Smart tv: పారిస్ లో రోజుకో ఫ్యాషన్ మారినట్టు.. టెక్నాలజీ కూడా అలానే మారిపోతోంది. రేడియో, టీవీ, కంప్యూటర్, శాటిలైట్, మొబైల్.. ఇలా టెక్నాలజీ కేవలం రెండు దశాబ్దాల్లోనే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చేసింది. ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ తో ప్రపంచం మొత్తం ఇంట్లో ఉంటోంది. అదీ కేవలం రూ.399 ఖర్చుకే. క్రీడలు, వినోదం, సినిమా, వార్తలు, కామిక్స్, ఎడ్వంచర్.. ఇలా ఏదైనా కాలు బయటపెట్టకుండా.. ఇంట్లో టీవీల్లో ఉంటోంది. స్థాయిని బట్టి ప్లాన్ ఎంచుకుంటే.. మరింత ఎక్కువ వినోదం ఇంట్లోనే ఉంటోంది. జియో వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. మరి.. శాటిలైట్ చానెల్స్ పరిస్థితి ఏంటి..?
రెండు దశాబ్దాల్లోనే మార్పు..
25 ఏళ్ల క్రితం వరకూ కూడా.. సినిమా పాటలు చూడాలంటే వారానికో చిత్రలహరి, వార్తలు సాయంత్రం 7గంటలకు, రోజుకు రెండు సీరియల్స్ మాత్రమే. కానీ.. శాటిలైట్ విప్లవం మొదలయ్యాక గంటకో న్యూస్ బులెటిన్, రోజుకు రెండు సినిమాలు, ఎంటర్ టైన్మెంట్ వచ్చింది. ఆ తర్వాత భక్తి, స్పోర్ట్స్, వార్తలు, సినిమాలు, సీరియల్స్ కే ప్రత్యేక చానెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి..! ఇప్పుడు స్మార్ట్ విప్లవం వచ్చేసింది. గంటల నుంచి నిమిషాలు, సెకన్లలోకి టీవీల నుంచి అరచేతిలోని సెల్ ఫోన్లలోకి వచ్చేసింది ప్రపంచం. నిరంతరం వార్తలు, లైవ్ లు, సినిమాలు, గేమింగ్.. ఇలా ఏ వయసు వారికి కావల్సిన సమాచారం అంతా కూడా ఇప్పుడు ఫోన్ల లోనే.. స్మార్ట్ టీవీల్లోనే.. ఒక్క కనెక్షన్ తోనే.
ఇంట్లోనే స్మార్ట్ గా..
మరి.. శాటిలైట్ చానెల్స్ మనుగడ సాగిస్తాయా అంటే.. ప్రశ్నార్ధకమే. కొన్ని చానెల్స్ మినహా మిగిలనవన్నీ భారంగా నడుస్తున్నవే. వీటికి పార్టీలు, నేతల అండదండలు, కార్పొరేట్ ఫండ్స్ రూపంలో వెళ్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ మరింతగా విస్తృతమవడంతో న్యూస్ కోసం ఓ టైమ్, చానెల్సే చూడక్కరలేదు. ఖర్చు కూడా తక్కువ. ఒక గదిలో కూర్చుని న్యూస్ అప్డేట్ ఇచ్చేయొచ్చు. సినిమాలకూ ఓటీటీలు వచ్చేశాయి. ధియేటర్లో వందలు వేలు ఖర్చు లేకుండా ఇంట్లోనే కొత్తవి చూసేయొచ్చు. నార్మల్ టీవీని కూడా చిన్న డివైజ్ తో స్మార్ట్ టీవీగా మార్చేసుకోవచ్చు. కావల్సింది నెట్ కనెక్షన్. స్మార్ట్ గా టెక్నాలజీ ఇంత పెరిగిపోయాక రేడియో ప్రాభవం తగ్గిపోయినట్టు త్వరలోనే శాటిలైట్ చానెల్స్ హవా కూడా మాయమైపోతుందేమో..!