Revanth Reddy: రేవంత్ రెడ్డి Revanth Reddy టీఆర్ఎస్ ఏం చేసినా ఓ పథకం ప్రకారమే చేస్తుందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనే రేవంత్ కౌంటర్ కు కారణమైంది. ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులే కాదు.. సినిమా రంగం నుంచి చిరంజీవి కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అనూహ్యంగా తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు వారి వరకూ వచ్చింది.. రేపు మన వరకూ కూడా రావొచ్చు. అవసరమైతే విశాఖ కూడా వస్తాం’ అన్నారు. ఈ ప్రకటనపై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.
‘తెలంగాణలోని సమస్యలపై ఢిల్లీలో పోరాడలేని వాళ్లు విశాఖ ఉక్కుపై ఏపీలో పోరాడాతారంట’ అని ఎద్దేవా చేశారు. ఇదొక కొత్త నాటకమని రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఏపీపై ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. విభజన హామీలపై పోరాటం, తెలంగాణకు రావాల్సిన వాటిపై ఢిల్లీలో పోరాడటం, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై పార్లమెంట్ లో పోరాడలేని వాళ్లు ఏపీ సమస్యలపై పోరాడుతారా? అని ఎద్దేవా చేశారు. మోదీ అంటే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. ఢిల్లీలో పోరాడటం మానేసి మానేసి మోదీని వేడుకుని వస్తున్నారంటూ విమర్శించారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడటం మానేసి రాజీ పడుతున్నట్టుంది..! అంటూ ఎద్దేవా చేశారు.
కేటీఆర్ చేసిన ప్రకటనలో.. ఈరోజు విశాఖ ఉక్కు వరకూ వస్తే రేపు తెలంగాణలో బీహెచ్ఈఎల్, సింగరేణి.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం వరకూ వస్తారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ విమర్శలకూ ఓ కారణముంది. కొన్నేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భీమవరం కోడి పందాలు.. టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి.. అనే వ్యాఖ్యలతో అక్కడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కోసమే విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ఇస్తామని అంటున్నారనేది రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మం. మరి.. ఎవరి వాదనలో నిజముందో..! లోగుట్టు పెరుమాళ్లకెరుక..!