Mangalagiri: తెలుగునాట పొలిటికల్ బ్రాండ్ కి కొడుకు.. సినీ బ్రాండ్ కి మనవడు.. ఒక పెద్ద సామాజికవర్గానికి రాష్ట్రస్థాయి యువ నాయకుడు.. కానీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యాడు.. ఆయనే నారా వారి వారసుడు..! సామాజికవర్గం కలిసి రాలేదు, బీసీలు నెత్తిన పెట్టుకోలేదు.., ఓటర్లు నమ్మలేదు.. అందుకే లోకేష్ కి ఓటమి రుచి చూపించారు.., వరుసగా రెండోసారి రామకృష్ణారెడ్డిని గెలిపించారు మంగళగిరి ఓటర్లు..! మరి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి..!? దాదాపు రెండున్నరేళ్లు కావస్తుంది. ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా..!? లోకేష్ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయా!? క్షేత్రస్థాయి వాస్తవాలేమిటో ఈ కథనంలో చూద్దాం..!!
Mangalagiri: అన్నిటికీ కేంద్రం అదే..!
ఏపీలో ప్రస్తుతం రాజకీయ కేంద్రం. పరిపాలనా కేంద్రం కూడా మంగళగిరి నియోజకవర్గమే… విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న మధ్యస్థాయి పట్టణం, ఆ పక్కనే రెండు మండలాలు కలిసిన నియోజకవర్గం ఇది..! ఆంధ్రప్రదేశ్ లో జనసేన రాష్ట్ర కార్యాలయం, టీడీపీ జాతీయ కార్యాలయం, అధికార వైఎస్ఆర్ సీపీ జాతీయ కార్యాలయం సహా పరిపాలనా కార్యాలయం (ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్), ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం కూడా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోనే ఉన్నాయి. ఇటువంటి మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తే….
* మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ ఎందుకు ఎంచుకున్నారని ఆయన ఓడిపోయిన తరువాత చాలా మంది బాధపడ్డారు. ఆయితే ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఒకరకంగా మంచిదే. రాజకీయ అనుభవానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఓటమి ద్వారా లోకేష్ ఆ అనుభవం పొందారో లేదో, ఆయనను చూస్తేనే తెలుస్తుంది..! సగం సగం మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ. పద్మశాలీలు, దేవంగ (చేనేత) సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 40 శాతం మంది ఉన్నారు. ఎస్సీ, కాపు, రెడ్డి, కమ్మ మొత్తం కలిపి మిగిలిన 60 శాతంగా ఉన్నారు. ఇక్కడ గెలుపు ఓటములను నిర్ధేశించేది బీసీ వర్గీయులే. 8 గ్రామాల్లో రెడ్డి సామాజికవర్గం, దుగ్గిరాల మండలంలోని పది గ్రామాల్లో కమ్మ సామాజికవర్గం డామినేటింగ్ ఓటర్లు ఉన్నారు. నారా లోకేష్ ఆనాడు బీసీ ఓటింగ్ అత్యధికంగా ఉండటం వల్ల ఆ ఓట్లతో పాటు కమ్మ సామాజికవర్గం సపోర్టుతో నెగ్గవచ్చని భావించి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ బీసీలు ఎమ్మెల్యే ఆర్కే వెంట ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఆర్కేకి ఈ నియోజకవర్గం కాస్త ప్రతికూలంగా మారింది. ఎమ్మెల్యే గా ఆర్కే రెండోసారి గెలిచిన తరువాత ఆయనపై వ్యతిరేకత కొన్ని చోట్లా పెరిగింది.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా మంగళగిరి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేయడం లేదనే అపవాదులు ఉన్నాయి. ఈ రెండున్నర సంవత్సరాల్లో పెద్దగా జరిగిన అభివృద్ధి ఏమీలేదు. కాకపోతే మంత్రి పదవి ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. అయితే ఆర్కే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై బాగా పోరాడారు. నిత్యం జనాల్లో ఉన్నారు. అభివృద్ధి పనులపై శ్రద్ద చూపారు. పలు విషయాల్లో చంద్రబాబుపైనా కోర్టుకు వెళ్లి పోరాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజల్లో తిరగడం లేదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మంగళగిరి పట్టణం, తాడేపల్లి ప్రాంతం, దుగ్గిరాల మండలంలో ఆయన పనితీరుపై కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఇదే సమయంలో లోకేష్ పట్ల కూడా ఏమీ సానుభూతి పెరగలేదు.
లోకేష్ వదిలేసినట్టున్నారు..!
నారా లోకేష్ ఇంకా జాతీయ స్థాయి నాయకుడవ్వలేదు. పార్టీలో ఒక ట్యాగ్ తగిలించుకుని, జాతీయ కార్యదర్శి అనుకుంటే చాలదు. ప్రజాక్షేత్రంలో గెలిచి, ప్రజల తరపున మాస్ లీడర్ గా ఎదిగి అప్పుడు ఏ తోకలైనా, ట్యాగ్ లైనా తగిలించుకోవచ్చు. లోకేష్ ఓడిన తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని పెద్దగా అంటిపెట్టుకున్నది లేదు. అయితే ఎమ్మెల్యే ఆర్కేపై ఉన్న కొద్దో, గొప్పో వ్యతిరేకత టీడీపీ పట్ల సానుకూలతగా మారుతుంది. గంజి చిరంజీవులు అన్నీ తానై నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీసీ నేతకు టికెట్ ఇస్తే పోటీ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంటుంది.. మళ్ళీ లోకేషే పోటీ చేయాలి అనుకుంటే ఆయన ఇప్పటి నుండి రంగంలోకి దిగాల్సి ఉంది. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి ఏవరైనా పుంజుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవులు కేవలం 12 ఓట్ల తేడాతోనే పరాజయం పాలైయ్యారు. ఆర్కే మొదటి సారి గెలిచింది కేవలం 12 ఓట్ల మెజార్టీతోనే. చిరంజీవులు బీసీ సామాజిక వర్గ నేత. లోకేష్ ఓడిపోయినప్పటికీ పార్టీలో ఇప్పటికీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీలో కీలకంగా తిరుగుతున్నారు. మరో సారి చిరంజీవులు పోటీ చేసినా లేక నారా లోకేష్ పోటీ చేసినా.. ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి పరువు నిలబడే పరిస్థితులు ఉన్నాయని స్థానికుల నుండి వస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతం ఆర్కే పై కనబడుతున్న వ్యతిరేకతన పోగొట్టుకునే పనిలో ఉన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆయనకు సమాచారం రావడంతో కొంత అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఆర్కే మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. మంత్రి పదవి వస్తే ఒకలా ఆయన రాజకీయం ఉంటుంది. ఒక వేళ మంత్రి పదవి రాకపోయినా నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉందని అంటున్నారు.