ఈ మధ్య కాలంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. నేతలు పార్టీ మారాల్సిందే తప్పించి రెండు వర్గాలు, రెండు పార్టీల క్యాడర్ లు మాత్రం ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు. నేతలు మారినంత మాత్రాన క్యాడర్ ఇంతకాలం చేతబూనిన జెండాను వీడేందుకు ఇష్టపడరు. అలాగే కొత్త నేత వచ్చి తమను ముందుకు నడిపిస్తామని చెప్పినా గానీ వారు అందుకు సుముఖంగా ఉండరు. ఇప్పుడు జమ్మలమడుగులో కూడా అచ్చం అలాంటి పరిస్థితి నెలకొంది.
క్యాడర్ పవర్ అలాంటిది మరి…
జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశాడు. అయితే వెంటనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. అతను చేరి ఆరు నెలలు కావస్తోంది కానీ పార్టీ కార్యక్రమాలకు సుధీర్ రెడ్డి అతనిని దూరం పెట్టాడు. దీనికి కారణం క్యాడర్ నుంచి రామసుబ్బారెడ్డి పై వస్తున్న వ్యతిరేకత అని అతని వర్గీయులు చెబుతున్నారు.
వారి కక్షలు అలాంటివి
వాస్తవానికి 2019 ఎన్నికల ప్రీ పోల్ ఈ సమయంలో వైసీపీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హోరాహోరీగా తలపడింది. అలా అనేక చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఎంతో మంది గాయపడ్డారు. ఒక మనిషి చనిపోయిన వార్తలు కూడా వచ్చాయి. పోలీసు కేసులు అయితే లెక్కకు మిక్కిలి నమోదయ్యాయి. కాపుకాసి చితకబాదిన సందర్భాలు బోలెడు. దీంతో రామసుబ్బారెడ్డి రాకను జమ్మలమడుగు వైసీపీ క్యాడర్ అసలు జీర్ణించుకోలేకపోతోంది. అందుకే సుధీర్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చే రామసుబ్బారెడ్డి ని పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపకుండా ఉండేలా చేస్తోందని…. అసలు అతనిని తమ పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరం పెట్టేలా చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
ఎవరి చేతిలో ఏం లేదు?
ఇక రామసుబ్బారెడ్డి ఈ తరహా వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నాడు. తను ఎంత దిగివచ్చినా…. కలుపుకొని పోయేందుకు సుధీర్ రెడ్డి ముందుకు రాక పోయేసరికి అతనికి అసహనం ఎక్కువైపోయి హైకమాండ్ వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. వాళ్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏ పార్టీ అయినా కేడర్ ను కాదని ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇలాంటి విషయాల్లో అయితే జమ్మలమడుగు వాసులు చాలా ఖచ్చితంగా ఉంటారు. కొంచెం కూడా తగ్గే అవకాశం లేదు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గం రగిలిపోతోంది. మరి భవిష్యత్తులో పరిస్థితి ఏమైనా మారే అవకాశం ఉందేమో చూడాలి.