రైతాంగ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నది నిజం.. దాదాపు పది రోజులుగా రోడ్డు మీదనే వేలాది రైతులు పడిగాపులు పడుతున్నది నిజం. నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో గొంతెత్తి అరుస్తున్నది నిజం…. ఇవన్నీ కనిపిస్తున్నా రైతు ఉద్యమం పై ఓ వర్గం తీవ్ర దుష్ప్రచారం మొదలెట్టింది. నిజాన్ని కప్పి పుచ్ఛి కేవలం రైతుల గోషాకు ఘోరీ కట్టే పనిలో ఉంది..
(అసలేమిటి ప్రచారం… నిజమెంత చూద్దాం )
1) ఈ ఉద్యమంలో రైతులు ఎవరూ లేరు, అంతా కిరాయి జనమే. (ప్రచారం)
వారు రైతులే కాకుంటే ప్రభుత్వం చర్చలకు ఎందుకు రమ్మంది?? వ్యవసాయ సంఘాలు దాదాపు 36 ఉన్నాయి. ఈ సంఘాలు ఎవరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉగ్రవాదులతో ప్రభత్వం
చర్చిస్తున్నదా? అన్యమతస్థులు రైతులు కాకూడదా? వారు ఉయామానికి మద్దతు ఇస్తే ఉద్యమం ఉగ్రవాదమవుతుందా ??
2) ఇది పంజాబ్కే పరిమితమైన ఉద్యమం. (ప్రచారం)
ఒక్కో ఉద్యమం ఒక్కో సమయంలో ఒక్కో చోట, ఒక్క పద్దతిలో మొదలవుతుంది. ప్రపంచ చరిత్ర
చూస్తే ఇది అర్ధమవుతుంది. ఏ ఉద్యమం దేశమంతా ఒకే స్థాయిలో జరగదు. జరగలేదు. ఎమర్జెన్సీకి ముందు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం మొదట గుజరాత్, బీహార్ల లోనే ప్రారంభమైంది. ఆ తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సకలపక్షాలు ఏకమై దేశమంతా వ్యతిరేకించాయి. మొదట కమ్యూనిస్టుల పైనే దాడి మొదలైంది. అందరిపై దాడి జరిగే సరికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడడానికి ఎమర్జెన్సీ వ్యతిరేక పక్షాలన్నీ సిద్ధమయ్యాయి. నాడు ఇందిరాగాంధీ ఈ పోరాటాన్ని విదేశీ కుట్రగా ప్రచారం చేసింది. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయింది.
3) కాంగ్రెస్, ప్రతిపక్షాలు డబ్బులిచ్చి ఉయామాన్ని నడిపిస్తున్నాయి (ప్రచారం)
ఏ ఉద్యమానికైనా డబ్బులు అవసరమే. కానీ డబ్బులతో ఏ ఉద్యమమూ రాదు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చలిలో గజగజ వణుకుతూ నిద్రిస్తుంటే దేశభక్తులెవరైనా స్పందిస్తారు. దేశవ్యాపితంగా , విదేశాల్లో సైతం రైతులకు సంఘీభావం వెల్లడవుతోంది. స్వచ్ఛందంగా విరాళాలు పంపిస్తున్నారు. వారు తమ తిండి తమతో తెచ్చుకోవడంతోపాటు తమను కొట్టడానికి వచ్చిన జవాన్లకు సైతం పెడుతున్నారు. ఇది మీడియాలో కనిపిస్తుంది.
4) చైనా – పాకిస్తాన్ ఏజెంట్లు వీటిని రెచ్చగొడుతున్నారు. (ప్రచారం)
నిజానికి ఉద్యమానికి ఏ దేశం నుండైనా మద్దతు వచ్చిందంటే అది కెనడా లాంటి దేశాల నుండే. విదేశాల్లో ఉన్న భారతీయులంతా ఉద్యమాన్ని ఆసక్తితో గమనిస్తున్నారు. మద్దతూ తెలియజేస్తున్నారు. వారినందరినీ దేశద్రోహులు అనలేం.
5) ఖలిస్తానీ ఉగ్రవాదులు నడుపుతున్నారు. (ప్రచారం)
మహా ఉద్యమంగా సాగుతున్న రైతు సమరంలో అక్కడో ఇక్కడో ఒకరు సిక్కు మత జెండాలు పట్టుకుంటే వారంతా ఉగ్రవాదులైపోరు. అసలు ఖలిస్థాన్ గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఆ ఉద్యమం ఇప్పుడు అంత ఉదృతం గా లేదు.
6) వ్యవసాయ మార్కెట్ లోని దళారుల ఉద్యమం (ప్రచారం)
వ్యవసాయ మార్కెట్లు నిర్వహించేది ప్రభుత్వం. అక్కడ దళారుల్ని ప్రోత్సహించేదీ ప్రభుత్వాలే. మద్దతు ధరకు ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేస్తే దళారులు ఎక్కడి నుండి వస్తారు? రైతు సొమ్ము కాజేయడానికి పాలక పార్టీల నుండే దళారులు పుట్టుకొస్తున్నారు. పోనీ దళారీల ఉద్యమం అనుకుంటే ఎన్ని వేల మంది రైతుల్ని వారు ఎలా తీసుకురాగలరు?
7) రైతులకు స్వేచ్ఛనిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. (ప్రచారం)
రైతులు కోరుతున్నది రక్షణ. స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కార్పొరేట్ వారి దగ్గర మమ్మల్ని ఇలాంటి బాధ్యత లేకుండా వదిలేయొద్దు అన్నది వారి డిమాండ్.
8) మార్కెట్ యార్డులు మూత పడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. (ప్రచారం)
ఈ విధానంలో మార్కెట్ యార్డులు మూత పడతాయన్నది నిజం. అది చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రాల్లోని మార్కెట్ యార్డుల చట్టాలన్నింటినీ సవరించాలని ఈపాటికే ఆదేశాలు పంపింది. మార్కెట్ సెస్సులను కూడా రద్దు చేసింది. ఇది ఒక సంకేతంగా భావించాలి.
9) బ్లాక్ మార్కెట్ రద్దవుతుంటే దళార్లు ఓర్చుకోలేకపోతున్నారు. (ప్రచారం)]
ఈ చట్టాలతో బ్లాక్ మార్కెట్ వైట్ మార్కెట్గా మారే అవకాశం కనిపిస్తుంది.
బడా వ్యాపారస్తులు ఎంత సరుకైనా ఎంత కాలమైనా నిల్వబెట్టుకోవచ్చు. తద్వారా రైతుకు లాభసాటి ధర కోసం బేరమాడే శక్తి లేకుండా చేస్తారు. రిలయన్స్ ఫ్రెష్ లాంటి షాపులు పచ్చగా ఉంటాయి.
10) ముస్లిం ఉగ్రవాదులు సిక్కు వేషాలు వేసుకొని వస్తున్నారు. (ప్రచారం)
బీజేపీకి నచ్చకపోతే ఎవరైనా ఉగ్రవాదో, జాతికే సమైక్యత చెడగొట్టేవారో అయిపోతారు. వెంటనే దేశభక్తి సీన్లోకి వస్తుంది. ఉద్యమం లోనూ రైతు రైతు లాగే ఉన్నాడు. వందమంది రైతుల్ని చూడకుండా, ఎవేరో ఒకర్ని చూపి ఉయామాన్ని వేరుగా తీసుకువెళ్లడం సరైన చర్య కాదు.