ఓ పక్క రాష్ట్రాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి, మరో పక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కొనసాగే విషయంలో తలనొప్పి ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఊరట లభించింది.
ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు మే 27లోపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం ఉద్దవ్ పదవీ గండం నుంచి గట్టెక్కినట్లు అయింది. మహా వికాస్ అఘాడీ తరుఫున సీఎంగా ఉద్దవ్ బాధ్యతలు చేపట్టి ఈ నెల 27 నాటికి ఆరు నెలలు పూర్తి కావస్తోంది. అయితే ఆయన ఇంత వరకూ ఏ సభకూ ఎన్నిక కాలేదు. నవంబరు 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. పదవిని చేపట్టిన ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే అని భావిస్తున్న తరుణంలో కరోనా తీవ్రతరం కావడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 26న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ద
ఉద్ధవ్ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని మహారాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసినా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ ను ఎన్ సి పి నేత, మంత్రి అజిత్ పవార్ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా అయన ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. దీనితో శివసేన సీనియర్ నేత గవర్నర్ తీరుపైన, పరోక్షంగా కేంద్రంలోని
బిజెపినీ విమర్శించారు. చివరకు స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ రంగంలోకి దిగి మొన్న గవర్నర్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్కు నిన్న గవర్నర్ లేఖ రాశారు. ఏప్రిల్ 24 నుంచి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయననీ, వీటి భర్తీపై నిర్ణయం తీసుకోవాలనీ ఆయన తన లేఖలో కోరారు.
మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఉద్ధవ్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పిఎంకు వివరించారు. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ రాజకీయ అస్థిరత అనేది సరైంది కాదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉద్ధవ్ ప్రధాని మోదీని కోరారు. ఎమ్మెల్సీగా తనను గవర్నర్ నామినేట్ చేయకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ప్రధానికి ఉద్ధవ్ తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మహా సీఎం ఉద్ధవ్ ఎదుర్కొంటున్న ఒక తలనొప్పికి పరిష్కారం లభించినట్లు అయింది.
దేశంలోనే కరోనా బాధిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది. కోవిడ్-19 కేసుల సంఖ్య 10 వేల మంది పైచిలుకు చేరుగా, 400 మందికి పైగా మృతి చెందారు.