ఈ విపత్కర కరోనా సమయంలో ప్రజలను తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతుంది పోలీసులు మరియు డాక్టర్లు అన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి డాక్టర్లను రోడ్డుమీదకు వచ్చి కూర్చునేలా చేసిన తీరు ఇప్పుడు మన రాష్ట్ర ప్రైవేటు మెడికల్ కళాశాలలు మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. తమకు సీట్లు వచ్చినా కూడా ప్రైవేటు వైద్య కళాశాలల్లో తమకు అడ్మిషన్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు.
వివరాల్లోకి వెళితే జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 56 ప్రకారం ప్రైవేటు మెడికల్ కళాశాలలో అన్నింటిలో పీజీ సీటుకు చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించారు. ఇంకా ఫ్రీ సీట్ వస్తే బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు చెల్లించవలసిన మొత్తం మరింత తగ్గిపోతుంది. దీనికి ప్రైవేటు మెడికల్ కళాశాల లు ఏవి సముఖంగా లేవు. ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ విద్యను అభ్యసించాలని వేచి ఉన్న ఎంతో మంది విద్యార్థులకు ఈ కళాశాలలు పీజీ లో సీటు వచ్చినా అడ్మిషన్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఇక వారు రాష్ట్రంలో ఏ విషయం తేలకపోయే సరికి దేశ వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ కు కూడా అనర్హులుగా మిగిలిపోయారు. ఇక్కడ సీటు గ్యారంటీ లేక అక్కడ కౌన్సిలింగ్ లో పాల్గొనలేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమకు సహాయం చేయమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని అడిగితే.. వారు కాస్తా చేతులెత్తేశారు. ఇక చివరి ప్రయత్నంగా వారు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఇప్పటికే ఈ కేసు ని 2 వాయిదాలు వేసింది.
ఈ నెల 24వ తేదీన మరొక వాయిదా ఉండగా 27 లోపల విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి పీజీ మెడికల్ విద్యార్థులు ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన జీవో 56 ను అనుసరించి తమకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా న్యాయబద్ధంగా కోర్టు వారైనా మరొక వాయిదా వేయకుండా ఈ విషయంపై ఏదో ఒకటి తెలిస్తే మంచిదని వారు అంటున్నారు.
ఈ కరోనా సమయంలో వేలాది మంది పేషెంట్లను కాపాడుతున్న డాక్టర్ లను తీసుకుని వచ్చి ఇలా రోడ్డు మీద నిలబెట్టడం సబబుగా లేదని వారు వాపోతున్నారు. వారి మాటల్లో న్యాయం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే ఈ విషయంపై తగిన సంప్రదింపులు జరిపి విద్యార్థులకు మేలు చేకూరేలా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.