కష్టం అనుకుంటాం కానీ.., ధనవంతులు అవ్వడం చాలా ఈజీ..! కొంచెం సంపాదించి ఆ కొంచెముతో ఒక కంపెనీ పెట్టేసి.., ఆ కంపెనీకి కొన్ని బోగస్ పత్రాలు సృష్టించేసి.., ఆ బోగస్ పత్రాలతో బ్యాంకుల దగ్గరకు వెళ్తే వద్దన్నా రుణాలిస్తారు..! ఆ రుణాలుతో ఇంకొన్ని కంపెనీలు పెట్టి మళ్ళీ రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలు తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. ఏ పార్టీ అధికారంలో ఉంటె, ఆ పార్టీలో చేరిపోతే చాలు ఇక డబ్బే డబ్బు..! ఉన్నంత కాలం ఉన్నతంగా ఉండొచ్చు, పాపం పండితే ఒక కేసు అవుతుంది. మహా అయితే కోర్టు, కేసు, వాదన అంతే తప్ప ఈ బ్యాంకులు, ఈ ప్రభుత్వాలు ఏమి చేయలేవు..! చేస్తే, చేస్తాయన్న భయం ఉంటె ఒక విజయ్ మాల్యా.., ఒక నీరవ్ మోడీ, ఒక రాయపాటి సాంబశివరావులు ఎలా వస్తారు..!? ఇండియాలోనే ప్రస్తుతం అత్యధిక బ్యాంకు స్కామ్ ఏది అంటే అందరూ అనుకునేది నీరవ్ మోడీ చేసిన రూ. 9 వేల కోట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ మన రాయపాటి వారిది దానికి మించింది. రూ. 9394 కోట్లు మేరకు మేత బయటపడింది..! ఆ వివరాలు, సీబీఐ నమోదు చేసిన కీలక అంశాలంతో “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక కథనం అందిస్తుంది..!!
ముందుగా ఏ బ్యాంకు నుండి ఎంత ఋణం తీసుకున్నారు..!? ఆ తర్వాత ఎలా తీసుకున్నారు..!? ఆ తర్వాత ఎప్పుడు టోపీ వేశారు..? ఎలా తప్పించుకున్నారు అనేది మొత్తం చూద్దాం..!
ఏ బ్యాంకుకి ఎంత టోపీ వేశారంటే..!!
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ద్వారా.. మొత్తం మీద రూ. 9394 కోట్లు రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగ్గొట్టారు. దీనిలో..
కెనరా బ్యాంకు – రూ. 1172 కోట్లు
బ్యాంకు ఆఫ్ బరోడా – రూ. 1275 కోట్లు
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా – రూ. 1190 కోట్లు
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా – రూ. 502 కోట్లు
కార్పొరేషన్ బ్యాంకు – రూ. 890 కోట్లు
ఆంధ్ర బ్యాంకు – రూ. 966 కోట్లు
అలహాబాద్ బ్యాంకు – రూ. 831 కోట్లు
బ్యాంకు ఆఫ్ ఇండియా – రూ. 692 కోట్లు
యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా – రూ. 214 కోట్లు
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర – రూ. 430 కోట్లు
సౌత్ ఇండియన్ బ్యాంకు – రూ. 395 కోట్లు
ఇతర చిన్న బ్యాంకులు కూడా ఉన్నాయి. మొత్తం 15 బ్యాంకుల నుండి రూ. 9394 కోట్లు తీసుకున్నారు. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే అధికం.
ఎవ్వరినీ వదల్లేదు..!!
ట్రాన్స్ ట్రాయ్ అనుబంధ కంపెనీల్లో పని చేసే డ్రైవర్లు, స్వీపర్లు, కార్యాలయ సిబ్బంది పేరిట కూడా కొన్ని బోగస్ కంపెనీలు సృష్టించి రుణాలు తీసుకున్నారు. ట్రాన్స్ ట్రాయ్ ద్వారానే ఇలా రుణాలు పొందిన కొన్ని బోగస్ కంపెనీలు చూస్తే..! పద్మావతి ఎంటర్ ప్రైజెస్, బాలాజీ ఎంటర్ ప్రైజెస్, రుత్విక్ అసోసియేట్స్, యూనిక్ ఇంజినీరింగ్, శుభకారి ఎంటర్ ప్రైజెస్, అగస్త్య ట్రేడింగ్, ఏఏస్ అసోసియేట్స్ అనే కంపెనీలు సృష్టించి వీటి ద్వారా రుణాలు తీసుకున్నారు.
ఐదేళ్లు మొద్దు నిద్ర..!!
ఇంతకూ ఈ బ్యాంకు స్కామ్ ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా..!? 2015 లోనే. ఎస్.., 2015 లోనే సదరు బ్యాంకులు ట్రాన్స్ ట్రాయ్ కి నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడం.., కేంద్రంలో కూడా కాస్త లాబీయింగులు ఉండడంతో బయటపడ్డారు. కానీ పాపం ఎన్నాళ్ళు ముసుగులో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బయటకు రావాల్సిందే కదా..! అందుకే వచ్చేసింది. సీబీఐ రంగంలోకి దిగింది. రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్, చెరుకూరి శ్రీధర్ సహా డైరెక్టర్లు అందరిపై కేసులు నమోదు చేసింది. ఉచ్చు బిగిస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో శోధన లోతుగా జరుగుతుంది. కొన్ని పత్రాలు పరిశీలనా ఇంకా కొనసాగుతుంది. దీనిలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సీబీఐ పసిగట్టింది. అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కామ్ గా చెప్పుకోవచ్చు. 2004 నుండి జరుగుతున్న ఈ బాగోతాల్లో కొందరు బ్యాంకు అధికారులు, ఈ కంపెనీల డైరెక్టర్లు, కొందరు రాజకీయ పెద్దలు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. వాటి వివరాలు, ఈ కేసుకి సంబంధించి తాజా అప్ డేట్స్ “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!!