పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. భారతదేశం తరువాతి అడుగు ఏమిటా అని అందరూ ఆదుర్దా పడుతున్న ప్రస్తుత సమయంలో ఈ దాడికి కారణమైన స్థితిగతులని పరిగణలోకి తీసుకోవటం అవసరం. కాశ్మీర్కి సంబంధించి కానీ పాకిస్థాన్కి సంబంధించి కానీ ఒక అర్ధవంతమైన విధానాన్ని రూపొందించడంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు దారితీసింది.
బలహీనమైన సర్కారు అనిపించుకుంటామన్న భయంలేని హిందూ జాతీయవాద ప్రభుత్వం కాబట్టి మోదీ ప్రభుత్వం పాకిస్థాన్తో చర్చల విషయంలో మెరుగైన స్థితిలో ఉండొచ్చు అని మొదట్లో ఆశ ఉండింది. ఒకప్పుడు వేర్పాటువాదుల సానుభూతి పార్టీ అనిపించుకున్న పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీతో బిజెపి లంకె అన్నదే కష్టం. అలాంటిది ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటపు చేయడంతో కాశ్మీర్కి సంభందించి ఒక శాశ్వత రాజకీయ పరిష్కారం లభిస్తుంది అనే ఆశలు మొలిచాయి.
కానీ ఆ ఆశలు తొందరలోనే ఆవిరయ్యాయి. పదవీకాలం మొదట్లో సరిహద్దుకి అవతల వైపు నుండి దాడులు జరుగుతూ ఉన్నాకూడా పాకిస్థాన్ తో మాట-మంతీ చురుకుగానే సాగింది. కానీ ఇటువంటి సంక్షోభాలని ముందుగానే గ్రహించే ఒక విస్తృత వ్యూహం లేకపోవటం వల్లన అది ముందుకి సాగలేదు. జమ్మూ-కాశ్మీర్లోని వాస్తవమైన రాజకీయ సమస్యని బిజెపి విస్మరించి తనకి అలవాటైన ఊకదంపుడు హిందుత్వ వాదనతో ముందుకు నడిచింది.
కాశ్మీర్, ఉరిలో భారత సైన్యం బేస్ క్యాంప్ మీద టెరరిస్టుల దాడికి జవాబుగా వాస్తవాధీన రేఖకి అవతలి “తీవ్రవాద ప్రయోగ కేంద్రాల” మీద జరిగిన ‘సర్జికల్ స్టయిక్స్కు దారి తీసింది ఈ విధానమే.. ఈ దాడిని అనుసరించి జాతీయవాద ఉద్రేకాలు మిన్నంటాయి. ఒక బాలీవుడ్ హిట్ సినిమా కూడా వచ్చింది. కాశ్మీర్-
పాకిస్థాన్ సమస్య పరిష్కారానికి మోదీ గట్టి చర్యలు తీసుకుంటున్నారు అనుకునేందుకు ఇది ఒక సాక్ష్యంగా మారింది.
కానీ అందుబాటులో డేటా ఈ అభిప్రాయాన్ని సమర్ధించటం లేదు. పుల్వామలో నలభై మంది కేంద్ర రిజర్వ్ పోలీసు జవాన్ల మరణానికి దారి తీసిన నిఘా, పోరట వ్యవస్థల వైఫ్యల్యాన్ని అలా ఉంచితే విస్తృత స్థితిగతులు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు.
ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాల గురించి సమాచారం సేకరించే సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్ వారి డేటా ప్రకారం 2014 నుండి అనేక విషయాలలో పరిస్థితి మరింత దిగజారింది. మొదటగా “కిల్లింగ్స్” గా ఆ పోర్టల్ చెబుతున్న సంఘటనలు స్థిరంగా పెరుగుతున్నాయి.
జమ్మూ-కాశ్మీర్ లో పెద్ద తీవ్రవాద దాడులు(2014-2019)
గమనిక- ఈ డేటా 2019 ఫిబ్రవరి 15 వరకు
ఈ సమాచారాన్ని మరింత సూక్ష్మ స్థాయిలో చదివినా పరిస్థితి అంతే నిరాశాజనకంగా ఉంది. జమ్మూ-కాశ్మీర్ లో హత్యకి గురయిన సాధారణ ప్రజలు, సైనిక జవాన్ల సంఖ్య కూడా గత ఐదు సంవత్సరాలుగా స్థిరంగా పెరుగుతున్నది.
జమ్మూ-కాశ్మీర్ లో హత్యకి గురయ్యిన సాధారణ ప్రజలు (2014-2019)
గమనిక- ఈ డేటా 2019 ఫిబ్రవరి 15 వరకు
జమ్మూ-కాశ్మీర్ లో హత్యకి గురయ్యిన సైనికులు(2014-2019)
గమనిక- ఈ డేటా 2019 ఫిబ్రవరి 15 వరకు
ఈ సంఖ్యలు గత ఐదు సంవత్సరాలుగా ఎందుకు పెరుగుతున్నాయి అనేదానికి జవాబుగా గత ఐదు సంవత్సరాలలోనే ఎప్పుడూ లేనంతగా తీవ్రవాదులని భారతదేశ సైనిక దళాలు మట్టుబెట్టాయి అని మోదీ ప్రభుత్వం చెప్పవచ్చు.
జమ్మూ-కాశ్మీర్ లో హతమయిన టెరరిస్టులు/తిరుగుబాటుదారులు (2014-2019)
గమనిక- ఈ డేటా 2019 ఫిబ్రవరి 15 వరకు
డేటా ప్రకారం ఎదురుకాల్పులు పెరుగుతున్నా కూడా (అందుకే ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉంది) ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కాశ్మీర్ వ్యాలీ నుండి మిలిటెంటు దళాలలోకి చేరుతున్న వారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతున్నది.
కాశ్మీర్ లో సాయుధ మిలిటెంట్ దళాలలోకి చేరిన వారు (2010-2019)
ఒక స్పష్టమైన వ్యూహంతో సందర్భాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కానీ తాము తీవ్రవాదులని శిక్షిస్తున్నామనే అనే ఊకదంపుడు మాటలతో బిజెపి పబ్బం గడుపుకుంటున్నది. అంతే కాక కాశ్మీర్ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక భావోద్వేగాల్ని దేశమంతటా రెచ్చకొట్టింది. ఇవన్ని మిగతాచోట్ల బిజెపి గెలుపుకి దోహదం చేస్తాయేమో కానీ కాశ్మీర్ లో మాత్రం పరిస్థితిని మరింత దిగాజారుస్తాయి.
దీని ఫలితం? గత దశాబ్దం మొత్తంలో 2018 సంవత్సరమే అత్యంత హింసాత్మకమైనది. వాస్తవాధీన రేఖకి ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనల సంఖ్య నాటకీయంగా పెరిగింది. పుల్వామా దాడి రాబోయే స్వల్ప కాలంలో భారతదేశం పాకిస్థాన్తో ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం మీదకి మన దృష్టిని మళ్లించి ఉండొచ్చు . కానీ, గట్టి చర్యలు, యుద్ధం అనే డిమాండ్ల మధ్య ఒక పెద్ద ప్రశ్న అలాగే మిగిలిపోతుంది: కాశ్మీర్కి సంబంధించి కానీ, పాకిస్థాన్కి సంబంధించి కానీ కేంద్రానికి ఒక సందర్భోచితమైన విధానం అంటూ ఉందా?
స్క్రోల్.ఇన్ వెబ్సైట్ సౌజన్యంతో