ఏపీలో ట్వీట్లు, ట్విస్టులు కొత్తేమి కాదు. కానీ అవినీతి వ్యవహారాల్లో మాత్రం ఇప్పుడు కొత్తగానే ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో.., మాజీల అవినీతి వ్యవహారాల్లో మాత్రం అనేక ట్విస్టులు, ట్వీట్లుకి సిద్ధంగా ఉండాల్సిందే. మనమెందుకు సిద్ధమవ్వడం.., టీడీపీ మాజీలు సిద్ధమవ్వాలి అంటారేమో…! వాళ్ళు ఎప్పుడో సిద్ధమయ్యారు. నాటి ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులకు బేడీలు ఖాయం అంటూ మానసికంగా సిద్ధమవ్వగా… వైసీపీ మాత్రం ఆరు కాదు, పది మంత్రి అంటుంది. తాజాగా గంటా శ్రీనివాసరావు అవినీతి వ్యవహారం ఒకటి విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇదేమి సీక్రెట్ కాదు. అప్పట్లోనే గంటాపై ఎన్నో ఆరోపణలు, మరకలు ఉన్నాయి.
“గంటా”పథంగా ఆయన సిద్ధమే…!
గంటా శ్రీనివాసరావు మాంచి రాజకీయం తెలిసిన నాయకుడు. ఆయనకు పార్టీలు, రంగులు, నియోజకవర్గాలు అనవసరం. గెలుపు, పదవి, హోదా… ఆపై ఇంకేవేవో కావాలి. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన హవా నడుస్తుంది. పాపం, ఒక్క వైసీపీ మినహా. జగన్ ఒక్కడి దగ్గరే గంటా ఆటలు సాగక… ఆ స్థానాన్ని “అవంతి తన ఆస్థానం” గా మార్చేసుకున్నారు. నాడు సైకిళ్ళ పంపిణీ పథకంలో రూ. 5 కోట్లు అవినీతి జరిగింది, గంటానే దీనికి బాధ్యులు అంటూ విజయసాయి ట్వీట్ చేసారు.
సో.., వైసీపీకి తెలుసు. నాడు ఏ మంత్రి ఏ విధంగా తప్పులు చేసారు.., ఇప్పుడు ఎలా బుక్ చేయొచ్చు అనేది తెలుసు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఆధారాలు సేకరించి మరీ ఇరికిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు జరిగి నెల దాటింది. ఇప్పుడే ఆ సంగతి జనం మర్చిపోతున్నారు. ఇక అదే మారక పీఠానిపై కూడా పడింది. ఆ తర్వాతనే నాడు విద్యాశాఖ చుసిన గంటా పని పట్టనున్నారు. విజయసాయి ట్వీట్లో పరమార్ధం అదే. అందుకే గంటా కూడా జగన్ చేయి అందిస్తే వైసీపీ గట్టులోకి దూకేయడానికి సిద్ధమే.., లేకపోతే కిక్కురుమనుకుంటూ అరెస్టు అవ్వాల్సిందే.
ఇంకా ఉంటాయి. సైకిళ్ళు ఒక్కటే కాదు…!
గంటా శ్రీనివాసరావు చాలా చాకచక్యంగా ఉంటారు. ఆయన అవినీతి వ్యవహారాలు కూడా పకడ్బందీగా నడుస్తుంటాయి. ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. నిజానికి టీడీపీ హయాంలో కేవలం సైకిళ్ళు కొనుగోళ్లలో అవినీతి అనేది చాల చిన్న అంశం. గంటా గురించి బాగా తెలిసిన వాళ్లకి ఈ 5 కోట్లు బాగా చిన్నది అనిపిస్తుంది. “ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ..”.., “ఆ ఐదేళ్లలో 200 కి పైగా ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు..!..” “కళాశాలల యాజమాన్యాలు అడిగినప్పుడు పరీక్షలు, అడిగినప్పుడు ఫలితాలు. ఇతర రాష్ట్రాల నుండి విద్యార్థులు మన రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ చదువుకోవడాలు..” ఆ రహస్యాలన్నీ విద్యాశాఖలో జరుగుతూ ఉంటాయి. ఇవి నాడు గంటాకు తెలుసు, నేడు ఆదిమూలపుకి తెలుసు. అయితే ఆయన మాజీ అయ్యారు కాబట్టి అవినీతి అంటారు, ఈయన పదవిలో ఉన్నారు కాబట్టి అంతా ఒకే అంటారు.