Minister Balineni: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా పర్యటనకు వెళ్లారు. సాధారణంగా ఇది పెద్ద వివాదం కాదు. కానీ.. మంత్రి బాలినేని ప్రత్యేక ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ లో.. కొందరు పెద్దలతో కలిసి రష్యా పర్యటనకు వెళ్లారు.. ఇది వివాదమే కానీ నిజాలు వెతకాల్సిన అంశం కాదు.. కానీ తన శాఖలో ట్రూ అప్ పేరిట చార్జీలు పెంపుతో జనం నుండి నిరసనలు వస్తున్న వేళ.. సీఎం ఆఫీస్ మొత్తం ఓ విషయంలో ఒత్తిడిలో ఉన్న వేళ.. సీఎం దగ్గరి నేతలందరూ ఓ అంశంలో తలలు పెట్టుకుని ఆలోచిస్తున్న వేళ.. ప్రభుత్వం చుట్టూ కొన్ని వివాదాలు చుట్టిన వేళ మంత్రిగారి ప్రత్యేక ప్రైవేట్ పర్యటన వివాదమూ.., నిజాలు వెతకాల్సిన అంశమూ.. పార్టీలో చర్చ జరగాల్సిన అంశం కూడా..! అందుకే మంత్రి బాలినేని రష్యా పర్యటనపై నిన్నటి విపరీత చర్చ మొదలయింది. సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ప్రతిపక్ష మీడియా గొంతెత్తి ఆరాలు తీస్తుంది. ఇంతకూ మంత్రి గారు ఇప్పుడు ఇలా వెళ్ళడానికి కారణాలేమిటి..? ఎక్కడకు వెళ్లారు.? ఎందుకు వెళ్లారు..? ఎవరెవరితో వెళ్లారు..? అనేది లోతుగా పరిశీలిస్తే…!
Minister Balineni: కొందరు రాజకీయ ప్రముఖులు కూడా..!
మంత్రి బాలినేనితో సహా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి.., ఓ సీనియర్ ఎమ్మెల్యే.., మరో కీలక నేత, ఒక కాంట్రాక్టర్ సహా ఏపీకి చెందిన కొందరు నాయకులు వెళ్లినట్టు తెలిసింది. మొత్తం 12 మంది ఒక బృందంగా ఏర్పడి ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాట్లాడుకుని.., ఈ ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ లో వెళ్లారు. అందుకు ముందస్తుగా ఆ ట్రావెల్ ఏజెంట్ కి చెరో రూ. 15 లక్షలు డిపాజిట్ చెల్లించినట్టు సమాచారం. మొత్తం 18 మందికి సీటింగ్ సామర్ధ్యం ఉన్న ఈ ఫ్లయిట్ లో 12 మంది ప్రముఖులు వెళ్లారు. రష్యాలో నాలుగు రోజుల పాటూ గడిపి ఈ నెల 10న తిరిగి రానున్నారు. అక్కడ కార్యక్రమాలన్నీ వ్యక్తిగతమే. వారి వారి అభిరుచుల మేరకు అందరి అభిప్రాయాలూ, అలవాట్లు కలిసి అక్కడ గడపడానికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదే బృందం ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా గోవా వెళ్లినట్టు సమాచారం. మంత్రి బాలినేని పర్యటన పూర్తిగా చట్టబద్ధమే, వ్యక్తిగతమే, ఏ మాత్రం అధికారికం కాదు. సీఎం ఆఫీస్ కి సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తుంది.
వైసీపీలో గుర్రు.. ఈ సమయంలోనా..!?
బాలినేని అలా వెళ్లడం తప్పు కాదు. ఆయన ఇష్టం, ఆయన అభిరుచి అది కావచ్చు. కాకపోతే ఆయన వెళ్లిన సమయమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సొంత పార్టీలో కూడా పెద్ద చర్చకు కారణమవుతుంది. ఇప్పుడు వైసీపీ పెద్దలు ఓ రకమైన తలనొప్పితో ఉన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దుకోరుతూ రఘురామా వేసిన పిటిషన్ తుది తీర్పు ఈ నెల 15వ తేదీన రానుంది. ఈ తీర్పు ఎలా వస్తుంది..? దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏం చేయాలి..? అనే ఆలోచనల్లో పార్టీలో కొందరు ముఖ్యులు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.. పార్టీ పెద్దల్లో ఇది కీలకమైన అంశంగా మారింది. మరో వైపు రోడ్లు బాలేవంటూ ప్రతిపక్షాల ఆందోళనలు, వినాయక చవితి ఉత్సవాలపై నిషేధంతో ప్రభుత్వంపై విమర్శలు.., విద్యుత్తు చార్జీల పెంపు కారణంగా ఎదురవుతున్న విమర్శలు అన్నీ ఒకేసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. కోర్టు కేసులు, బయట విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగులతో వైసీపీ పెద్దలు కొంత ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమే. ఇన్ని సమస్యలు, తలనొప్పులు ఉన్న సమయంలో.. మంత్రి బాలినేని ఇలా వ్యక్తిగత అభిరుచుల కోసం విదేశాలకు వెళ్లడం బాలేదంటూ వైసీపీలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బాలినేని కేవలం మంత్రి మాత్రమే కాదు. పార్టీలో కీలక నేత. సీఎం జగన్ కి దగ్గరి బంధువు. పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. కానీ ఈ కీలక సమయంలో ఆయన వెళ్లడంతో రెండు వైపులా విమర్శలు ఎదురవుతున్నాయి..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?