ఇక ప్రవీణ్ ప్రకాష్ అయినా.., ఆదిత్యానాథ్ దాస్ అయినా.., నీలం సాహ్ని అయినా.., ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. జగన్ ఏరికోరి తెచ్చుకున్న ఐఏఎస్ వచ్చేసారు..!
ఇక గౌతమ్ సవాంగ్ అయినా.. రఘురామిరెడ్డి అయినా.. ధనుంజయరెడ్డి అయినా.. కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే జగన్ కోర్చుకుంటున్న ఐపీఎస్ వచ్చేస్తున్నారు..!
ఏపీ సీఎం జగన్ ఏడాదిన్నరగా చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటి ఫలించింది. మరొకటి ఫలించబోతుంది. ఒక ఐఏఎస్ అధికారి వచ్చేసారు. మరో ఐపీఎస్ అధికారి వచ్చేస్తున్నారు. ఇక జగన్ కోటలో ఈ కొత్త అధికారులదే రాజ్యం కానుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అన్నట్టు ఉండనుంది. పాలకులకు అత్యంత ప్రీతిపాత్రమైన అధికారులు పక్కనే ఉంటె ఆ పవర్ మజా వేరుగా ఉంటుంది. అందుకే జగన్ సీఎం అయిన వెంటనే తన చుట్టూ ఉండే ఐఏఎస్ లను ఏరోకోరి తెచ్చుకున్నారు. వీరిలో కొందరు బాగానే నిలదొక్కుకున్న.., కొందరు మాత్రం తోక జాడించారు. జగన్ మన్ననలు పొందలేక బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఐఏఎస్ శ్రీలక్ష్మి.., ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర గురించి..!!
శ్రీలక్ష్మి వచ్చేసారు..! రిపోర్ట్ ఇచ్చేసారు..!!
ఐఏఎస్ శ్రీలక్ష్మి అందరికీ గుర్తుండే పేరు. వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక విభాగంలో ఉన్నతాధికారిగా చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు. విధులకు దూరమయ్యారు. ఆరోగ్యం పాడుచేసుకున్నారు. ఒక ఐఏఎస్ పై పాడకూడని మచ్చలన్నీ ఆమెపై పడ్డాయి. కెరీర్ మసకబారుతున్న క్రమంలో ఏదోలా మళ్ళీ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం క్యాడర్ కి వెళ్లిపోయారు. అక్కడ ఒక మారుమూల, అప్రాధాన్య పోస్టులో కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్నారు. ఇష్టం లేని విధుల్లో గడుపుతున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన వెంటనే ఆమె జగన్ ఇంటికి వెళ్లి కలిశారు. ఏపీకి వచ్చేస్తా అంటూ అర్జీ పెట్టుకున్నారు. జగన్ కూడా కరుణించి, ఆమెతో గతంలో ఉన్న పరిచయం దృష్ట్యా ఆమెను ఏపీకి కేటాయించాలి అంటూ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఒప్పుకోలేదు. జగన్ మళ్ళీ అడిగారు. కేంద్రం మళ్ళీ ఒప్పుకోలేదు. చివరికి సీఎం జగన్ సహా.., ఆమె కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆమె నాలుగు ప్రయత్నాలు చేసి, సఫలమయ్యారు. చివరికి ఆమెని ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. మొన్న కేంద్రం జీవో రావడం, నిన్న ఆమె తెలంగాణ క్యాడర్ నుండి తప్పుకోవడం.., ఏపీకి వచ్చి పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయడం జరిగిపోయాయి. మరో నాలుగు రోజుల్లో ఆమెకు సీఎంఓ లోనే ఒక కీలక హోదానే కట్టబెట్టనున్నారు.
స్టీఫెన్ రవీంద్ర కూడా..!!
ఇక ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర గురించి చెప్పుకోవాల్సిందే. ఆయన కూడా వైఎస్ సమయంలో కీలక విభాగంలో పని చేసారు. నాడు అనేక “సీక్రెట్ పరిపాలన, రాజకీయ ఆపరేషన్లు” నిర్వహించి వైఎస్ కి అత్యంత అనుబంధ అధికారిగా మారిపోయారు. నాటి అధికారుల్లో స్టీఫెన్ జూనియర్ అయినప్పటికీ.., వైఎస్ మాత్రం ఇతనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి స్టీఫెన్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాకి వెళ్లిపోయారు. ఈయనను కూడా ఏపీకి పంపించాలి అంటూ జగన్ పలుమార్లు అర్జీ పెట్టారు. అటు ఆయన కూడా ప్రయత్నాలు సాగించారు. ఇది తుది దశలో ఉంది. వచ్చే వారమే ఈ మేరకు కేంద్రం నుండి ఉత్తర్వులు రానున్నాయని తెలుస్తుంది. అదే జరిగితే జగన్ కి అత్యంత ప్రీతిపాత్రమైన ఐపీఎస్ ఏపీకి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించడానికి జగన్ కూడా సిద్ధంగానే ఉన్నారు..!!