యాఖ్యలు చేశారో తెలియదు. కానీ ఆ మూడు జిల్లాల్లో మాత్రం కోడాలి నాని చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్ పుట్టి, ఎక్కడో చదువుకుని, ఇక్కడ మన ప్యాకేజీ తీసుకుని వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా పని చేసిన ప్రశాంత్ కిషోర్ కు దశాబ్దాల తరబడి చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. అంటే దీన్ని కూడా రాజకీయ వ్యూహంతో వాడతారా, ఈ సెంటిమెంట్లు, మనోభావాలు పట్టవా, దీన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తారా ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేమీ పట్టవు, మా మనోభావాలు, మా ప్రాంత అభివృద్ధి పట్టదు అని వాపోతున్నారు.