నిర్మలమ్మది ఎంత నిర్మలమైన మనసో… మోడీది ఎంత ముచ్చటైన మాటో… కేంద్రానిది ఎంత జాలి హృదయమో…! అబబబబ్బబ్బా ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏంటి..? దేశానికి ఉదారంగా ఇచ్చేయడం ఏంటి..? పేదల పట్ల అంకిత భావం ఏంటి..? బాగుంది కదా…!!! అవును బాగానే ఉంది. మరి మధ్యతరగతి వర్గాలకే ఇస్తున్న ఈ ప్యాకేజి సంగతి పేదలకు దక్కలేదేమి…? పరిశ్రమలకు దక్కుతున్న ఈ ప్యాకేజీ రోడ్డు మీద బజ్జిల బండి నడుపుకునే సాధారణ వ్యక్తికీ దక్కలేదేమి..? ప్యాకేజీ అంత బరువు తూగుతుంటే పేదల తక్కెడ ఇంకా కిందకు దిగడం లేదేంటి..? అదే నిర్మలమ్మ మనసులో లోతు, అదే మోడీ మదిలో మాట.
విడతల ప్యాకేజీలు…!
బాహుబలి ప్యాకేజీ కూడా బాహుబలి సినిమాలా విడతల వారీగా విడుదలవుతుంది. ఆ సినిమా సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమైనట్టు ఈ ప్యాకేజీ మాత్రం సాధారణ వర్గాలకు అర్ధం కావడం లేదు. సింపుల్ గా చెప్పుకోవాలంటే లిక్విడిటీని (రుణ పరపతిని) పెంచి… పరిశ్రమలకు రుణ వరాలిచ్చి.., రాయితీలనిచ్చి.., వ్యాపారులకు, ఆహార ఉత్పత్తులకు, మధ్యతరగతి వర్గాలకు కొద్దిగా వరాల జల్లు కురిపించారు. ఒకే..! విడతల వారీగా ప్యాకేజీల్లో మనకు ఎక్కువగా కనిపించినవి వ్యాపారాలు, పరిశ్రమలకు రుణాలు. రాయితీలు మాత్రమే. మొదటి మూడు రోజుల్లో ప్రకటించిన ప్యాకేజీ వివరాల్లో చూసుకుంటే…!
* మొదటి రోజున : మే 13 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ ఆరు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మా నిర్భర భరత్ పేరిట ఇచ్చారు. సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు రూ. 3 . 70 లక్షల కోట్లు.., ఉద్యోగులకు భవిష్య నిధి వాటా చెల్లింపుగా 2500 కోట్లు.., (అంటే రూ. 15000 లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వమే మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది).. సంస్థల వాటా తగ్గింపు రూ. 6750 కోట్లు.., (అంటే 12 శాతం ఉన్న భవిష్యనిధి చందాని 10 శాతానికి తగ్గించింది. ఈ 2 శాతం యాజమాన్యాలకు ఊరట కలిగింది)..! అలాగే రియల్ ఎస్టేట్ పనులు, కాంట్రాక్టు పనులకు గడువు పెంచింది. పన్నులు చెల్లింపునకు నవంబరు వరకు గడువు పెంచింది. పన్ను రాయితీలు రూపంలో రూ. 50 వేలకోట్లు, డిస్కం లకు రుణాలు రూపంలో రూ. 90 వేల కోట్లు… ఇలా మొత్తం కలిపి రూ. 6 లక్షల కోట్ల వరకు తోలి సంచి అందింది.
రెండో రోజున : నిన్న (గురువారం) మళ్ళీ నిర్మలమ్మ వచ్చి మరో రూ. ౩. 16 లక్షల కోట్ల వరాల జల్లులు ప్రకటించారు. 8 కోట్ల మంది వలస కార్మికులకు రెండు నెలల పాటు ఉచిత రేషన్ కి రూ. 3500 కోట్లు.., 3 కోట్ల మంది రైతులకు నాబార్డు ద్వారా మూలధనం రూ. 30 వేల కోట్లు.., రెండున్నర లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఋణం రూ,. 2 లక్షల కోట్లు…, గృహ నిర్మాణ రంగంలో రాయితీ పథకాన్ని పొడిగించడం ద్వారా అదనంగా రూ, 70 వేల కోట్లు వస్తాయట. ఇలా… రెండో రోజుల ప్యాకేజీలో లెక్కలు చెప్పారు.
మూడో రోజున : (శుక్రవారం) ఈరోజు తాజాగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన నిర్మలమ్మ వ్యవసాయం, పాడి, ఆక్వా, కోల్డ్ స్టోరేజీలు… ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలకు వరాలిచ్చారు. మరో లక్ష కోట్ల వరాలిచ్చారు. ఇలా… మొత్తానికి మూడు రోజుల్లో ఇప్పటి వరకు 11 లక్షల కోట్ల లెక్కలు అప్పచెప్పేశారు.
పేద వర్గాలకు ఒరిగినదేమిటి…?
ఇప్పటి వరకు ప్రకటించిన 11 లక్షల కోట్లలో రుణాల రూపంలో రూ. 4 లక్షల కోట్లు… రాయితీల రూపంలో రూ. ౩ లక్షల కోట్లు పోగా… మిగిలింది పెట్టుబడుల లెక్క, భవిష్యనిధి లెక్కలు ఉన్నాయి. అవీ తీసెయ్యగా మిగిలిన కొద్దీ లెక్కలు వలస కార్మికులకు చోటు కల్పించారు. రాయితీలు, రుణాలను, బ్యాంకుల్లో అదనంగా కల్పించే రుణ సదుపాయాలను ప్యాకేజీగా పోల్చి… లెక్కల్లో చూపించి నిర్మలమ్మ మనసు చాటుకున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కరోనా లాక్ డౌన్ కారణంగా అత్యధికంగా నష్టపోయిన పేద వర్గానికి దక్కినది ఏంటి అనేది సూటిగా చెప్పలేదు. అంతో కొంత ఊరటగా ఉండే రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పరిశ్రమపై నమ్మకం ఉంటె కేంద్రం అనుమతి లేకపోయినా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. పరిశ్రమ పరిస్థితి బాగోకపోతే కేంద్రం ఎన్ని రాయితీలు, రుణాలు ఇచ్చినా బ్యాంకులు ఇవ్వవు. ఇలా ప్యాకేజీల కారణంగా ప్రత్యేకంగా ఒరిగే ప్రయోజనం స్వల్పమే అన్న విమర్శా ఉంది.
* దేశం లోని దాదాపు 18 శాతం పేదలకు, 12 కోట్ల మంది వలస కార్మికులకు కనీసం ఆరు నెలల పాటు భరోసానిచ్చే వరాలు లేవు. ఉండవు కూడా ఎందుకంటే… తిరిగి పన్నులు చెల్లించేది పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగ వర్గాలు, నిర్మాణ రంగాలు మాత్రమే. సో… ఇచ్చినవి తిరిగి తెచ్చుకోవాలంటే ఏ వర్గాలకు ఇవ్వాలో బాగా తెలిసిన విత్త మంత్రి అదే వర్గాలకు ఇచ్చారనడంలో సందేహం లేదు.