భారతీయ సినీ పరిశ్రమ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు బాలీవుడ్. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటి నుండో సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వారికి చిన్నచూపు అన్న మాట వింటుంటాం. ఇక తెలుగు సినిమాల సంగతి చెప్పక్కర్లేదు. ఎంత మంచి సినిమా తీసినా మనవి ప్రాంతీయ సినిమాలే. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. మన హవా అక్కడ ఎంతలా మొదలైందో మీరే చూడండి…..
మనదే హవా అంతా…
ప్రాధాన్యత మాట అటుంచితే…. ప్రోత్సాహకాలు విషయంలో కూడా మన సినిమాలను పెద్దగా పట్టించుకోరు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉండేవి. అయితే గత మూడు నాలుగు సంవత్సరాల జాతీయ అవార్డులు తీసుకుంటే తెలుగు సినిమాల ప్రభావం అక్కడ భారీగా ఉంది. ‘బాహుబలి’, ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘పెళ్లిచూపులు’, ‘శతమానంభవతి’ ‘అః’ వంటి చిత్రాలు అనేక కేటగిరీలలో నేషనల్ అవార్డులు కొల్లగొట్టాయి. ఇక మన దగ్గర నుండి వచ్చిన మంచి మంచి సబ్జెక్ట్ లు అక్కడ భారీ హిట్లు కొట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఉదాహరణకు ‘కబీర్ సింగ్’…. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ గా తెరకెక్కి షాహీద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మొదలెట్టింది ఆయనే…
ఎన్ని సినిమాలు వెళ్లి అక్కడ తమ ఊపుని చూపించినా కూడా…. ‘బాహుబలి’ సినిమా తోనే మన హవా మొదలైంది అని చెప్పవచ్చు. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అదే రేంజ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. భారతదేశంలోని ఒక తెలుగు సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ అన్ని అన్నీ గోడలని ఉన్న ఒకే ఒక్క దెబ్బతో బద్దలుకొట్టింది. అంతే… ప్రభాస్ భారతదేశపు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆఖరికి అంతగా బాగోలేని ‘సాహో’ చిత్రం కూడా టాలీవుడ్ కి మించిన కలెక్షన్లు బాలీవుడ్ లోనే కొల్లగొట్టింది అంటే మనవాళ్ళ సత్తా ఏ పాటిదో ఇప్పటికే మనం అర్థం చేసుకోవచ్చు. ‘సైరా’ నరసింహారెడ్డి కూడా అక్కడ పర్వాలేదనిపించింది. సినిమా సూపర్ హిట్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది అనుకోండి…. అది వేరే విషయం.
బోలెడు లైన్ లో ఉన్నాయి…
ఇప్పుడు మన వాళ్ళు వరుసగా బాలీవుడ్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధం అయిపోయారు. బాలీవుడ్ లో కపూర్ లు, ఖాన్ ల శకం ముగిసిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సినిమాలు బాగానే బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాయి. రాజమౌళి నుండి వస్తున్న మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై హిందీ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పై బాలీవుడ్ నిర్మాతలు చాలా అమ్చనాలు పెట్టుకోగా…. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా కి దీపికా పదుకొనె హీరోయిన్. ‘ఆదిపురుష్’ అనే ఒక వందల కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లో ప్రభాస్ నేరుగా హీరోగా అడుగు పెట్టనున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా సినిమా. కొరటాల-బన్నీ సినిమా కూడా బాలీవుడ్ లో విడుదల కానుంది. అంతెందుకు… అల్లు అర్జున్ సినిమాలు డబ్బింగ్ అయినవి హిందీ అభిమానులు యూట్యూబ్ లో రికార్డుల మోత మోగేలా మిలియన్ల సార్లు వీక్షిస్తారు.
టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కేజిఎఫ్ బాలీవుడ్ లో ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దాని సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రం బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ సినిమా కూడా బాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూసి…. సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ పై వచ్చే రెండు సంవత్సరాల్లో చాలా పెద్ద దండయాత్రకుసిద్ధమైందని చెప్పవచ్చు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!