Raghuveera Reddy ; అనగనగా ఒక పార్టీ.. నూట ముప్ఫయి ఏళ్ళ చరిత్ర.. అందులో నూరేళ్ళకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ..! ఆ పార్టీకి ఏపీ ఒకప్పుడు కంచుకోట. పెద్ద పెద్ద నాయకులను అందించింది ఈ రాష్ట్రం. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకులకు ఈ రాష్ట్రం ఆ పార్టీకి అందించింది. ఆ పార్టీ కూడా రాష్ట్రానికి అందించింది..! అలా 2014 వరకు ఈ జర్నీ సాఫీగానే సాగింది. ఆ తర్వాతే మొదలయింది. ఆ తర్వాత మొదలైన దానికి సాక్ష్యమే నిన్నటి రఘువీరారెడ్డి ఫోటో..!!
Raghuveera Reddy ; కాంగ్రెస్ ఒక సెంటిమెంట్.. కాంగ్రెస్ ఒక వ్యవస్థ..!!
కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. దేశానికి రాజకీయాన్ని నేర్పించిన పార్టీ. దేశానికి పాలన నేర్పించిన పార్టీ. దేశానికి నాయకత్వాన్ని అందించిన పార్టీ. ఆ పార్టీ వేలాది నాయకులను తయారు చేసింది. పూర్వీకుల నుండి మారు మూల కుగ్రామాల్లో కూడా హస్తం గుర్తు పేరుకుపోయింది. పదేళ్లకు ముందు వరకు గ్రామాల్లో గోడలపై ఎక్కడ చూసినా… హస్తం గుర్తు ఉండేది. అలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థగా ఉండేది. నెహ్రు.. ఆపై వారసులు ఇందిరా గాంధీ, రాజీవ్ ఈ అందరూ ఒక చరిత్ర. వీళ్ళను అభిమానించే నేతలు దేశం మొత్తం వేళల్లో ఉండేవారు. ఆపై రాజీవ్ భార్య సోనియా గాంధీ.. వారి వారసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉన్నారు. ఈ కుటుంబమే కాంగ్రెస్. నెహ్రు – గాంధీ కుటుంబాల దేశా జ్ఞాపకాలే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఒక సెంటిమెంట్, కాంగ్రెస్ అంటే ఒక సముద్రం..! కానీ… ఇప్పుడు కాంగ్రెస్ ఆ సముద్రంలోనే మునుగుతున్న దశకు వెళ్ళిపోయింది. నాయకత్వ లేమి, తప్పుడు నిర్ణయాలు, స్వీయ తప్పిదాలతో ఈ దశకు చేరుకుంది..!!
ఏపీని విభజించి.. నట్టేట మునిగింది..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ బలంగానే ఉండేది. 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభావంతో రెండు దఫాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ హవాతో కాంగ్రెస్ పాలన ఏపీలో బాగానే సాగింది. అలా ఉండగా.. 2009 లో వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో జవాబుదారీతనం పోతే.., 2014 లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నట్టేట మునిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ… అక్కడ ఆ సెంటిమెంట్ ని నిలబెట్టుకోలేదు. నడిపించే నాధుడు లేని నవలా మారింది. ఆ విభజన కోపంతో ఏపీలో కాంగ్రెస్ కోమాలోకి పోయింది. 2019 నాటికి కూడా కోమా నుండి ఇంకా రాలేదు. వస్తుందో, లేదో కూడా తెలియని దశకు వెళ్ళిపోయింది.
నాయకులూ ఏమైనట్టు..!? రఘువీరా ఎందుకిలా..!?
ఇక కాంగ్రెస్ అంటే చెప్పుకోవాల్సింది ఆ సంప్రదాయ పార్టీలో ఉన్న సంప్రదాయ నాయకుల గురించి… ఏపీలో గడిచిన రెండు దశాబ్దాల నుండి కాంగ్రెస్ అంటే గుర్తొచ్చేది వైఎస్ తర్వాత కేకే, మర్రి శశిధర్ రెడ్డి, డీఎస్ (డీ శ్రీనివాస్), రోశయ్య, వీ హెచ్, బొత్స , ధర్మాన, ఆనం, రఘువీరా, శైలజానాధ్ తదితరులు. ఈ నాయకులు అందరూ చెరో చెట్టు చూసుకుని… నీడ వెతుక్కున్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆరెస్ పార్టీలో కొందరు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లో కొందరు చేరిపోయారు. కానీ వీరిలో చాల మందికి మనసులో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ తో ఒకసారి ప్రయాణం చేస్తే… అలాగే అల్లుకుపోయి నాయకత్వం.. సంప్రదాయ రాజకీయం ఉంటుంది. అటువంటి పార్టీ కోమాలో ఉండడంతో ఏ పార్టీలోకి వెళ్లలేని నాయకులు సైలెంట్ అయిపోయారు.
* కొందరు ఏ పార్టీలోనూ చేరలేక.. కోమాలో ఉన్న కాంగ్రెస్ కి మళ్ళీ ఊపిరి అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. 2014 నుండి 2019 వరకు రఘువీరా రెడ్డి అదే ప్రయత్నం చేసి.. ఇక తన వలన కాదు అనుకుని ఇప్పుడు రాజకీయం, పార్టీ అంటే విరక్తితో, వైరాగ్యం చెంది నిన్న కనిపించిన ఫొటోలా మారిపోయారు.
* ఇక కొందరు పార్టీ ఊపిరి అందుకున్న వెంటనే మళ్ళీ దానిలోకి వెళ్లిపోవాలని సిద్ధంగా ఉన్నారు. అటువంటి కోవలోకే మాగుంట, ధర్మాన, ఆనం, బొత్స లాంటి నాయకులు వస్తారు.
* ఇక కాంగ్రెస్ ఉన్నా, లేకపోయినా తాము మాత్రం ఆ పార్టీ జెండాతోనే ఉండిపోవాలని కొందరు ఫిక్సయ్యారు. అటువంటి కోవలోకి తులసిరెడ్డి, శైలజానాధ్ లాంటి నేతలు వస్తారు..!! ఇక్కడో ఆసక్తికరమైన గమ్మత్తు ఏమిటంటే.. ఈ చివరి జాబితాలోని నేతలు కూడా ఇప్పుడు పక్క పార్టీల చూపులు చూస్తుండడమే..!!