తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనానికి తెర లేవబోతుంది..! సాధారణంగా ఓటమిని అంగీకరించని కేసీఆర్ కి వరుసగా రెండు ఓటములు పాఠం నేర్పించాయి. దుబ్బాకలో ఓటమితో షాక్ తిన్న కేసీఆర్ కి.., గ్రేటర్ లో బీజేపీ పుంజుకోవడం ఏ మాత్రం రుచించడం లేదు. అందుకే కేసీఆర్ మేల్కొనకపోతే “మాజీ సీఎం కేసీఆర్” అని అనిపించుకోక తప్పదు. పాపం కుమారుడికి బాధ్యతలు ఇచ్చేసి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేద్దాం అనుకుంటున్నా కేసీఆర్ కి తన చేతిలోని స్టీరింగునే బీజేపీ లాక్కోవడం కష్ట కాలమే. అందుకే కేసీఆర్ తన బుర్రకి పదును పెట్టారు. బీజేపీతో కాస్త స్నేహంగా ఉంటూనే.., కాంగ్రెస్ ని కొంచెం లేపే పనిలో ఉన్నారు. అదే వ్యూహం కాస్త లోతుగా చెప్పుకుందాం పదండి..!!
బీజేపీ మాత్రమే ప్రత్యర్థి కాదు..!!
టీఆరెస్ ఇన్నాళ్లు చేసిన తప్పు ఇదే. తన వ్యతిరేక ఓట్లు ముగ్గురికో, నాలుగురికో షేర్ చేస్తే బాగుండేది. అలా కాకుండా.. తన వ్యతిరేక ఓట్లు మొత్తం బీజేపీకి పడేలా టీఆరెస్ కొన్ని స్వీయ తప్పిదాలు చేసింది. బీజేపీని ఎక్కువ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ని పట్టించుకోలేదు. అందుకే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది, కేసీఆర్ వ్యతికరేకతని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. అందుకే ఇక మీదట తెలంగాణాలో కాంగ్రెస్ కూడా పైకి లేవాలి.., బీజేపీ, కాంగ్రెస్ సమంగా ఉండాలి అనేది కేసీఆర్ అనుకుంటున్నా లెక్క. అదే జరిగితే తన వ్యతిరేక ఓట్లు కోసం ఆ రెండూ పార్టీలు కొట్లాడుకుని.. చీల్చుకుని.. తననే నెగ్గేలా చేస్తాయి అనేది ఒక ప్లాన్. దీన్ని త్వరలో జరగనున్న “నాగార్జున సాగర్” ఉప ఎన్నిక నుండి మొదలు పెట్టె ప్రణాళికలో టీఆరెస్ ఉంది.
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలుపే..!!
బీజేపీని బలహీనం చేయాలి అంటే.. కాంగ్రెస్ ని లేపాలి. అదే జరగాలి అంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి చర్చ మొదలవ్వాలి. అది జరగాలి అంటే రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కి ఒక గెలుపు కావాలి. అప్పుడు బీజేపీ గురించి చర్చ తగ్గి.., కాంగ్రెస్ గురించి మొదలవుతుంది. తద్వారా టీఆరెస్ సేఫ్ గా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుంటాయి. అందుకే నాగార్జున సాగర్ లో జానారెడ్డి కుమారుడు కాంగ్రెస్ నుండి పోటీ చేయనున్నారు. జానారెడ్డి పట్టుతో.. కాంగ్రెస్ అక్కడ పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే దుబ్బాక అనే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆరెస్ కి నాగార్జున సాగర్ కోల్పోయిన పెద్ద నష్టమేమి ఉండదు. రానున్న రెండేళ్లలో టీఆరెస్ మళ్ళీ పుంజుకుంటుంది. కానీ బీజేపీకి మాత్రం నష్టమే. గ్రేటర్ గెలుపు, దుబ్బాక వాపు తగ్గి.., టీఆరెస్ పై పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ పై పెట్టాల్సి ఉంటుంది. సో.. ఇదన్నమాట కేసీఆర్ సింపుల్ సంచలన రాజకీయ ఎత్తుగడ. కేసీఆర్ రూపంలో కాంగ్రెస్ కి పెద్ద బహుమతి రాబోతుంది. అది బీజేపీకి షాక్ ఇవ్వబోతుంది.