భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..!
రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు అందకుండా చేశారు. ప్రభుత్వ భూములపై కన్నేశారు, అక్కడక్కడా కన్నమేసారు ; వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నది ఇదీ..!
ఒక్కటి మాత్రం నిజం. విశాఖకు రాజధాని వస్తుందో రాదో.., విశాఖ రాజధానిగా మారుతుందో.., లేదో కానీ.. భూములు మాత్రం పరాయిపరమవుతున్నాయి. నాడు టీడీపీ వాళ్లకి, నేడు వైసీపీ వాళ్లకి వరమవుతున్నాయి. విశాఖలో జరుగుతున్నది ఏమిటి..? నాడు, నేడు ఏంటి తేడా అనే అంశాలను ఓ సారి పరిశీలిస్తే..!!
ప్రభుత్వ భూములకు కొదవ లేదు..!!
విశాఖపట్నంలో ప్రభుత్వ భూములకు ఏమాత్రం కొదవ లేదు. విశాఖ చుట్టుపక్కల దాదాపు 40 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. కొండగట్టు, అటవీ, దేవాదాయ భూములున్నాయి. ఇవి ఎక్కువగా భీమునిపట్నం, పరవాడ, కాపులుప్పాడు, ఆనందపురం, అనకాపల్లి, విశాఖ గ్రామీణ పరిధిలోకి వస్తాయి. గడిచిన రెండు దశాబ్దాల నుండి భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో వీటిపై రాజకీయుల కళ్ళు పడ్డాయి. టీడీపీ హయాంలో కొన్ని అక్రమాలు ఎలా జరిగాయంటే..!?
టీడీపీ నేతల భూమాయలెన్నో..!!
ప్రభుత్వ భూములను కొట్టేయడం అంత ఈజీ కాదు. అలా అని అంత కష్టమూ కాదు. కాస్త తెలివి ప్రయోగిస్తే, భూముల లోతులు తెలిస్తే ఈ అక్రమాలు చేసేయొచ్చు. అందుకే టీడీపీ హయాంలో కొందరి నేతల అనుచరులు ఇదే చేసారు. కేవలం భీమునిపట్నం, ఆనందపురం, పరవాడ మండలాల్లోనే సుమారుగా 3 వేల ఎకరాలు కన్నమేసారు.
* ముందుగా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందొ గుర్తిస్తారు. ప్రభుత్వ భూములు మాజీ సైనికులకు, వికలాంగులకు, అల్ప వర్గాలకు పట్టాలు ఇస్తుంటారు. అందుకే ఇలా కొందరిని గుర్తించి భూముల కోసం దరకాస్తు చేయించేవారు. సదరు దరకాస్తు ఆధారంగా అధికారులు భూమిని కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఈ భూమిని రాజకీయులు కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. తద్వారా ప్రభుత్వ భూమి అధికారికంగా అక్రమానికి గురైనట్టే.
* ఇలా విశాఖ చుట్టుపక్కల మండలాల్లో 2000 నుండి 2015 మధ్య సుమారుగా 5 వేల ఎకరాలు జరగగా.., 2015 తర్వాతే మరో 2 వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది. మొదట ఒకరి చేతుల్లో పట్టాగా మారిన తర్వాత దాన్ని అమ్ముకోవడం, కమర్షియల్ గా మార్చేయడం సులువైన పని. టీడీపీ హయాంలో ఇదే జరిగింది. రాజకీయులు, అధికారులు కలిస్తే ఇది మరింత సులువవుతుంది. విశాఖలో అదే జరిగింది. మాజీ సైనికులకు, ఎస్సీలకు ఇచ్చిన భూమిని వారు అమ్ముకోకూడదు. కానీ అమ్మకానికి కూడా అధికారులు నిరభ్యంతర పత్రాలు ఇవ్వడమే ఇక్కడ అధికారుల పాత్ర. ఇలా గడిచిన ఆరేళ్లలో లక్షకి పైగా నిరభ్యంతర పత్రాలు ఇచ్చారు.
ఇప్పుడు వైసీపీ వచ్చాక ఏం జరుగుతుంది..!?
టీడీపీ హయాంలో అవినీతి జరిగింది. మరి వీటిని క్యాష్ చేసుకోవాలి కదా..? అందుకే ఆ నేతలే.. వైసీపీలో కొందరు కలిసి ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ గా మార్చేశారు. ఇక్కడ టీడీపీ / వైసీపీ అనేది పక్కన పెడితే.. భూ అక్రమాల విషయంలో అందరూ ఒక్కటయ్యారు. పార్టీలకు సంబంధం లేదు. వారి నాయకులకు మాత్రమే పార్టీలు, రంగులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే వారికి భూములను అమ్మేస్తూ వాటాలేసుకుంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఏ ఏడాది మర్చి వరకు విశాఖలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. సాధారణ ధరల కంటే అయిదు రేట్లు ఎక్కువ పలికింది. ఆగస్టు నాటికి లాక్ డౌన్ ఎత్తేసాక కొన్నాళ్ళు బాగానే ఉన్నా.. రాజధాని విషయంలో గందరగోళం ఉండడంతో కాస్త తగ్గాయి. ముఖ్యంగా విశాఖ శివారున భీమునిపట్నం, పరవాడ, ఆనందపురం ప్రాంతాల్లో భూములు ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. అక్కడితో వైసీపీ పాత్ర అయిపోలేదు అండోయ్.., నాడు జరిగినట్టే కొత్తగా భూముల గుర్తింపు.., వాటిని మళ్ళీ పట్టాలుగా ఇప్పించుకోవడం.., వాటిని తమ అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా షరా మామూలుగానే జరిగిపోతున్నాయి.