ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లో బిజెపి కి తలవంపులు తెస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే.. అది అత్యంత అధ్వానంగా మారిన భారత దేశ ఆర్థిక పరిస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో మోడీ-షా ద్వయం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మల సీతారామన్ స్థానంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను ఆర్థిక మంత్రి పదవి నుండి తప్పించి వేరే శాఖకు మారుస్తారా లేదా ఆమె మంత్రిగా వ్యవహరిస్తున్న పోర్టుఫోలియో లో మార్పు రానుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాలి….
ఇవే కారణాలు….
వాస్తవానికి ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలతో నిర్మలమ్మ కు ఇబ్బంది తప్పదు అంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కొరడా ఝళిపించిన ఆమె తరువాత ఏపీ కీలక నాయకులు స్వయంగా కలిసినప్పుడు మాత్రం శాంతంగా మాట్లాడారు. ఆమె ధోరణి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కూడా అలాగే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఆమె ఆశించినట్లుగా పనిచేస్తున్నప్పటికీ తగ్గ ఫలితాలు రాకపోవడం కార్పొరేట్, కొన్ని కీలక వర్గాల పై ప్రభావాన్ని చూపించలేకపోవడం మరొక కారణంగా చెబుతున్నారు.
మోదీ కి తప్పదాయె…!
మరోవైపు ప్రధానిగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మోదీ ఇంకా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచకపోవడానికి ఉన్న కారణాలు ఏమిటని ప్రశ్నలు వచ్చాయి. ఈ సమయంలో పెద్ద మార్పులు ప్రభుత్వంలో చేయకపోవడమే దానికి కారణం అని అందరూ విమర్శిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా నిర్మల సీతారామన్ ను పక్కన పెట్టి ఆమె స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రమంత్రి రాం విలాస్ పాస్వాన్ మరణం అనంతర/మ్ ఆయన మంత్రిత్వ శాఖలను పీయూష్ గోయల్ కి అప్పజెప్పడంతో పాటు రానున్న రోజుల్లో జరిగే కేంద్ర కేబినెట్ ను సిద్ధం చేయాలని ఆలోచనలో కూడా మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆమె స్థానంలో ఎవరు..? ఎప్పుడు?
సరే నిర్మలమ్మ కాకపోతే ఆ స్థానంలో ఎవరు…? అనే ప్రశ్నలకు కూడా జోరుగా సమాధానాలు వస్తున్నాయి. ఒకటి జ్యోతిరాదిత్య సింధియా లేదా సురేష్ ప్రభు లకు ఈ కీలక బాధ్యతలు అప్పగించేందుకు చూస్తున్నారట. అయితే ఏ మార్పు అయినా కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అని చెబుతున్నారు. వచ్చే నెల 10న బీహార్ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలి. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పులు ఉంటాయి అని అంటున్నారు. ఇక ఎన్నికల దృష్టిలో ఎవరూ ఊహించని కొత్త నాయకులు నిర్మల స్థానంలో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పశ్చిమబెంగాల్, కేరళ రెండు బిజెపికి అసలు కొరుకుడుపడని రాష్ట్రాలు. సో…. నిర్మలమ్మ కి మాత్రం రానున్న రోజులు గడ్డు పరిస్థితినే తెస్తాయి.