ఏలూరులో వింత వ్యాధి భయపెడుతుంది. వందలాది మందిని ఆసుపత్రికి పంపిస్తుంది. ప్రభుత్వాన్ని, పెద్దలని వణికిస్తుంది..! కారణం స్పష్టంగా తెలియలేదు. ఏమిటా..? ఏమిటా..? అంటూ రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఏలూరుకు చెందిన ఓ పరిశోధకుడు… కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లోని IICT కి లేఖ రాశారు. దీన్ని వారు పూర్తిస్థాయిలో పరీక్షించి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ వివరాలను “న్యూస్ ఆర్బిట్” అందిస్తుంది.
ఇవే కారణాలు అంటూ ప్రచారం..!!
* ఏలూరులోని పట్టాన ప్రజలకు తాగునీటి సరఫరా చెరువు సమీపంలో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇటీవల వర్షాలు, తుపాన్లు నేపథ్యంలో ఈ పొలాల్లో పంటను కాపాడుకోవడం కోసం క్లోరో లేదా ఫోస్పెట్ కలిగిన మిశ్రమాన్ని వినియోగించారు. గాలి కారణంగా పొలాల నుండి ఈ రసాయనం చెరువులో పడడంతో నీరు కలుషితమయ్యాయి. ఆ నీరు సరఫరా చేసే క్రమంలో ముందుగా నీళ్లు అందే ప్రాంతాలైన దక్షిణపు వీధి, ఉత్తర వీధి, అశోక్ నగర్, అరుంధతీ పేట లో ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఈ నీరు మొదట్లో ఎక్కువగా రసాయన మిశ్రమాన్ని కలిగి ఉన్న కారణంగా…ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది అంటూ పేర్కొన్నారు.
* నీటిలో రసాయనాలు కలిస్తే ప్రాధమిక నీటి పరీక్షలో తెలియదు. నీటిలో క్లోరో – ఫోస్పెట్ మిశ్రమ పరీక్షకు మాత్రమే తెలుస్తాయి. హైదరాబాద్ లోని ఈ ల్యాబ్ లో సదరు పరీక్ష చేయగా.. ఇదే విషయం వెల్లడయింది అంటూ.. అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పూర్తిగా తెలుసుకునేందుకు సదరు బాధితులు చేసిన వాంతుల, రక్త నమూనాలను పరీక్షించనున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
చేపలు కూడా ఎలా కారణం అయ్యాయంటే..!?
ఏలూరులోని కొద్దీ ప్రాంతాలే కాకుండా… ఏలూరులోని మరో దూరపు ప్రాంతాలు, చుట్టుపక్కల పల్లెలు కూడా ఇదే రకమైన వ్యాధి లక్షణాలతో ఈరోజు, నిన్న ఆసుపత్రిలో చేరారు. దీనికి ఒక గమ్మత్తైన కారణాలు పేర్కొన్నారు. ఈ చెరువులో పెరుగుతున్న చేపలను శుక్రవారం మార్కెట్ లో అమ్మారు. వీటిని కొనుగోలు చేసి, వండుకుని తిన్న కుటుంబాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయనేది ఒక పరిశోధకుడి అనుమానం. దీన్ని సదరు శాస్త్రవేత్తలు, సంచాలకుడు ధృవీకరించాల్సి ఉంది.
నీటి శుద్ధి లోపం ఉంటే ఇదే..!!
ఏలూరులో నీటి శుద్ధిపై మొదటి నుండి అనుమానాలే. చెరువు, పైపుల నిర్వహణ సక్రమంగా ఉండదు. చాలినంత హాలం, క్లోరినేషన్ వేయకపోయినా.., అధికంగా వేసినా ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే క్రమంలో మొదటి నుండి అనుకుంటున్నట్టు నీటి కాలుషయమే కారణం అని తెలియడంతో ఇప్పుడు ఏలూరులో నీటి సరఫరా విభాగంపై పెద్ద మచ్చ పడినట్టే. చెరువు చుట్టూ వ్యవసాయ పొలాలు ఉండడం.., వరదల కారణంగా ఎక్కువగా రసాయనాలు వాడడం.., అవి నీటి ద్వారా మనుషుల్లోకి చేరడం.. ఇలా వందలాది మంది వ్యాధికి చిక్కడం ఏలూరుని కుదిపేసింది. ఒకరకంగా రాష్ట్రాన్నే భయపెట్టింది. అయితే ఈ నివేదిక ఎంత వరకు వాస్తవం..? అంశాలు ప్రభుత్వం ఆమోదిస్తుందా..? లేదా.. ఇంకేమైనా పరిశోధనలు జరిపిస్తారా..? అనేది చూడాల్సి ఉంది.