కొన్ని ఆలోచనలు..? కొన్ని ప్రశ్నలు…? కొన్ని నిస్సహాయతలు..! వెరసి రాజధాని విషయంలో జగన్ ని ఇరకాటంలోకి నెట్టేసాయా..?
ఒక పార్టీ ఆడిన రాజకీయ దొంగాటలో పావుగా మారబోతున్నానని తెలుసుకుని.., తేరుకుని.., రాజధానిపై సీఎం మనసు మార్చుకుంటున్నారా..??
కోర్టు తీర్పులు ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా వచ్చినా… చంద్రబాబుని, కోర్టులను, అవసరమైతే జడ్జిలను కూడా కలిపి తిట్టిపోసే వైసీపీ నేతలు రాజధానిపై కోర్టు తీర్పులో ఎందుకు మౌనం వహించినట్టు…??
రాజధాని మార్పు ఆలోచన ఎవరిదీ..? ఎవరు బీజం వేశారు..? ఎవరు మాట మార్చారు..? ఎవరు బలి కాబోతున్నారు…?
ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. “న్యూస్ ఆర్బిట్” మార్కు సంచలన రాజకీయ అన్వేషణ కథనం.
రాజధాని మార్పు ఆలోచన ఇలా…!
2019 ఎన్నికలు ముగిశాక వైసీపీ అధికారంలోకి వచ్చింది. తిరుగులేని మెజారిటీతో జగన్ సీఎం అయ్యారు. పాలన స్టార్ట్ చేసారు. అంతా బాగానే ఉంది. ఇక బీజేపీతో వైసీపీ బంధం వెలుగులో లేకపోయినా చీకట్లో కొనసాగుతుంది అని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. బీజేపీ లక్ష్యం ఏపీలో ఎదగాలి. అది జరగాలంటే ప్రతిపక్షం (జగన్ కి ప్రత్యామ్నాయం) అనే ఒక స్థానం ఆక్రమించాలి. అందుకు తోకలా మారిన జనసేనని తమతో కలిసి నడిచేలా పొత్తుకి పిలిచింది. ఇక మరో అడ్డు టీడీపీ. దాన్ని అడ్డు తొలగించాలి అంటే జగన్ సాయంతోనే సాధ్యం. అందుకే పావులు కదిపింది, అమలు చేసింది. టీడీపీని దెబ్బ తీయాలంటే ఎమ్మెల్యేలను దూరం చేయాలి, రాజధానిలో చంద్రబాబు ముద్ర చెరపాలి.
* పార్టీల ఫిరాయింపులకు జగన్ వ్యతిరేకం… కానీ టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు…? టీడీపీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా చంద్రబాబుని దెబ్బ కొట్టొచ్చు అనేది జగన్ – బీజేపీ సంయుక్త వ్యూహం. అందుకే ఫిరాయింపులకు ఒకే అన్నారు.
* ఇక రెండో అంశం రాజధాని మార్పు. పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని మారిస్తే టీడీపీ ముద్ర అమరావతిపై పోతుంది. “మీరు అమలు చేయండి, మేము సహకరిస్తాం” అంటూ బీజేపీ నుండి హామీ అందింది. ఇక జగన్ ముందుకు దూకారు. రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టారు.
బీజేపీ వ్యూహం మార్చింది ఎక్కడంటే..??
బీజేపీ వ్యూహం పక్కగానే అమలవుతుంది. టీడీపీ బలహీన పడుతుంది. వారు భావించినట్టు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, మిగిలిన వారు పెద్దగా మాట్లాడడం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అంటే టీడీపీపై బీజేపీ పావులు ముందుగానే ఫలించాయి. ఇక జగన్ కి ప్రత్యామ్నాయం మనమే అనే ఆలోచనలోకి బీజేపీ వెళ్ళిపోయింది. కానీ బీజేపీ దొంగాటకి తెరతీసింది ఎక్కడ అంటే…??
* టీడీపీని దెబ్బతీసినట్టే వైసిపిని కూడా దెబ్బతీయాలి అనే అంతర్గత ఆలోచన చేసింది. అంటే ప్రజాబలం, ఎమ్మెల్యేల బలం గట్టిగా ఉన్న జగన్ ని నేరుగా విమర్శించడం.., ఇరుకున పెట్టడం కాకుండా…, వ్యవస్థల ద్వారా ఇరుకున పెట్టడం అనే సరికొత్త ప్లాన్ వేసింది. నిమ్మగడ్డ విషయంలో జగన్ కి చుక్కలు చూపించి.., తిప్పి, తిప్పి అదే స్థానంలో కూర్చోబెట్టింది. ఇక రాజధాని వ్యవహారంలో కూడా చుట్టూ తిప్పి ఏడాదో, ఏడాదిన్నర తర్వాతనో తేల్చనుంది.
* పాలనలో అత్యంత కీలకమైన రాజధాని వ్యవహారంలో ఇలా కోర్టులు, వివాదాలు అంటే సీఎం జగన్ నైతికస్థైర్యం దెబ్బ తింటుంది. ఏడాది, ఏడాదిన్నర పాటు సాగితే పాలనపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. తద్వారా జగన్ ని ఇరుకున పెట్టేసి, బలహీనం చేసేసి ఏడాది తర్వాత నేరుగా ఎదురుదాడి చేయవచ్చు అనేది జగన్ కి వ్యతిరేకంగా బిజేపీ రచించిన వ్యూహం. అంటే మొదటి అడుగులో టీడీపీని.., రెండో అడుగులో వైసీపీని బలి చేసే రాజకీయ ఎత్తుగడ.
వైసీపీలో అంతర్మధనం మొదలు…!
రాజధాని మార్పులో మొదటి అడుగులోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. కానీ ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు. ఎక్కడా మాట్లాడలేదు. వైసీపీలో ఒకరకమైన అంతర్మధనం మొదలయింది. ఎలా అంటే…!!
* రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పార్టీ బలంగానే ఇది. కృష్ణ, గుంటూరు జిల్లాలో కూడా ఆశించిన కంటే ఎక్కువ స్థానాలే వచ్చాయి. మరి రాజధాని నిర్ణయంతో ఈ జిల్లాల్లో ఎందుకు మనం బలహీనపడడం..?
* “రాష్ట్రంలో 5 , 6 జిల్లాలు వ్యతిరేకిస్తున్న పాలనా వికేంద్రీకరణను అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా ఆయా జిల్లాల్లో దెబ్బతింటాం. అది పార్టీకి ఎదురు దెబ్బ అవుతుంది. ఈ క్లిష్టమైన నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం”..?
* అలా అని “ఈ సమయంలో వెనకడుగు వేస్తే టీడీపీ గెలిచినట్టు ఉంటుంది. అందుకే కోర్టుల ద్వారానే వెళ్దాము.., కోర్టులే కాదంటే ఆగిపోదాం..! కోర్టుల్లో పెద్దగా పోరాడవద్దు, పెద్దగా విమర్శలు చేయవద్దు. నిమ్మగడ్డ వ్యవహారంతో నేర్చుకున్నది చాలు..” అని వైసీపీ అంతర్గత ఆలోచనలు, పెద్దల చర్చలు నడుస్తున్నాయని విశ్వసనీయ సమాచారం.
ఒక్క ముక్కలో సింపుల్ గా…!!
రాజధానిని రాజకీయంగా వాడుకోవాలనుకున్నది టీడీపీ. ఆ రాజధాని మార్పు ద్వారానే టీడీపీని దెబ్బతీయాలని ఆలోచన చేసింది బీజేపీ. అనంతరం వ్యవస్థల ద్వారా ఆడుకుని, రాజధానిపై జగన్ ని ఇరికించాలనుకున్నది బీజేపీ. ఇలా దొంగాట (ద్వంద్వాట)కు తెరతీసిన బీజేపీ విషయంలో జగన్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి రాజధానిపై ముందుకు వెళతారా..? బీజేపీ ఆటకు ఎక్కడ? ఎలా పుల్ స్టాప్ పెడతారు..? అనేది కాలమే నిర్ణయించాలి.