టీడీఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయం నిన్నటి నుండి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అరెస్టు ద్వారా సీఎం జగన్ ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు…? మాజీల్లో మరి కొందరిపై కూడా అవినీతి కత్తులు వేలాడుతున్నాయి…? వాళ్ళ అరెస్టులు తప్పవా…?? అసలు జగన్ వ్యూహం, ఆలోచన, లెక్క ఏమిటో ఆసక్తికరమే..!! “ఇటువంటి సంచలనాలు మరిన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. జగన్ జాబితాలో ఇంకా అనేక మంది టిడిపి నేతలు ఉన్నారు” ఇదీ వైసిపి ముఖ్యుడి ఓ అంతర్గత సంభాషణ…!! అవినీతిపై యుద్ధం కావచ్చు…, చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని కావచ్చు…, కక్ష సాధింపు కావచ్చు.., తన లానే వాళ్ళు చిప్పకూడు తినాలని కావచ్చు… ఇలా జగన్ వ్యూహం, ఆలోచన ఏమైనా కావచ్చు ఆయన దగ్గర మాత్రం కొన్ని పేర్లున్నాయి. “మరిన్ని అరెస్టులకు సిద్ధంగా ఉండాల్సిందే” అని నిన్న ఓ మంత్రి వ్యాఖ్యానించడం.., “ఇది ఆరంభం మంత్రమే అంటూ రోజా చెప్పడం”… మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తుంది. ఇంతకు జగన్ జాబితాలో ఎవరెవరు ఉన్నారు…!! వారిపై ఆరోపణలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
అమరావతి విషయంలో కొందరు…!
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది వైసిపి బలంగా వాదిస్తుంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుండి ఇదే మాటకు కట్టుబడి ఉన్నారు. దీనిపై విచారణకు ఒక సిట్ బృందం కూడా ఏర్పాటయింది. సిఐడి కూడా వేగంగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఓ డిప్యూటీ కలెక్టర్ ని అరెస్టు చేసారు. అమరావతిలో భూముల విషయంలో మొదటి నుండి ఆరోపణలు వస్తున్నా టిడిపి నేతలపై ఏ క్షణాన అయినా పోలీసుల నీడలు పడొచ్చు. టిడిపి ముఖ్యనేత నారా లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు… ఈ ముగ్గురిపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు బలంగా ఉన్నాయి. అవసరం, రాజకీయం, కొన్ని సంప్రదింపుల ఆధారంగా వీరిలో సమయాన్ని బట్టి అరెస్టులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎంత లోతుగా తోడితే వీరికి అంతగా మూడినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఏ మాత్రం చిన్న ఆధారం దొరికినా వీళ్ళలో ఏ ఒక్కరిని అయినా అరెస్టు చేసేందుకు వెనుకాడరు.
నీటి ప్రాజెక్టుల విషయంలో…!
ఇక టిడిపి హయాంలో ఎక్కువగా అవినీతి జరిగింది అని ఆరోపిస్తున్న అంశం నీటి ప్రాజెక్టుల టెండర్లు కేటాయింపు. ప్రస్తుతానికి దీనిపై కేసులు నమోదు చేయకపోయినా త్వరలోనే పోలవరం, వెలుగొండ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల పనులపై లోతుగా ఒక విచారణ బృందాన్ని నియమించనున్నారని సమాచారం. టిడిపిలో బలంగా వాయిస్ వినిపిస్తున్న.., జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ లిస్టులో ఉన్నారు. ఆయనతో పాటూ పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా జాబితాలో ఉన్నారు. ఈ అవినీతిని కూడా బయటకు తీస్తే , జగన్ లిస్టులో కొందరు జైలుకి వెళ్ళినట్టే.
లెక్క సరిచేయాలనేనా…? సిబిఐ ఎందుకంటే…!
మరోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై “సిబిఐ విచారణ” కోరుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా పెద్ద వ్యూహమే. చంద్రబాబు వంటి మాజీని.., ఒక కాకలు తిరిగిన నాయకుడ్ని అరెస్టు చేయాలంటే… జగన్ జాబితాలోని మొదటి పేరుని జైలుకి పంపించాలంటే సిబిఐ తోనే సాధ్యం అనేది వైసిపి యోచన.
“గతంలో వైసిపి అధినేత జగన్ ని సిబిఐ అరెస్టు చేసింది. 16 నెలలు జైల్లో పెట్టింది. ఇప్పటికీ ఆయన వారం వారం కోర్టుకి వెళ్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అవినీతి కేసు అంటే మొదట గుర్తొచ్చేది జగన్ మాత్రమే. ఆయనపై అవినీతి ముద్ర బలంగా వేశారు. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 2012 నుండి జగన్ అవినీతి పరుడు, దొంగ అంటూ టిడిపి నేతలు ఎక్కువగా ప్రచారం చేసేవారు. నాటి సిబిఐ విచారణ, అవినీతి కేసులను ఇప్పటికీ ఉదహరిస్తూ టిడిపి నేతలు జగన్ ని విమర్శిస్తుంటారు…. అందుకే దీనికి విరుగుడు జగన్ కి కావాలి. ముఖ్యంగా తనకి వ్యతిరేకంగా ఉన్న నాయకుడు పై కూడా సిబిఐ కేసులు, అరెస్టులు, అవినీతి ముద్ర ఉంటె తనకు ఒక తృప్తిగా ఉంటుంది…, తాద్వారా ప్రత్యర్థిని ప్రజల్లో కాస్త చులకన చేసే అవకాశం ఉంటుంది. అవినీతి వ్యవహారంలో లెక్క సరి చేసినట్టు ఉంటుంది. అందుకే జగన్ ప్రస్తుతం దూకుడుగా వెళ్తున్నారు. అందుకే జరుగుతున్న పర్యవసానాలు…, అరెస్టులు, ఆరోపణలు, వైసిపి ముఖ్యుల వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న కొద్దినెలల్లోనే లోకేష్, నారాయణ, దేవినేని, దూళిపాళ్ల నరేంద్ర సహా చంద్రబాబు కూడా అరెస్టయిన ఆశ్చర్యం అవసరం లేదు. కేసులు, కాలమే వీటికి సరైన సమాధానం చూపిస్తుంది. జగన్ కి ఆయుధంగా మారుతుంది.