Free COVID vaccine: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వారి లీడర్లంతా వత్తాసు పలుకుతూ ఒకే మాటపై ఉంటూ దేశంలో ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ పట్టువదలకుండా ఉండడం అనేది మనం చాలా సార్లు గమనించాం. అది ఎన్ఆర్సి బిల్లు కావచ్చు మరే ఇతర విషయమైనా కావచ్చు… కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ దేశంపై పట్టు ఉంది అన్న ధైర్యంతో ఈ విధంగా వ్యవహరించడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఉచిత వ్యాక్సిన్ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వం కొంచెం జంకింది అంటారా?
ఒక్క డోసు రూ.400
ఈ విషయానికి వస్తే ముందుగా ఎన్నో కథనాలు ఉచిత వ్యాక్సిన్ పైన వచ్చాయి. వ్యాక్సిన్ ఒక డోసు నాలుగు వందల రూపాయలకు లభిస్తుందని… రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే వాటిని తయారీదారుల నుండి కొనుగోలు చేసి వారి ప్రజలకు ఉచితంగా ఇచ్చి ఆ అదనపు ఖర్చుని కూడా వారే భరించవలసి ఉంటుంది అని అన్నారు. ఇదే చివరి మాట చాలామంది ఫిక్స్ అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం ఒక వారంగా ప్రచారం జరుగుతున్నా క్లారిటీ ఇవ్వకపోవడంతో వ్యాక్సిన్ బాదుడు తప్పదు అనుకున్నారు జనాలు.
మీరు మాట తప్పుతారేమో… మేం కాదు
కట్ చేస్తే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా నిన్నటి రోజున 10 రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని నిర్ణయించారు. అస్సాం, బీహార్, ఛత్తీస్గర్ వంతి చిన్న రాష్ట్రాల క్యాబినెట్లు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. ముందు మోడీ దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ మాట ఇచ్చారని ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే తాము మాట మార్చే పార్టీ కాదని ముందు నుంచే మేము ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చాం కాబట్టి అదనపు ఖర్చు మా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రజలకు మాత్రం ఉచితంగా ఇచ్చి తీరుతామని ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నానా హైరానా పడిపోయినట్లు ఉంది.
అసలేమైంది?
అంతే… ఈ రోజున ఒక వ్యాక్సిన్ 150 రూపాయలు మాత్రమేనని… అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉచితంగా 50శాతం వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం జరుగుతుందని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించేసింది. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎంతో చర్చ జరుగుతున్నా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం వరుసగా పది రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్ ప్రకటించేసరికి ఇలా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే మన బిజెపి పెద్దలంతా బిజీగా ఉండి ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఆలస్యం జరిగిందా…. లేదా దేశంలో ఉన్న పరిస్థితి పై సమీక్ష వేసుకొని ఉన్నఫలంగా అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఈ ప్రకటన చేశారా అన్నది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. ఏదైతేనేం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది… అదే చాలు!