Suddala Ashok Teja: సుద్దాల అశోక్ తేజ Suddala Ashok Teja సినిమాల విషయంలో కాపీ కంటెంట్ల గొడవ ఎప్పుడూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. కథ, డైలాగ్స్, టైటిల్, పాట, ట్యూన్.. ఇలా ఏదొక విభాగంలో కాపీ మరకలతో ఆయా సినిమాలకు, వ్యక్తుల ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘సారంగదరియా’ పాట వివాదం ఓ రేంజ్ లో నడుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని పాటను ఇటివలే విడుదల చేశారు. ఇది ఒక జానపద పాట. దీనికి రచయిత సుద్దాల అశోక్ తేజ కొత్తగా సాహిత్యం చేకూర్చారు. పాట విపరీతమైన హిట్ అయింది. అయితే.. ఆ వెంటనే వివాదమూ వచ్చింది.
ఈ పాట తనది అంటూ కోమలి అనే జానపద గాయని ముందుకొచ్చింది. తన అమ్మ దగ్గర నేర్చుకున్న పాట ఇది అని అంటోంది. విచిత్రమేంటంటే.. గతంలో మాటీవీలో వచ్చిన ‘రేలారేలారే’ అనే ఒక కార్యక్రమంలో కోమలి ఈ పాటను ఆలపించింది. ఆ షోకు జడ్జి కూడా సుద్దాల అశోక్ తేజ కావడం విశేషం. ఆ పాటను యధావిధిగా కాపీ కొట్టారనేది కోమలి వాదన. మంగ్లీకి బదులు తనతో పాడించినా తాను బాధ పడేదాన్ని కాదని అంటోంది కోమలి. వివాదం అయ్యాక తనను కలసి.. గతంలోనే కోమలిని ఈ విషయంలో కలిసామని మాట మారుస్తున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన దగ్గర జానపదాలు ఇంకా 200 వరకూ ఉన్నాయంటోంది.
తానూ తన తల్లి దగ్గరే ఈ పాట విన్నానంటున్నారు సుద్దాల. జానపద పాటలు ఏ ఒక్కరి సొత్తూ కాదన్నది ఆయన వాదన. మంచి కాఫీలాంటి సినిమాలను తెరకెక్కిస్తాడనే పేరున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం గమ్మునుండిపోయాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ లో ‘నేను సైతం..’ పాటకు ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. అక్కడ కూడా శ్రీశ్రీ రాసిన సాహిత్యంను కాపీ కొట్టారనే వాదన వచ్చింది. కొన్ని పదాలే తీసుకున్నారని జ్యూరీ పెద్దగా అడ్డు చెప్పలేదు. టాలీవుడ్ లో గొప్ప రచయితలలో ఒకరిగా.. వేల పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ ఇటువంటి వివాదంలో చిక్కుకోవడం విచారకరం.