Restrictions: ఆంక్షలు Restrictions: తమిళనాడు రాష్ట్రంలో ఈ ఉదయం నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ధియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, రిక్రియేషన్ క్లబ్స్, హోటల్స్.. ఇలా అన్ని వ్యవస్థలనూ మూసేసింది. దీంతోపాటే కేంద్రం విధించని అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిబంధనలను విధించడం సంచలనం రేపుతోంది. ఈరోజు నుంచే తమిళనాడులోకి వెళ్లాలంటే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు ఈ-పాస్ తప్పనిసరిని చేసింది. ధర్మల్ స్క్రీనింగ్ కు అంగీకరించాలని కూడా షరతులు విధించింది. దీంతో తమిళనాడు-ఒడిశా సరిహద్దు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకీ కరోనా పరిస్థితులు తీవ్రమవుతున్న దశలో ఇదే తీరు మున్ముందూ కొనసాగితే పరిస్థితేంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఏపీ ఇటువంటి అంతర్రాష్ట్ర ఆంక్షలు విధించలేదు. కేంద్రం కూడా విధించలేదు. కానీ.. రాష్ట్రాలకు స్థానిక పరిస్థితులన బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. అదే.. ఇప్పుడు తమిళనాడులో లాక్ డౌన్ పరిస్థితులు కల్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూనే.. సరిహద్దుల్లో ఆంక్షలు విధించింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు.. శ్రీకాకుళం నుంచి ఒడిశాకు వివిధ అవసరాల నిమిత్తం వెళ్లే ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు మాత్రమే సరిహద్దు దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో విదేశాల నుంచి వచ్చే వారికి గ్రామాల్లోకి ప్రవేశం నిషేధం అంటూ ముళ్ల కంచెలు వేసిన పరిస్థితి ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.
గతంలోనూ.. ఇప్పుడూ దేశాల మధ్య విమానాల రాకపోకలకు నిషేధం ఉంది. ఇప్పటికే భారత్ కు ప్రయాణాలను అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, దుబాయి.. వంటి దేశాలు నిలిపివేశాయి. ఇప్పుడు భారత్ లోని రాష్ట్రాల మధ్యకే ఈ నిబంధనలు వచ్చేశాయి. ఓపక్క దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. రోజువారీ కేసులు 3.50 లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్యా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులు మొదలయ్యాయి. తీవ్రత ఇలానే ఉంటే జిల్లాలు, ఊళ్ల మధ్య కూడా రాకపోకలకు నిషేధం విధించినా ఆశ్చర్యం లేదు. దేశంలో ఇంతటి క్లిష్ట పరిస్థితులను ఊహించలేనప్పుడు అటువంటి సంఘటనలను జరగవనీ చెప్పలేం..!