Andhra Pradesh Politics శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఈ మూడింటినీ సమతూకంగా తీసుకుని వెళ్ళి , దేశానికి దేశ ప్రజలకీ మేలు చేయడమే భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం. అంత సౌందర్యం కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే పొందుపరచగలిగారు. ఒక వ్యవస్థ తో మరొక వ్యవస్థ ఇగో లకి పోయి, అహంకారం – అహంభావం చూపించే నైజం ప్రదర్శిస్తే ఏం జరుగుతుంది అన్నదానికి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
ఇక్కడ తప్పు జగన్ దా ? నిమ్మగడ్డ దా ? ప్రభుత్వ సలహాదారులదా ? ప్రభుత్వ న్యాయ నిపుణులదా ?
ఇక్కడ తప్పు ఏపీ ప్రభుత్వానిదా ? రాష్ట్ర ఎన్నికల కమీషన్ దా ?
అని అడిగితే మాత్రం – అన్ని విషయాల లాగా ఇక్కడ కూడా అందరి తప్పులూ కలిసి ప్రజలకి ఈ తిప్పలు వస్తున్నాయి అని చెప్పుకోవాల్సిందే…
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళదాం
2006లో విశాఖ అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు. అప్పటికే ఈసీ ఆమోదం పొందిన పోలింగ్ బూత్ అధికారుల జాబితాపై అధికారుల సమీక్షలో ఆయనకు కొన్ని ఫిర్యాదులు అందాయి.. అప్పటికప్పుడు ప్రవీణ్ ప్రకాష్ సదరు అధికారిని తప్పించేశారు. దీంతో ఎస్ఈసీ కార్యాలయంలో ఉన్న డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ పిళ్లై నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు అధికారులను తప్పించడం కుదరదని, ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. దానికి ఒప్పుకోకపోవడంతో ప్రవీణ్ ప్రకాశ్నే తప్పించాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దానికి వైఎస్సార్ ససేమిరా అన్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వ సలహాదారులు , ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ చెప్పిన మాటలు విని ఎలక్షన్ కోడ్ ని గౌరవిస్తూ తెలివిగా ప్రవర్తించి వైఎస్ఆర్ ప్రవీణ్ ప్రకాష్ ని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.
ఇప్పుడు జగన్ చూపిన ఈగో ని , తానే ముఖ్యమంత్రి అనే అహంభావాన్నీ చూపించడం వైఎస్సార్ కి చేతకాదా? అలాగని వైఎస్సార్ అవన్నీ ఎప్పుడూ చూపించలేదా అంటే చాలా సార్లు చూపించారు . కానీ ఎప్పుడు ఎక్కడ చూపించలో , ఎప్పుడు ఎక్కడ సరైన సలహాలు వినాలో పాటించాలో తెలిసినట్టుగా మలచుకున్నారు. అదే పట్టు విడుపు అంటే.
151 సీట్ల మ్యాండేట్ ఉన్నంత మాత్రాన మేము ఏం చేసినా నడుస్తుంది అనే బిహేవియర్ వైసీపీ ప్రభుత్వ పెద్దలలో కనిపించడం వైసీపీ వీరాభిమానులకి సైతం చిరాకు తెప్పించే సరికొత్త వ్యవహారం , ఇదే అహంకారం వలన కదా టీడీపీ నాశనం అయ్యింది వీళ్ళు కూడా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనే ఆలోచనలోకి వచ్చేశారు వారు కూడా.
ఎంత పవర్ పెరిగితే అంత బాధ్యత పెరుగుతుంది అంటాడు స్పైడర్ మ్యాన్ .. ఆ పాయింట్ ని మన రాజకీయ నాయకులు ఎవ్వరూ ఆలోచించరు. మోడీ , కేసిఆర్ , చంద్రబాబు , రేవంత్ రెడ్డి దగ్గర నుంచి జగన్ , మమతా , సోనియా ల వరకూ అందరూ దెబ్బ తిన్నది , తినబోయేది అక్కడే. ఒదిగి ఉన్న వ్యక్తులకే జనం పట్టం కడతారు. అలా ఒదిగి ఉండాలి కాబట్టే రాజ్యాంగాన్ని అలా డిజైన్ చేశారు .
నిమ్మగడ్డ ది కూడా అదే అహంకారం రూటు . 2018 లో పెట్టాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కుంటి సాకులతో ఇక్కడవరకూ లాక్కొచ్చి , త్వరలో తాను వెళ్లిపోతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితి లో పెట్టాల్సిందే అన్నట్టు గా ఆయన కూడా గట్టిగానే ఈగో ప్రదర్శించాడు. 2020 మార్చ్ లో కోవిడ్ కారణంగా ఎలక్షన్ పెట్టలేదు సంతోషం , ఆ విషయాన్ని అప్పుడే ప్రభుత్వానికి నోటీస్ గా తెలియజేసి అప్పుడు ఎన్నికలు హోల్డ్ చేసి ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు. చంద్రబాబు హయాం లో నుంచి లాక్కొచ్చీ లాక్కొచ్చీ ఇప్పుడు రిటైర్మెంట్ కి కోసు దూరంలో ఆగిపోయినప్పుడు పెట్టడం , పెట్టాలి అని భీష్మించుకుని కూర్చోవడం జగన్ ఈగో ని దెబ్బతీయాలి అనే ప్లాన్ తప్ప ఇంకేమీ కాదు.
జగన్ ప్రభుత్వంతో న్యాయపరంగా పోరాటం చేసి , జగన్ కావాలని తొలగించిన తన పోస్ట్ లోకి మళ్ళీ హక్కుదారుగా వచ్చి కూర్చున్నందుకు గాను నిమ్మగడ్డ మాత్రం ఖచ్చితంగా ఈ విషయం లో మెచ్చుకోదగ్గ విజయుడే. ఆయన వెనక చంద్రబాబు ఉన్నాడా గొట్టం గన్నయ్య ఉన్నాడా అనేది అప్రస్తుతం. కానీ జగన్ ని ధీటుగా ఎదురుకోలేకపోతోన్న టీడీపీ కంటే కూడా నిమ్మగడ్డ గొప్ప అని రుజువైంది.
రెండు పక్కల వారూ ప్రజలకోసమే ఎన్నికలు పెడుతున్నాం లేదా ప్రజల కోసమే ఎన్నికలు పెట్టడం లేదు అని చెప్పే ప్రతీ మాటా పచ్చి భూటకం. వారి వారి అధికారిక , శాసన ఈగోల కోసమే ఇదంతా.
Andhra Pradesh Politics
దరిమిలా .. ఎవ్వరూ ప్రజల శ్రేయస్సు కోసం ఊడబొడిచేది ఏమీ లేదు , నిజంగా ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకుని ఉంటే ఎవరో ఒక ఏదో ఒక పాయింట్ లో తగ్గేవరు. మొత్తం మీద ఈ ఆటలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెగ్గినా, జగన్ ప్రభుత్వం నెగ్గినా కూడా అంతిమంగా గెలిచింది మాత్రం రాజ్యాంగం, దాని స్పూర్తి మాత్రమే.