పొలిటికల్ మిర్రర్
ఇది ఒక పార్టీకి వ్యతిరేక కథనం కాదు…! ఒక వాస్తవిక కథనం. ఇది ఫక్తు “న్యూస్ ఆర్బిట్” మార్కు రాజకీయ కథనం. టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ అంతర్గత ఆర్ధిక వ్యవస్థపై ఒక కన్నేయడం సగటు రాజకీయం అభిమాని ఆసక్తి. అందుకే కన్ను, ముక్కు, చెవి మొత్తం వేసేలా చేసే స్టోరీ ఇది. ఇక అసలు విషయంలోకి వెళ్తే…!
- చంద్రబాబుకి నీడగా ఉండే సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నట్టుండి ఆకస్మికంగా ఎందుకు పార్టీ మారిపోయారు? గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్నారుగా.., ఇప్పుడే ఎందుకు మారిపోయారు..?
- ఎన్నికలు ముగిశాక, నెల వ్యవధిలో విజయవాడలో టీడీపీ కాపు నాయకులంతా సమావేశమై ఏం చర్చించారు? లోకేష్ తీరుపై ఎందుకు చిందులు తొక్కారు? పార్టీలో ఉండాలంటే ఏం హెచ్చరికలు జరీ చేశారు?
- ఎన్నికలు ముగిసిన నెలల వ్యవధిలోనే అంత అర్జంటుగా “తన సామజిక వర్గాన్ని వదిలి” దేవినేని అవినాష్ పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది?
- మొన్న ఆదివారం యువ నాయకులకు లోకేష్ విందు భోజనం ఏర్పాటు చేస్తే చివరిలో కొందరు ఆర్ధిక భరోసా ఇవ్వాలని? బకాయిలు తీర్చాలని కోరి, లోకేష్ పై ఎందుకు అసంతృప్తి వెళ్లగక్కారు?
- అసలు ఎన్నికల సమయాన ఎప్పుడూ ముందే పంపినీల్లో మునిగే టీడీపీ ఈ సారి ఎందుకు వెనుకబడింది? కొన్ని నియోజకవర్గాల్లో పంచితే గెలిచేవాళ్లమన్న భావన ఇప్పటికీ ఎందుకు ఉంది? వీటన్నిటికీ సమాధానమే ఈ కథనం.
రాజకీయ పార్టీలన్నాక ఆర్ధిక మూలాలు ఉండాలి. దేశంలో ఏ రాజకీయ పార్టీలకైనా కార్పొరేట్ శక్తులే ఇప్పుడు ఆర్ధిక మూలాలు. జాతీయ స్థాయిలో రిలయన్స్, అదానీ గ్రూపులు లాగానే, తెలుగు రాష్ట్రాల్లో ఎల్ అండ్ టి, గాయత్రీ, మేఘ, నవయుగ అన్నమాట. ఇవి పెద్ద పేరున్న కంపెనీలు కదా, పార్టీలకు ఆర్ధిక మూలాలు ఎందుకు అవుతాయి??? అనే సందేహం వద్దు. ఎన్నికల సమయంలో ఇటువంటి
కంపెనీలు చేసే హడావిడి పార్టీల కంటే ఎక్కువగా ఉంటుంది. రేప్పొద్దున పార్టీలు గెలిచాక వేలకోట్ల కాంట్రాక్టులు వీటికే ఇవ్వాలిగా అందుకే..! ఎన్నికలకు ముందు లావాదేవీల సర్దుబాటు సదరు కంపెనీల నుండి జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? అనే విషయమై ముందే పక్కాగా అంచనాకు వచ్చి ఆ పార్టీకి ఈ కంపెనీలు సహకరిస్తుంటాయి. ఒక వేళ తమ అంచనా బెడిసి కొడితేనో…??? అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రెండో పార్టీకి కూడా కొంత తక్కువగానైనా సహకారం ఇస్తాయి. ఈ సహకరమే ఎన్నికల చివరి రోజుల్లో రకరకాలుగా ఉపయోగపడతాయి. ఎన్నికలకు ఇవే ఆధారం.
నాడు ఏం జరిగిందంటే..?
ఇప్పుడు కొద్దిగా తొమ్మిది నెలల ముందుకి వెళదాం. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు అన్ని నియోజకవర్గాల్లో వైసిపి బాగానే, అనుకున్నట్టు చేర్చేసింది. అధికారం లో ఉన్న టీడీపీ మాత్రం చేర్చలేకపోయింది. టీడీపీకి రావాల్సిన కార్పొరేట్ పైకం నాడు రాలేదు. కెసిఆర్, బిజెపి, జగన్ కలిసి చంద్రబాబు ఆర్ధిక మూలాలైన కొన్ని కంపెనీలను అష్ట దిగ్భంధనం చేసి ఇవ్వనీయలేదు. (కాంగ్రెస్ కి తెలంగాణ ఎన్నికల్లో నిధుల సర్దుబాటు చేసింది మన బాబోరు. అందుకే కెసీఆర్ కి, బిజెపికి అంత కాలింది, అక్కడ బండి ఆగింది). అందుకే బాబోరు కూడా జనవరిలోనే ఫిక్స్ అయిపోయారు ఇహ కష్టమే అని..! ఎన్నికల నాటికి చేతులెత్తేశారు. “మీరు సర్దుబాటు చేసుకోండి, తర్వాత ఇచ్చేద్దాం” అంటూ టీడీపీ ఆర్ధికశాఖ చెప్పుకొచ్చింది. చాల చోట్ల రాలేదు. అందుకే అక్కడక్కడా ఉన్నవి, పక్కనున్నవి, ఆస్తులు తాకట్టు పెట్టి, కొందరు నాయకులు పోగేసినవి తెచ్చుకుని ఎలాగోలా కొంత మేరకు పంచగలిగారు. కానీ ఫలితం లేదు. ఇంతా జరిగిన తర్వాత రెండు రోజులకు టీడీపీకి చేరాల్సినవి వదిలారు. కానీ ఇవన్నీ బాబుకి తెలియక కాదు. నాడు కాంగ్రెస్ కి తెలంగాణ ఎన్నికల నాడు సర్దుబాటు చేసినప్పుడే బాబోరు ఈ కష్టాన్ని గ్రహించారు. అందుకే ముందుచూపుగా ఫిబ్రవరిలో పించెను పెంచడం, మర్చి, ఏప్రిల్ లో రైతులకి రుణ మాఫీ, మహిళలకు పసుపు కుంకుమ అనీ ఇచ్చేసారు. ఇక పార్టీ ఆర్ధిక శాఖ ఆ పార్టీకి కాబోయే పెద్ద లోకేషుపై ఈ భారాన్ని పెట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో మునిగారు. (ఇదీ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం)…!
అమ్మ లోకేశు… మరీ అంత లెక్కలేంటయ్యా…!
బాబు జ్ఞానం అపారం. ఎన్నికల్లో ఆర్ధికం నిర్వహణలో ఆయనకి తిరుగులేదు. కానీ ఈ ఎన్నికల్లో లోకేసుకీ అప్పగించి, పర్యవేక్షకులుగా సుజనా లాంటి ఘటికులకు అప్పజెప్పి బాబోరు ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఎన్నికల్లోనూ టిడిపికి ఆర్ధిక శాఖ చూసుకునేది నారాయణ, సుజనా, సీఎం రమేష్, గరికపాటి, మురళీమోహన్ వంటి ఘటికులే. ఈ సారి లోకేష్ కి కీలక బాధ్యతలు పంచారు. సరే ఎన్నికలు ముగిసాయి చాల చోట్ల స్థానికంగా సర్దుబాటు చేసుకుని అప్పటికప్పుడు ఇవ్వగలిగారు. పార్టీ నుండి వస్తాయని వేచి చూస్తున్నారు.
- ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడికి 17 ఇస్తామని పార్టీ చెప్పింది. అందుకే సుజనా భరోసాగా ఉన్నారు. ఆయనకు ఎలాగోలా 12 చేర్చారు. మిగిలిన 5 కోసం ఆయన ఇల్లు తాకట్టు పెట్టారు, మరొకరి దగ్గర అప్పు తెచ్చారు. ఆయన ఓడారు. ఇవి రాలేదు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో మునిగిపోయారు. పార్టీ నుండి రాక కోసం వేచి చూస్తున్నారు.
- ఇదే ప్రకాశం జిల్లాలోనే మరో రెండు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరికి ౩౦, మరొకరికి 27 ఇస్తామని చెప్పారు. 27 కి గాను 23 ఇవ్వగలిగారు. మరొకరికి ఆ 30 తో పాటు క్వారీల వాళ్ళు, ఇతరులు కలిపి ఆయనకు 45 వరకు ముందే ఇచ్చేసారు. ఆయన ఖర్చులు పోనూ కొంత మిగుల్చుకున్నారనే టాక్ ఉంది. మరో రెండు చోట్ల ఇప్పటికీ ఇస్తామన్నవి ఇవ్వలేదు. “ఇంత పోటీలోనూ గెలిచాం. ఇస్తామన్నవీ ఇవ్వలేదు. అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది అంటూ యువనేతలు ఆందోళనల్లో ఉన్నారు. కొందరు చేసింది చాలు వ్యాపారాలు చేసుకుందాం అంటూ బెంగుళూరు, హైదరాబాద్ లలో వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు.
- కృష్ణ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉన్న ఓ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధిని ఎలాగైనా ఓడించాలని లోకేశం, బాబోరు, అందరూ స్కెచ్ వేశారు. యువ నాయకుడిని దించి ఎంతైనా పెట్టు, మేము ఇస్తామని భరోసా ఇచ్చారు. అలా అలా అక్కడ 60 వరకు ఖర్చయ్యింది. పార్టీ నుండి 35 రావాల్సింది ఇప్పటికీ రాలేదు. (ఎన్నికలయ్యాక ఇచ్చేస్తాం అని చెప్పి, తర్వాత ఇవ్వలేదు. ఇప్పటికీ ఇదే ఆందోళనల్లో సగం మంది ఇంచార్జిలు, నాయకులూ ఉన్నారు)
లోకేష్ పై రగడ…!
పార్టీ ఆర్ధిక పరిస్థితులు చూడడం తేలికైన పని కాదు. ఎన్నికల ముందు రావాల్సినవి తర్వాత వచ్చాయి. అందుకే ముందు ఇవ్వాల్సినవి తర్వాత ఇవ్వాల్సిందే. లోకేష్ అందులో విఫలమయ్యారు. సుజనాకి ఆయనకి చెడింది. ఇతర ముఖ్యులకు కూడా చెడింది. కాపు నాయకులకు లోకేషం లెక్కలు అడగడం, నియోజకవర్గాల వారీగా ఖర్చులు తెప్పించి ఆరాలు తీయడం, తిరిగి ఇవ్వకపోవడం నచ్చలేదు. బాబోరుకి చెప్తే బాబుపై ప్రేమతో వినరు. అందుకే సుజనా అండ్ బ్యాచ్ సరైన సమయం చూసుకుని బిజెపికి జంపయ్యారు. కాపు నాయకులూ కొందరు బాబుకి అల్టిమేటం పెట్టారు. వీరు పెట్టిన ముఖ్య అల్టిమేటం ఏమిటంటే “స్థానిక సంస్థల నాటికి మాకు ఇవ్వాల్సినవి ఇవ్వాలి. లోకేష్ కి ఆర్ధిక బాధ్యతల నుండి తప్పించాలి” అని…! రగడ ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. యువ నేతల మీటింగ్ లోనూ “ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పులున్నాయి” అనే మాటలు కొందరు వదిలారట. మొత్తానికి టీడీపీ లో స్థానికం నాటికి ఆర్ధిక లెక్కలు తేలకపోతే చాల మంది ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేయడానికి సిద్ధంగా ఉన్నారు.
( తర్వాత సందర్భం చూసుకుని వైసిపి లెక్కలూ చెప్పుకుందాం)