వైసీపీలో హాట్ టాపిక్..వారిపై డేగకన్ను
అసలు కధ నడిపిస్తుంది..వారేనా…!
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారారు. అనూహ్యంగా ఎన్నికల సమయంలో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోక్యంతో వైసీపీ నుండి నర్సాపురం అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఎంపీగా గెలిచారు. ఇక..వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జగన్ విధేయుడిగానే వ్యవహరించిన రఘురామ రాజు తీరులో కాల క్రమేణా మార్పు వచ్చింది.
ఢిల్లీ వేదికగా ఎంపీలకు విందు ఇవ్వటం…పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని పేరుతో రఘురామ రాజును పలకరించటంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రధానితో తనకున్న సంబంధాలు ఏంటనేది ఈ పలకింపు ద్వారా అందిరకీ తెలిసిందని..తనకు ఎదురులేదనే భావన ఆయనలో కనిపించింది. అదే సమయంలో.. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కొన్నింటిపైన రఘురామ రాజు తీవ్రంగా స్పందించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ తో నాలుగు నెలల క్రితం కలవటం ద్వారా ఇక సమస్య లేదని అందరూ భావించారు. కానీ, రఘురామ రాజు వైసీపీలో ఉంటున్నా…ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారనేది వైసీపీ నేతల అనుమానం. దీంతో..రఘురామ రాజు వర్సెస్ వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు..ఆ తరువాత రఘురామ రాజు వర్సెస్ వైసీపీ ఎంపీలు అన్నట్లుగా మారింది. ఇక, రఘురామరాజు పార్టీని ధిక్కరిస్తున్నారని.. ఆయన పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే..ఇప్పుడు వైసీపీలో రఘురామ రాజును ఫాలో అయ్యే వారు ఎవరున్నారు.. ఎవరితో ఆయన టచ్ లో ఉన్నారు..అసలు దీని వెనుక నడిపిస్తుందెవరు అనే కోణం పైన వైసీపీలో హాట్ టాపిక్ సాగుతోంది.
వారి ప్రసన్నం కోసమే..!
2019 ఎన్నికల్లో వైసీపీ నుండి 22 మంది ఎంపీలు గెలిచారు. అయితే, రఘురామ రాజు తొలుత బీజేపీ..టీడీపీ నుండి వైసీపీలో చేరిన వ్యక్తి కావటం..పైగా పారిశ్రామిక వేత్త..కొన్ని కేసులు ఉండటంతో ఆయనకు కేంద్రంతో సంబంధాలు అవసరంగా మారాయనేది సహచర ఎంపీల వాదన. దీనికి తగినట్లుగానే రఘురామ రాజు బీజేపీ ముఖ్య నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతల ప్రసన్నం కోసం అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం తీసుకొన్ని కొన్ని నిర్ణయాలను నేరుగా తప్పు బట్టారు. తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వకుండా ఆయన కోటరీలోని నేతలు అడ్డుడుతున్నారంటూ ఆరోపణలు చేసారు. దీనికి కౌంటర్ గా నర్సాపురం పరిధిలోని పార్టీ నేతలు రఘురామ రాజును కౌంటర్ చేసారు. వారందిరితో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడిస్తున్నారనేది రఘురామ రాజు భావనగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు రఘురామ రాజు తో ఏపీలో టీడీపీ నుండి బీజేపీలో చేరిక ఒక ముఖ్య నేతతో టచ్ లో ఉన్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రఘురామ రాజు తనకు కేంద్రంలో ని బీజేపీ నేతల మద్దతు పూర్తిగా ఉంటుందని అంచనా వేసినా..తాజాగా ఢిల్లీ పర్యటనలో అసలు విషయం ఆయనకు బోధ పడినట్లుగా చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలు వైసీపీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు ఏం చేయటానికి సిద్దంగా లేరనే విషయం తెలిసిందని ఢిల్లీ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. దీని కారణంగానే వైసీపీ ఎంపీలు అటు తన పైన అనర్హత పిటీషన్ స్పీకర్ ఇచ్చేందుకు సిద్దం కాగానే..ఇటు పార్టీ నుండి తనను కోర్టును ఆశ్రయించారు.
వదిలేస్తే..అంతే సంగతులు..
ఇదే సమయంలో..వైసీపీలో మరో చర్చ మొదలైంది. రఘురామ రాజు వ్యవహారం ఢిల్లీ స్థాయికి చేరటంతో..ఇప్పుడు వదిలేస్తే పార్టీలోని మిగిలిన వారి మీద ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది. దీంతో.. ఎంపీ పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీలోకి ఎన్నికల ముందు చేరి..కోస్తా జిల్లాల నుండి ఎంపీలుగా గెలిచిన ఇద్దరు నేతలు బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం వెంపర్లాడుతున్నారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో భారీగా జరుగుతోంది. అయితే ,వారు ఎప్పుడూ వైసీపీ నాయకత్వాన్ని..ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించలేదు. స్వతహాగా పారిశ్రామికవేత్తలు కావటంతో కేంద్ర పెద్దలతో వ్యాపార పరమైన సంబంధాల కోసమే టచ్ లో ఉన్నారనేది వైసీపీ క్యాంపు వాదన. అయినా..పార్టీతో విభేదిస్తే అనర్హత..ఉప ఎన్నికలకైనా సిద్దమనే సంకేతిచ్చేందు కోసమే రఘురామ రాజు విషయంలో వైసీపీ నేరుగా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పటికిప్పుడు స్పీకర్ అనర్హత వేటు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపించటం లేదు. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించటానికి సైతం బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్దంగా లేదు. కేంద్రానికి అసవరమైన ప్రతీ సందర్భంలోనూ రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తూనే ఉంది. దీంతో..ఇప్పుడు రఘురామరాజు పైన పార్టీ పరంగా చర్యలు తీసుకొనే అవకాశం మాత్రం వైసీపీకి ఉంది. దీని పైనే రఘురామ రాజు కోర్టుకు వెళ్లారు. అయితే, రఘురామ రాజు వ్యవహారంతో వైసీపీ అధినాయకత్వం మాత్రం అప్రమత్తమైంది. ఢిల్లీ కేంద్రంగా తమ పార్టీ ఎంపీల తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తోంది. దీంతో..ఇప్పుడు ఒక రకంగా రఘురామ రాజు కు చెక్ పెడుతూనే..ఇతర నేతలకు తమను ధిక్కరిస్తే తమ వైఖరి ఎంత కఠినంగా ఉంటుందనేది స్పష్టం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ పొలిటికల్ గేమ్ ఎటువంటి టర్న్ తీసుకుంటుంది..ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.