Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి ఏమనిపించిందో..? ఎవరు జ్ఞానబోధ చేశారో..!? తిరుగుబాటు తప్పదని భయం వేసిందో..!? కారణం ఏమైనా కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆమోదీయమే. ఈ మూడు నెలల అసంతృప్తి మీద కొంచెం నీటి చుక్కలు వేయడానికి పనికొస్తుంది.. మోడీ వ్యతిరేక వాయిస్ లకు కాస్త మ్యూట్ చేయడానికి పనికొస్తుంది.. వాక్సిన్ ల విషయంలో అనేక సంప్రదింపులు, విమర్శలు, చర్చలు తర్వాత కేంద్రీకృత వాక్సిన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈరోజు తాను ప్రసంగించిన గంట స్పీచ్ లో ఈ ఒక్కటే హైలైట్. దీని చుట్టూనే ఇప్పుడు దేశంలో డిస్కషన్ మొదలయింది. “పోనీలే ఇన్నాళ్లకు మోడీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు” అనిపించుకున్నారు.
Narendra Modi: కరోనా రెండో దశ నుండి అప్రతిష్ట..!
కరోనా రెండో దశ మార్చి మొదటి వారం నుండి దేశంలో ఎక్కువవుతూ వస్తుంది. కానీ కేంద్రం నుండి పెద్దగా రియాక్షన్ లేదు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతుందని.., కరోనాని పట్టించుకోకుండా రాజకీయ లబ్ది చూసుకుంటుందని విమర్శలు వచ్చాయి. పైగా ఉత్తర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసం కుంభమేళాకు అనుమతులు ఇచ్చారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. అలా అలా ఏప్రిల్ వచ్చే సరికి దేశంలో కేసులు బీభత్సంగా పెరిగాయి మరణాలు ఎక్కువయ్యాయి. ఆక్సిజన్ అందక.. మందులు లేక.. బెడ్లు దొరక్క.. కరోనా అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని దేశం మొత్తం భయపడాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంత భయంలో కూడా బీజేపీ వల్లనే ఇది మొత్తం.., మోడీ వైఫల్యమే దీనికి కారణం అంటూ చేతులు, చూపులన్నీ మోడీ వైఫల్యం వైపే చూపించాయి. అలా రెండో దశలో కావాల్సినంత అప్రతిష్ఠని మోడీ మూటగట్టుకున్నారు. చివరికి బీజేపీ గురు ఆర్ఎస్సెస్ కూడా మోడీ నాయకత్వాన్ని సమర్ధించలేదు. పైపైన విమర్శలు చేస్తూనే ఉంది..
వాక్సిన్ తో కొంచెం ఊరట..!
రెండో దశ కొంచెం తగ్గుతుంది.. అని ఊరట చెందుతున్నా మళ్ళీ మూడో దశ భయం నెలకొంది. అందుకే వాక్సిన్ ఒక్కటే శ్రీరామరక్ష. కానీ ఆ వాక్సిన్ కావాల్సిన వాళ్లకు అందడం లేదు. కేంద్రం రాష్ట్రాలకు అప్పగించేసింది.. రాష్ట్రాలకు సరఫరా చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. దీంతో నెల రోజుల నుండి గందరగోళం నెలకొంది. కళ్ళ ముందే వాక్సిన్ ఉన్నప్పటికీ ఒక స్పష్టమైన విధానం లేక.. ఒక సరళీకృత విధానం లేక.. ఒక సమన్వయము లేక ప్రజలకు అందకుండా చేస్తున్నారంటూ రాష్ట్రాలు కేంద్రంపై పడ్డాయి. ఒత్తిడి పెరిగింది. ఇక చేసేదేం లేక మోడీ దిగొచ్చారు. వాక్సిన్ బాధ్యతని కేంద్రమే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. దీంతో తాను మూటగట్టుకున్న అప్రతిష్ఠని ఎంతో కొంత పోగొట్టుకునే దిశగా అడుగులు ఆరంభించారు..!