Narendra Modi: గెలిపించిన కార్యకర్తలే మీరు అవసరం లేదు పొండి అంటే.. ఆ బాధ వర్ణనాతీతం..!
పెంచి పోషించిన ఇల్లే.. నీకిక్కడ ఆశ్రయం లేదు. బయటకు పో.. అంటే ఆ వేదన ఆపలేం..!
దెబ్బలాడి, టికెట్లు కొని ఆదరించిన అభిమానులే.. నువ్వు మాకు అక్కర్లేదు పో అంటూ హీరోని అంటే ఆ హీరోది వృథా జీవితం..!
పెంచిన సోషల్ మీడియానే .. నువ్వు విలన్ వి.., నువ్వే మా దేశానికి విలన్ వి రాజీనామా చేసేయ్ అంటే.. ఆ నాయకుడిది ఆవేదన భరితం..!
ఇప్పుడు ప్రధాని మోడీ ఈ దశలోనే ఉన్నారు. దేశంలో ఆయన పెద్ద దోషిగా మారారు. మోడీ ప్రతిష్ట అటు అంతర్జాతీయంగా అటూఇటుగా ఊగిసలాడుతుంటే.. జాతీయంగా అనుమానాలు కలిగిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం మోడీని పొమ్మంటుంది. దిగిపోమంటుంది. చేసిన పాలన చాలు వెళ్ళవోయ్ అంటుంది..! మోడీ దగ్గర సమాధానం లేదు. బీజేపీలో చలనం లేదు. సింపుల్ గా ప్రతిపక్షాలపైకి.., కాంగ్రెస్ పైకి నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ ఇది సులువైన అంశం కాదు. ఇప్పటితో తేలిపోయే వ్యవహారం కాదు. సోషల్ మీడియా తలచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ విషయం ప్రధాని మోడీకి బాగా తెలుసు..!
Narendra Modi: ఒకప్పుడు సోషల్ మీడియా హీరో..!!
నరేంద్ర మోడీ అంటే ఒకప్పుడు సోషల్ మీడియా హీరో. 2014 ఎన్నికలకు ముందు వరుసగా గుజరాత్ ఎన్నికల్లో గెలుస్తూ ముఖ్యమంత్రిగా అవుతున్నప్పుడు ఆయన దేశంలో ఒక బ్రాండ్. మీడియా కళ్ళు ఆయన్ను చూసేవి. సోషల్ మీడియా కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులూ అన్నీ మోడీ భజన చేసేవి. మోడీ కూడా 2011 నుండి 2014 మధ్య సోషల్ మీడియాని బాగా వాడుకున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను యాక్టీవ్ గా వాడుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు. సోషల్ మీడియాలో బాగా చైతన్యంగా ఉంటూ మంచి ఫాలోయర్లను పొందగలిగారు. అలా గుజరాత్ నుండి దేశం మొత్తానికి సోషల్ మీడియా స్టార్ గా వెలుగొందారు. 2011 అంటే.. దేశంలో అప్పుడప్పుడే సోషల్ మీడియా ఎదుగుతున్న దశ అది. సరిగ్గా అప్పుడే దేశంలో నరేంద్ర మోడీ కూడా గుజరాత్ బోర్డార్లు దాటి దేశం మొత్తం తిరిగారు. తద్వారా సోషల్ మీడియాని వాడుకుని, బాగానే ఫలితాలు రాబెట్టుకున్నారు. బీజేపీలో తిరుగులేని శక్తిగా మారారు.
* ప్రస్తుతం మోడీ సోషల్ మీడియాలో ప్రపంచంలో కూడా టాప్ 20 లో ఉన్నారు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న వారిలో బరాక్ ఒబామా మొదటిస్థానంలో ఉండగా.., మోడీ 16 వ స్థానంలో ఉన్నారు. 2019 లో గెలుపు తర్వాత ఫాలోయర్లు అమాంతం పెరిగారు. ప్రస్తుతం మోడీ సోషల్ మీడియా ఖాతాలు అన్నిటికీ కలిపి 120 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉంటారని అంచనా… కానీ సీన్ ఇక్కడితో కట్ చేస్తే..
ఇప్పుడు వ్యతిరేకత ఎందుకు..!?
నోట్లు రద్దు చేసినా.. జీఎస్టీ తెచ్చినా.., ఆర్టికల్ 370 రద్దు చేసినా.., సెర్జికల్ స్ట్రైక్స్ చేసినా.. ప్రధానిగా మోడీ ఏం చేసినా దేశం ఆయన వెంట నడిచింది. సోషల్ మీడియా ఆయన్ను అనుసరించింది. మిళియన్లలో ఆయన ఫాలోయర్లు మోడీని గుడ్డిగా ఫాలో అయ్యారు. కానీ.. రెండో సరి ప్రధాని అయ్యాక.. గత ఏడాది కాలంగా కరోనా విషయంలో ఆయన చేసిన అతితో జనంలో కొంత విరక్తి మొదలయింది. ఆ మధ్యలో పరీక్షలు వాయిదా..? ఢిల్లీలో అల్లర్లు.. పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మోడీ దేశానికి విలన్ గా మారారు. సోషల్ మీడియాలో మోడీని విపరీతంగా తిట్టడం.. అతనికి వ్యతిరేకంగా ట్రోల్స్ వేయడం మొదలయింది. అక్కడ మొదలైన సోషల్ వ్యతిరేకత వ్యవహారం ఇప్పుడు మోడీని దిగిపోమంటుంది.
* ఆరు నెలల కిందట ఆయన నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి మొదటిసారిగా లైక్స్ కంటే డిస్ లైక్స్ ఎక్కువ వచ్చాయి. దీంతో బీజేపీ ఈ నెపాన్ని కాంగ్రెస్ పైకి నెట్టేసింది. తప్పించుకుంది. కానీ కరోనా రెండో దశ ఆరంభం నుండి మోడీపై దేశ యువత భగ్గుమంటుంది. ఇప్పుడు దేశంలో కరోనా కోరలు చాచింది. రోజులో లక్షల మందికి సోకుతుంది. వేలాదిగా మరణిస్తున్నారు. దేశాన్ని మోడీ వదిలేశారు. ఏం చేయలేకపోతున్నారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం.. కుంభమేళా కోసం దేశాన్ని రిస్కులోకి నెట్టి.. రాజకీయం చేసుకున్నారన్న బలమైన విమర్శలు మోడీపై ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకమైన పోస్టులు బాగా హవాలో ఉన్నాయి. మూడు రోజుల కిందట రిజైన్ మోడీ అంటూ ఒక హాష్ టాగ్ బాగా వైరల్ అవ్వగా ఫేస్ బుక్ దాన్ని బ్లాక్ చేసేసింది. ఇప్పటికీ వివిధ రూపాల్లో మోడీపై సోషల్ మీడియాలో బద్ధ వ్యతిరేకత నడుస్తుంది. ఇది బీజేపీకి, మోడీకి ఏ మాత్రం మంచిది కాదు..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?