భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా…. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. అయితే ఈ సమయంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న అన్ని ప్రణాళికలు మరియు కంటైన్మెంట్ కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు.
ఇకపోతే ఇప్పటిలో ఈ కరోనా వైరస్ మనల్ని వదిలి వెళ్ళదు అని స్పష్టం చేసిన ఆయన వచ్చే శీతాకాలంలో భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి విజృంభించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఇలా మరికొన్ని రోజులు మనం ఈ మహమ్మారి తో కలిసి జీవించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా జనాలు తిరగడం వల్ల కరోనా వ్యాప్తి జరుగుతోందని చెప్పిన ఆయన ఈ పోరాటంలో ప్రైవేటు రంగం కూడా తనవంతు పాత్ర పోషించారని పిలుపునిచ్చారు.
అలాగే దేశంలోని హాట్ స్పాట్ లలో ఉన్న కేసులు తగ్గించడం పై ప్రత్యేక దృష్టిసారించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ గులేరియా సూచించారు. దీనికి సంబంధించిన వ్యూహాలను ప్రత్యేక ప్రాంతాల్లో అమలు పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా ఈ ప్రాంతానికి తగ్గట్టు మన ఆలోచనా సరళి కూడా మారాలని. ఒకే ఆలోచనను అన్ని ప్రాంతాలలో అమలు చేయడం కుదరదు అని చెప్పిన ఆయన హాట్ స్పాట్ లపై ప్రత్యేక నిఘా ఉంచి దగ్గరుండి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ముఖ్యంగా దేశంలో రానున్న శీతాకాలం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించనుందని చెప్పిన ఆయన లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత కూడా శీతాకాలంలో ఉన్నట్లుండి కేసుల భారీగా పెరిగే అవకాశం ఉందని అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బెడ్స్ పారామెడికల్ సిబ్బంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేయాలన్నారు. ఇకపోతే ఇప్పటివరకు భారతదేశంలో ఇప్పటికే 46605 కేసులు నమోదు కాగా 12948 మంది కోలుకున్నారు. 1573 మంది మరణించారు. 32080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు