అవునండీ… పవన్ పెళ్లి ఈసారి అమ్మాయితో కాదు.., బిజెపితోనే. ఇది మాత్రం గట్టి బంధమే. విడదీయరాని బంధంగానే రూపాంతరం చెందబోతుంది. ఎందుకు..? ఏమిటి..? అంత నమ్మకంగా ఎలా చెప్పగలం…? అని అనుమానాలుంటే మొత్తం ఓ లుక్కేయండి…!!
బిజెపి, జనసేన పెళ్లి.., కాపురం ప్రస్తుతం సజావుగానే సాగుతున్నాయి. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లి పిల్లల్ని కూడా కనే పరిస్థితికి చేరుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి పెళ్లి సక్రమంగా నిలబడాలన్నా… చక్కగా పిల్లల్ని కనాలన్నా… ఏలాలన్నా భారం మొత్తం పవన్ కళ్యాణ్ పైనే వేసేసింది బిజెపి. అందుకు నాలుగేళ్ళ ప్రణాళికను కూడా సిద్ధం చేసేసింది. అందులో భాగంగానే వైసిపిపై బీజేపీ పెద్దల వాగ్బాణాలు.., వైసిపి కాపు పథకంపై పవన్ విమర్శలు., ఇక్కడ కామినేని శ్రీనివాస్.., కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ నుండి… అక్కడ నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డిలు కూడా జగన్ పై బాణాలు ఎక్కుపెట్టారు. ఏడాది చూసారు, ఇక బాణాలు వేస్తున్నారు. ఏది ఏమైనా… ఒకవేళ ఇన్నాళ్లు ఉన్నట్టు జగన్- బిజెపి అనధికారికంగా కలిసి ఉండాలన్నా పవన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కి మొదటి శత్రువు వైసిపి.., ఆ తర్వాత తప్పదు అనిపిస్తేనే టిడిపి. అందుకే ఏడాది పాలన పూర్తయిన నాటి నుండి బిజెపి వ్యూహం మారింది. స్వరం పెరిగింది.
పవన్ బాధ్యతలు ఇవీ…!
ఏపీలో పాదయాత్ర సెంటిమెంట్ ఎంత బలంగా ఉందొ అందరికీ తెలిసిందే. 2004లో వైఎస్సార్ చేపట్టారు. గద్దెనెక్కారు. 2009లో చంద్రబాబు పాదయాత్ర చేయకుండా వాహన యాత్ర చేసి దెబ్బతిన్నారు. 2014లో చంద్రబాబు పాదయాత్ర చేసారు. గద్దెనెక్కారు. ఇక 2019లో జగన్ భారీ పాదయాత్ర చేసారు. తిరుగులేని విధంగా పీఠం దక్కించుకున్నారు…! మరి 2024లో ఎవరు పాదయాత్ర చేస్తారు..? టిడిపి తరపున ఎవరు అనే విషయాన్నీ పక్కన పెడితే.., జనసేన- బిజెపి తరపున మాత్రం పవన్ భారీ పాదయాత్ర చేస్తారని పార్టీ అంతర్గత సమాచారం. కేంద్రం సంపూర్ణ మద్దతుతో.., తెర వెనుక బీజేపీ సహకారంతో… 2022 చివరి నుండి 2023 మధ్య వరకు పవన్ పాదయాత్ర జరగనుంది అని సమాచారం. ఇంకా దీనికి చాల సమయం ఉంది. కానీ ఈలోగా ఒక మాటలు, కొన్ని ప్రణాళికలు, ఇంకొన్ని సమకూర్చుకోవాలి కదా… అందుకే జనసేన వర్గాలకు మాత్రమే ఆ పార్టీ కీలక నాయకుల నుండి 2024 ఎన్నికల నాటికి మీరు భరోసాతో ఉండండి. మన నాయకుడు పాదయాత్రతో వస్తున్నారు. అంటూ సందేశాలిస్తున్నారు. దీంతో పాదయాత్ర సెంటిమెంట్ ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటూ… సంబరపడిపోతున్నారు.
బీజేపీ వదిలే బాణం పవన్…!
బీజేపీ ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. మూడేళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకుని వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అందుకే ముందు నుండి వారికి కొరకరాని కొయ్యలుగా మారిన ఏపీ విషయంలో ఇప్పటికే కీలకంగా ఉన్నారు. ఎన్నికలకు, రాజకీయాలకు ఏమాత్రం సమయం కాకపోయినా ఉన్నట్టుండి పవన్ ని ఢిల్లీ పిలిపించి జత కట్టేశారు. టీడీపీలో ఉన్న కొందరు టాప్ నాయకుల్ని టార్గెట్ చేసారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీ లేచే పరిస్థితి లేకుండా చేసి… వారికి బీజేపీ నే దిక్కు అనేలా చేయడమే మొదటి ఎత్తు. ఇది అమలు చేసిన తర్వాత జగన్ పాలనలో తప్పులు, కొన్ని కుంభకోణాలు వెతికి అప్రతిష్ట చేయడమే మరో ఎత్తు. ఇలా రెండు బలమైన స్థానిక ప్రాంతీయ పార్టీలతో తలపడాలంటే స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు కావాలి. అందుకే బీజేపీ పవన్ ని ఎంచుకుంది. పవన్ అనే బాణాన్ని బీజేపీ మరింత బలంగా తయారు చేసి మరో ఏడాది తర్వాత నుండి ప్రత్యర్దులపైకి వదలనుంది.