కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా… ఎక్కడ విన్నా కరోనా బాధలే. కరోనా లాక్ డౌన్ తో జనజీవనం స్తంభించిపోయింది. రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు మొదలుకొని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ప్రభుత్వం అందించిన వేయి రూపాయల ఆర్ధిక సాయం, రేషన్ బియ్యం, కందిపప్పుతో ఆకలి తీరే పరిస్థితి లేదు.
సేవా ముసుగులో పబ్లిసిటీ స్టంట్
వీరి బాధలు ఇలాఉంటే కరోనా విపత్కర పరిస్థితులను కొందరు నేతలు, సంఘాల ప్రతినిధులు క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఆదుకునే దానగుణశీలులు ఉన్న ఈ పుణ్యభూమిలోనే కొందరు స్వార్ధ పరులు ఉన్నారు. లక్షల్లో విరాళాలు సేకరించి వేలల్లో పంపిణీలకు ఖర్చు చేసి జేబులు నింపుకునే వారు కొందరైతే…. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అన్న తీరుగా దాతలను హైడ్ చేసి తామే పేదల కడుపు నింపడానికి వచ్చిన అపర దానకర్ణుల మాదిరిగా సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు మరి కొందరు. అయితే ఇటువంటి కొందరి వల్ల నిజమైన సేవా తత్పరులు కూడా అక్కడక్కడా విమర్శలను ఎదుర్కొనే పరిస్థితి.
గోరంత సాయం…కొండంత ప్రచారం
పలు ప్రదేశాలలో రాజకీయ పార్టీల నాయకులు స్వచ్చందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం అక్కడక్కడ కూరగాయలు, మాస్కులు, శానిటైజర్ లు వంటివి పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు ఎలా చేసినా సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందించదగిన విషయమే.
గుప్త దాతలే అధికం
చాలా చూట్ల సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించే కొందరు దాతలు వారి పేర్లు బహిర్గతం అయ్యేందుకు ఇష్టపడరు. తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇటువంటి విపత్కర పరిస్థితిలో పేదలకు సాయం చేయాలన్న మంచి సంకల్పంతో వెచ్చిస్తూ ప్రచారానికి దూరంగా ఉంటుంటారు. తాము సాయం చేశామని తెలిస్తే మరి కొందరు వచ్చి విరాళాల కోసం వత్తిడి, బెదిరింపులకు దిగుతారని హైడ్ గా ఉండిపోతుంటారు. ఇది కొందరికి లాభం. మరి కొందరికి ప్రచారం.
అక్రమ వ్యాపారులకు కాసుల పంట
కరోనా లాక్ డౌన్ లో అనేక వర్గాలు ఇబ్బందులు పడుతుంటే కొందరు అక్రమ మార్గాలు ఎంచుకొని జేబులు నింపుకుంటున్నారు. నిషేదిత గుట్కాలు, మద్యం విక్రయాలు చేస్తూ ఆ వర్గ బానిసలను దోచుకుంటున్నారు. రూ.10-రూ.20ల ధర ఉన్న గుట్కా (ఖైనీ) నాలుగైదు రెట్లు, రూ.100 -150 రూపాయలకు విక్రయించే మద్యం క్వార్టర్ బాటిళ్లను రూ.500ల నుండి రూ.600ల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.