ఇది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాలం కలిసొస్తే ఏదైనా సాధ్యమే… కాలం కలిసిరాకుంటే ఏదీ సాధ్యం కాదు… ఇదే ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి. ఏమో ఏపీ విభజన తర్వాత ఆ పార్టీ నేలమట్టమైపోతోంది.
వాస్తవానికి విభజనతో కొన్ని సీట్లనైనా రాబట్టుకుంటామని వేసిన పాచిక అట్టర్ ఫ్లాప్ అవగా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిక్కిబిక్కుమంటోంది. 2014-2020 మధ్య ఆ పార్టీ ఎన్నో విషమ సంకటాలను ఎదుర్కొంది. మధ్యలో పుంజుకొంది. వాస్తవానికి శరీరంలో ఎక్కడైనా సమస్య ఉంటే… అందుకు తగిన విధంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎవరైనా చేసే పనే. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇప్పుడు రోగం తెలిసింది. అందుకు మందు తెలిసింది. కానీ చికిత్స చేయడానికి తగిన సందర్భం కన్పించడం లేదు.
ముఖ్యమంత్రి పీఠం నుంచి గెహ్లాట్ ను తప్పించాలంటూ స్కెచ్ వేసిన సచిన్ పైలెట్ మొదట్లో కొంచెం బెరుగ్గా కన్పించినా ఇప్పుడు రోజు రోజుకు స్ట్రాంగ్ గా తయారవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అంత తేలిగ్గా తీసుకోదని చరిత్ర చెబుతున్న సత్యం. అయితే సచిన్ విషయంలో ఆ పార్టీ చేస్తున్న తప్పులన్నీ కూడా బీజేపీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్కు మార్గం సుగమమం చేస్తోంది. అవును సచిన్ పైలెట్ ను అడ్డుపెట్టుకొని రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారును కూల్చేస్తోందంటూ హస్తం పార్టీ నేతలు బాగానే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాను తీసుకున్న గోతిలో కాంగ్రెస్సే పడుతున్నట్టు కన్పిస్తోంది.
బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా ఇప్పుడు రివర్స్ గేర్లో ఆ పార్టీని ఇరుకునపెడుతోంది. అంతా బాగా ఉన్నప్పుడు ఎవరూ కూడా మాట్లాడరు. తేడా వస్తేనే స్టాండ్లు తీసుకుంటారు. ఇప్పుడు బీజేపీ గేమ్ మొదలవడంతో రంగంలోకి బెహన్జీ మాయవతి కూడా వచ్చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అంశంపై పోరాటానికి సిద్ధమని.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానంటూ ఆమె చేస్తున్న హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయ్. అంటే మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్యేలు దారిలోకి వస్తే ఓకే… లేకుంటే వారందరూ డిస్క్వాలిఫై అయిపోయినా అయ్యే పరిస్థితి క్రియేట్ చేయాలని మాయవతి వచ్చినట్టు కన్పిస్తున్నారు.
200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఇప్పుడు గెహ్లాట్ బలం కేవలం 102 మాత్రమే. అంటే మెజార్టీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే అదనంగా ఉన్నారు. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలనీనం కావడంతో ఆయనకు కొంత సానుకూలత లభిస్తుంది. ఇప్పటికే బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం అంశం రాజస్థాన్ హైకోర్టులో ఉంది. సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెబుతానంటూ బెహన్జీ విసురుతున్న సవాల్ ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్.
వీలైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బలపరీక్షలో విజయం సాధించాలని చూస్తుంటే… గవర్నర్ నుంచి వస్తున్న కండిషన్స్… కాంగ్రెస్ పార్టీని కంగారుపెట్టేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటూ గవర్నర్ ను కోరగా… అందుకు ఆయన ఇచ్చిన 21 రోజుల నోటీస్ ఇప్పుడు గెహ్లాట్ కు సంకట స్థితి తీసుకొస్తున్నాయ్. అసెంబ్లీ నిర్వహించడం ప్రభుత్వ హక్కు… గవర్నర్ అనుమానాలు నివృత్తి చేస్తామంటూ ఆ పార్టీ చెబుతున్నప్పటికీ… సంథింగ్ సంథింగ్ జరుగుతుందన్న ఫీలింగ్ కలిగిస్తోంది. బలపరీక్షకు ముందే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న వ్యూహం రాజస్థాన్లో అమలవుతున్నట్టుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి మరో వారం పది రోజుల్లో గెహ్లాట్ మాజీ సీఎం అయ్యే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది.