Nallapureddy Prasannakumar Reddy: ఈ ఏడాది 15 లక్షలు.. వచ్చే ఏడాది 24 లక్షలు.. రెండేళ్లు నిండే సరికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలే ఉండరు.. అంటూ రూ. కోట్లకు కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం పబ్లిసిటీ చేస్తుంది..! గత నెలలోనే ఘనంగా ఇళ్ల నిర్మాణ పనులు కూడా ఆరంభించారు. జిల్లాకో జేసీని నియమించారు.. కానీ ఇంతలోనే….
“పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు సరిపోవు. చిన్న కుటుంబాలకు కూడా ఆ ఇల్లు సరిపోవు. పట్టణ ప్రాంతాల్లో మరీ ఘోరంగా ఆరు అంకణాలు (40 గజాలు) మాత్రమే ఇస్తున్నారు. బెడ్ రూంలో పెద్ద మంచం పట్టదు. హల లో శోభనం చేసుకుని, బెడ్ రూమ్ లో పాడుకోవాల్సి వస్తుంది. బాత్ రూమ్ బయట నిర్మించి, బెడ్ రూమ్ సైజు పెంచాలి. ఇళ్లన్నీ ప్రభుత్వమే నిర్మించాలి” అంటూ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటుగానే మాట్లాడారు. అటు చూస్తే ప్రభుత్వ ఆర్భాటం గట్టిగా ఉంది. ఈ లోగా సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఈ మాటల్లో నిజాలను ప్రభుత్వం గ్రహిస్తుందా..!? లేదా ఇలా మాట్లాడడంపై ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహిస్తుందా..!? అనేది చూడాల్సి ఉంది.
Nallapureddy Prasannakumar Reddy: కొన్ని నిజాలున్నాయి.. హడావిడి ఫలితం దక్కకపోవచ్చు..!!
ఎమ్మెల్యే మాట్లాడిన అంశాల్లో కొన్ని ప్రాక్టీకల్ నిజాలున్నాయి. కాకపోతే ఆయన మాట్లాడిన వేదిక కరెక్ట్ కాదు అంటూ వైసీపీ పెద్దల్లో చర్చలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఒక్క సెంటు మాత్రమే స్థలం ఇచ్చి ఇళ్లను పేదలే కట్టుకోవాలి అని చెప్తున్నారు. ఒక్కో సెంటు అంటే దేనికీ చాలదు. పేరుకి మూడు రూములు అంటున్నా.. ఏ రూములోనూ ప్రశాంతంగా, విస్తారంగా ఉండలేని పరిస్థితి. ఒక డిజైన్ ప్రభుత్వమే ఇచ్చి, అలాగే కట్టుకోవాలి అని చెప్పడం… పైగా ప్రభుత్వం కట్టించి ఇస్తుంది అని ప్రచారం చేస్తూ… మరోవైపు లబ్ధిదారులకే “మీరు ఇప్పుడు కట్టుకోండి. మీకు తర్వాత బిల్లులు వేస్తారు” అని చెప్పడం చూస్తుంటే ఇళ్ల నిర్మాణంలో ఆశించిన మంచి ఫలితం ప్రభుత్వానికి రాకపోవచ్చు. పైగా ఈ ఎల్లా నిర్మాణం ఆశించినంత వేగంగా జరగకపోవచ్చు. అనవసర ప్రచారానికి వెళ్లి.. భారీ లెక్కలకు వెళ్లి.. లక్షల్లో సంఖ్యని చూపించి మురిసిపోతున్నారు. కానీ లబ్ధిదారుల్లో మాత్రం ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనిపిస్తుంది. “చిన్న స్థలం.., పైగా కట్టుకోవాలి, తర్వాత ఎప్పుడో బిల్లులు ఇస్తారట. కట్టుకోకపోతే స్థలం కూడా తీసుకుంటారట” అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇవి చెప్పాల్సింది ఎమ్మెల్యేలే..!
ప్రభుత్వ పథకాలు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు..!? ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి.. వాటిలో ప్రాక్టీకల్ ఇబ్బందులు ఏమున్నాయి అనేది ప్రభుత్వానికి తెలిసేలా చెప్పాల్సింది ఎమ్మెల్యేలు మాత్రమే. ఒకప్పుడు మీడియా ఇటువంటి విషయాలు చెప్పేది. కానీ ఇప్పుడు మీడియాకు రంగులు, పార్టీలు రావడంతో ఓకే వర్గం మీడియా రాస్తే భజన… మరో వర్గం మీడియా రాస్తే అతిశయోక్తులతో.. సొంత వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉన్న వాస్తవాలను ప్రభుత్వ పెద్దలకు తెలిసేలా చెప్పడమే సరైన విధానం. నల్లపురెడ్డి అదే చేశారు. కాకపోతే లేఖ ద్వారానో.., నేరుగా కలిసి చెప్పడం ద్వారానో.. నాలుగు గోడల మధ్య చెప్పడం ద్వారానో చేయాల్సిన వ్యాఖ్యలను బహిరంగంగా ఓ సమావేశంలో చేశారు. ఒకరకంగా ఇది కూడా మంచిదే. ఇలా చేశారు కాబట్టే.. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నిజాలు బయటకు వచ్చాయి. బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి.