జననము మనిషిగానే… మరణమూ మనిషిగానే ఉంటుంది…! ఈ మధ్యలో వ్యవధి మనిషితత్వాన్ని తెలియజేస్తుంది. వక్తిత్వం ఏమి లేకపోతే ఆ మనిషి పేరు అస్తిత్వం… అది బాగుంటే గుండెల్లో స్థిరత్వం. సాటి మనిషి కోసం బతికితే మానవత్వం.., మొండిగా వెళ్తే నియంతృత్వం.., జనం కోసం వెళ్తే నాయకత్వం.. అంటుంటారు. ఈ అన్ని తత్వాలను తనలో ఎంతో కొంత ఇముడ్చుకున్న వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. అందుకే ఆయన వెలుగు దివ్వెలాగానే తెలుగు గుండెల్లో ఉన్నారు. ఇక ఆయన జీవితాన్ని తనకు తెలిసినట్టు వివరించారు సతీమణి విజయమ్మ. “నాలో… నాతో… వైఎస్సార్..!” అంటూ నామకరణం చేసి ఓ పుస్తకాన్ని విడుదల చేసారు. మరి ఆ పుస్తకంలో ఏముంది..? ఏం చెప్పారు..? అనే సమీక్ష చూద్దాం.
నాయకుడా…? మళ్ళీ రావా…?? అనేంతగా…!
పెళ్ళైన కొత్తలో నుండి… భర్తగా.., వైద్యుడిగా, నాయకుడిగా, సీఎం గా… తండ్రిగా ఆయన ఎలా ఉన్నారు అనేది పూసగుచ్చినట్టు రాసారు. ఈ క్రమంలోనే ఎన్నో తెలియని అంశాలు లేవనెత్తారు. ఎవరికీ తెలియని రాజశేఖర్ రెడ్డిని చూపించారు. ఈ ఇద్దరి పెళ్ళికి ముందే ఇంటికెళ్లి విజయమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం..! తిరుపతిలో బండిపై ఇద్దరూ చక్కర్లు కొట్టుకుని తిరగడం..! కళాశాలలో విద్యార్థిగా ఉంటూనే ఎదుటి వారికి సాయపడడం.., తన వద్ద లేకపోయినా అప్పుచేసి మరీ సాయ పాడడం..! రూపాయి డాక్టర్ గా పేరు సంపాదించడం..! జగన్ పుట్టినప్పుడు జీపులో ఈలలు వేసుకుంటూ రావడం…! షర్మిలకు జ్వరం వస్తే ముఖ్యమైన మీటింగ్ వదిలేసి వెళ్లడం…! సిగరెట్ అలవాటు మాన్పించడానికి, షర్మిల తో గోళ్లు కోరుకునే అలవాటు మాన్పించడం…! జగన్ కి చిన్నతనం నుండి దగ్గర పెట్టుకుని “వ్యక్తిత్వం, నాయకత్వం, నిబద్ధత, రాజకీయ విలువలు” అన్నిటినీ చెప్పడం…! రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మొదటిసారి మంత్రి పదవి స్వీకరించడం…! కాంగ్రెస్ లో సహచర లీడర్లతోనే ఆటుపోట్లు ఎదురవ్వడం…! పీసీసీ అధ్యక్షుడిగా మారడం, రాజీవ్ గాంధీతో అనుబంధం..! షర్మిల మొదటి పెళ్లికి ముందు, తర్వాత మొదటి సారి రాజశేఖర్ రెడ్డి కూతురి విషయంలో కన్నీళ్లు పెట్టుకోవడం…! 1990 , 1992 ఇలా రెండుసార్లు సీఎం అయ్యే అవకాశం ఉన్నా ఆశించకపోవడం…! 1996 లో ఎంపీగా ఓడిపోతారన్న భయంతో కొడుకు, కూతురు ఇద్దరూ మొక్కుకోవడం…! ఇలా పెద్దగా బయటకు తెలియని కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. కొన్ని ఎన్నికల్లో వైఎస్సార్ ని ఓడించడానికి ఎవరెవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనే అంశాలను కూడా రాశారు.
- రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అంటే అందరికి 2003 పాదయాత్ర గుర్తుంటుంది. కానీ 1986 లో ఆయన పోతిరెడ్డిపాడు కోసం 500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్నీ విజయమ్మ రాశారు. మొత్తానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా… వైఎస్సార్ ఎలా పని చేశారు, పులివెందులలో ఎందుకు అంతలా స్థిరపడ్డారు అనేది స్పష్టంగా తెలియజేసారు.
ప్రతి ఒక్కరి గురించి క్లుప్తంగా…!
ఆ పుస్తకంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ప్రతీ ఒక్కరి గురించి క్లుప్తంగా రాశారు. తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ… అన్న జార్జి రెడ్డి.., తమ్ముడు వివేకానందరెడ్డి… ఇలా ప్రతి ఒక్కరి గురించి విజయమ్మ రాసారు. ఒక్కొక్కరి చరిత్ర క్లుప్తంగా మూడు, నాలుగు పేజీల్లో ఫొటోలతో సహా ప్రచురించారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి రాజకీయాల్లో, పార్టీల్లో లేకపోయినా అక్కడ పంచాయతీ పెద్దగా ఎలా కొనసాగారు అనేసి వివరంగా రాశారు. అయితే ఓ సందర్భంలో బైబిల్ లో అంశాన్ని ప్రస్తావిస్తూ “తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయెను” అని రాస్తూ… “ఏ ఊరి నుండి వీళ్ళ అబ్బని (రాజారెడ్డిని) వెలివేసారో.., అదే రాష్ట్రానికి ఈయన రాజయ్యారు” అంటూ రాశారు. వైఎస్ చేపట్టిన ప్రతీ పథకం లబ్దిని వివరించారు. సుమారుగా 30 పేజీల్లో ఈ విషయాలన్నీ రాశారు. ప్రతీ పథకం పుట్టుక, లబ్ది, ఫలితం అంతా వివరించారు.