పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ముదిరాయి..! వాదోపవాదాలు, వివాదాలు జరుగుతున్నాయి..! ఎస్ జరుగుతాయి, అక్కడ తొమ్మిది నెలల్లో ఎన్నికలున్నాయి..!!
బీహార్లో రాజకీయాలు పీక్స్ కి చేరాయి…! కత్తులు, కర్రలు బయటకు వస్తున్నాయి. ఎస్., అక్కడ కూడా ఎన్నికలున్నాయి. సహజమే..!!మరి ఏపీలో ఏమిటీ..? రోజుకో వివాదం, రోజుకో ట్విస్టు, రోజుకో రాజకీయ కంపు..!! ఇక్కడ ఎన్నికలు లేవు, ప్రభుత్వ, ప్రతిపక్షాలు సమ బలాలతో లేవు. కానీ “సిగ్గు రహిత” వాదనలు, “అర్ధ రహిత” ఆరోపణలతో ఏపీ దద్దరిల్లుతుంది. ఇన్నాళ్లు కులం మురికి మాత్రమే ఉంది, అనుకుంటే ఇప్పుడు మతం మరక కూడా ఏపీ రాజకీయానికి అంటించేసి ప్రతిపక్షం చిచ్చురేపింది…!!
జీవీఎల్ కి.., బ్రదర్ అనిల్ కీ లింకట…!
ఇటీవల టీడీపీ సోషల్ మీడియా ఓ పేస్ బుక్ పోస్టు పెట్టింది. దాన్ని తెలుగు తమ్ముళ్లు వైరల్ చేసారు. అది ఇప్పుడు నానా యాగీ అయింది. పొలిసు కేసు, సిఐడి విచారణ వరకు వెళ్ళింది. సిఐడి ఏంటి.., సిబిఐ కి వెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే…, జీవీఎల్ ఇక్కడ.., బీజేపీ కంకణబద్ధుడు, మోడీ, అమిత్ షాలకు వీర భక్తుడు.
“బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావుకి బ్రదర్ అనిల్ కుమార్ బామ్మర్ది అవుతారట.., స్వయానా జీవీఎల్ కి ఈయన మేనత్త కొడుకట.., అందుకే జీవీఎల్ వైసీపీని, జగన్ ని నోరెత్తి మాట అనరట” అదీ ఈ మధ్య టీడీపీ పేజీలో వచ్చింది. టీడీపీ వైరల్ చేసింది. దీనిపై కన్నెర్ర చేసిన జీవీఎల్ సిఐడి కి పిర్యాదు చేసారు. విచారణ చేసి, బాధ్యులైన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మతం రంగు పులిమే ప్రయత్నమా…??
ఏపీలో కుల రాజకీయాలు సుదీర్ఘ కాలంగా ఉన్నాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీ ఏం చేసినా, మతానికి లింకెట్టి గోల చేయడం బీజేపీ, టీడీపీకి సాకుగా మారింది. టీటీడీలో వ్యవహారాల నుండి ఈ వినాయక చవితి మండపాల అనుమతుల వరకు “వ్యవస్థీకృతమైన మత రాజకీయం” చేసుకున్నారు. సరే అది రాజకీయం అనుకున్నా…, తాజాగా “వ్యక్తిగత మత రాజకీయం” మొదలవ్వడమే ఏపీలో ఈ మరక కూడా వచ్చేసిందా అనే కొత్త ఆందోళన మొదలయింది. మత లింకులు, రెండు పార్టీల మధ్య మత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ముదిరింది. జీవీఎల్ బ్రాహ్మణుడు. ఆ తత్వంతో తోనే బీజేపీ పెద్దలకు దగ్గరై మాంచి హోదాలో ఉన్నారు. బ్రదర్ అనిల్ ఫక్తు క్రిష్టియన్, అంతర్జాతీయ సువార్తీకుడు. ఈ ఇద్దరూ బంధువులు, బావ, బామ్మర్దులు అనే వాదన పైకి తెచ్చి బీజేపీ– వైసీపీ మధ్య మత లింకు పెట్టి ఎంతో కొంచం రచ్చ చేయాలని టీడీపీ ప్రయత్నం అయితే ప్రారంభించింది. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అదే తరహా ఆరోపణలు ఆరంభించారు. నిజానికి జీవీఎల్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ ప్రాంతానికి చెందిన వారు, బ్రదర్ అనిల్ విశాఖ ప్రాంతానికి చెందిన వారు. ఈ ఇద్దరికీ లింకు ఎలా అనేది టీడీపీకే తెలియాలి. అయితే ప్రస్తుతం కేసు నమోదవ్వడం సిఐడి విచారణ ప్రారంభించడంతో వివాదం ఎక్కడకు వెళ్తుంది అనేది సందేహంగా మారింది.