కరోనా వల్ల సినీ ప్రపంచం లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు ముంచుకు వచ్చినప్పుడు ఎటువంటి హాని జరగకుండా ఉండేందుకు కొత్త మార్పులకి అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే టెక్నాలజీ పుణ్యమా అని చాలా వాటికి డిమాండ్లు తగ్గిపోతుంటే…. ఇప్పుడు రంగుల ప్రపంచం మరొక కొత్త రంగును పులుముకునేందుకు సిద్ధమైంది.
థియేటర్ vs ఓటిటి
వివరాల్లోకి వెళితే…. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫారం లకు థియేటర్స్ కు ఒక మినీ యుద్ధం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీ లోకి వచ్చేవి. ఇక కరోనా తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. థియేటర్ల అవసరం లేకుండా నేరుగా ఓటీటీ లోకి సినిమాలను విడుదల చేసి నిర్మాతలు మంచి లాభాలు రాబడుతున్నారు. ఆర్నెల్ల ముందు మొదలైన ఈ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఆ అనుభవం రాదా?
థియేటర్ల యాజమాన్యాలు మొదట్లో ఈ కొత్త సంప్రదాయాన్ని వ్యతిరేకించాయి. అయితే అటు నిర్మాతలు, ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఒక మాట అనుకొని ముందుకు వెళ్లిపోయారు. అన్ని భాషల్లో గత ఏడు నెలల్లో 50 సినిమాల వరకు వచ్చాయి. అయితే థియేటర్లు పూర్తిస్థాయిలో మొదలయ్యాక ఈ సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా అన్నది వేచి చూడాలి. చాలామంది థియేటర్ లో వచ్చిన అనుభవం ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో రాదని అంటున్నారు. అలాగే పెద్ద సినిమాలు మొదటిరోజు లో చూసేందుకు జనాలు ఇష్టపడతారని…. ఇంకా డిజిటల్ సౌండ్ మిక్సింగ్, గ్రాఫిక్స్, విఎఫెక్స్. కెమెరా వర్క్ వంటివి స్క్రీన్ ముందు చూస్తే కానీ కుదరదని పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు, ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కలిసి పనిచేసే అవకాశాలు కూడా భవిష్యత్తు లో ఉన్నాయి అన్న సూచనలు వస్తున్నాయి.
ఒకే రోజు రెండు చోట్ల…..
విషయం ఏమిటంటే…. జి స్టూడియోస్ వారు ఈ దిశగా ఒక కొత్త ముందడుగు వేశారు. ఆ సంస్థ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ముందు సొంతం చేసుకుంది. ఇక థియేటర్లు తెరిచిన తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇదే అని ప్రకటించేశారు కూడా. అయితే ఈ సంస్థ థియేట్రికల్ రైట్స్ తోపాటు డిజిటల్ రైట్స్ ను కూడా సొంతం చేసుకుంది. కాబట్టి సినిమాను ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేయాలన్నది వారి ఇష్టమే. అవసరమైతే బహుశా థియేటర్లలో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఓటిటి ప్లాట్ ఫారం లో విడుదల చేసుకునే అవకాశం ఉంది…. లేదా ఒకే రోజు రెండు చోట్ల విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కొత్త శకం ఆరంభం?
ఇది ఎలా సాధ్య పడుతుంది అన్న సందేహం మాత్రం అవసరంలేదు. నిర్మాత సినిమాను అమ్మినప్పుడు థియేటర్ యాజమాన్యాలు… డిస్ట్రిబ్యూటర్స్ ప్లాట్ఫాం వాళ్ళు అంతా కలిసి ఒక ఒక మాట మీద కి వచ్చి ఆ సినిమాను భాగాలుగా వేసుకొని కొంటే లాభాలు వస్తాయన్న ఉద్దేశ్యం ఉంటే మాత్రం ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది. ఆ సినిమా బడ్జెట్ ను బట్టి, హీరోని బట్టి, రిస్క్ ను బట్టి ఇది మారుతుంది…. కానీ మొత్తానికి భవిష్యత్తులో మాత్రం ఈ పరిణామం చోటు చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతానికి జీ వారు శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర చిత్రాన్ని’ కూడా ఇలాగే సొంతం చేసుకున్నారు. ముందు ఇంకా చాలా మంది నుండి ఇటువంటి డీల్స్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.