మధ్యప్రదేశ్ ఫార్ములా రాజస్థాన్ ఏడారిలో అమలు చేసేందుకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సిద్ధమైపోయాయ్… నాడు కమల్ నాథ్ ను లాగిచ్చి కొట్టిన కమలదళం ఇప్పుడు అశోక్ను శోకంలో ముంచేందుకు రంగం సిద్ధం చేసేసింది.ఎవరి పేరు చెబితే దిమ్మదిరిగి మైండ్ బ్యాంక్ అవుతుందో వాడే సచిన్ పైలెట్ అన్నట్టుగా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సునామీ ముందు ప్రశాంతతలా మారిపోయింది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టవుతోంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్న చందంగా మారుతోంది. చెప్పేవాడికి వినేవాడు లోకవంటారు.. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతం ఆ పార్టీని నట్టేట ముంచుతోంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా… లేవా అన్న విషయం పక్కనబెడితే సరైన వ్యూహాలు లేకుండా ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలకు మొన్న మధ్య ప్రదేశ్ సర్కారును మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు రాజస్థాన్ ను సైతం హారతిలా ఇవ్వాల్సివస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను వంచించిందని… అవమాన భారంతో ఎలా పార్టీలో కొనసాగాలంటూ కొత్త థియరీని విన్పిస్తున్నారు సచిన్ పైలెట్. తనకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాధిత్య సింథియా నుంచి అందుకున్న ఫోన్ కాల్ ప్రకారం అడుగులు వేయడం మొదలుపెట్టాడు ఈ పైలెట్.
రాజస్థాన్ వ్యవహారం ఏ తీరానికి చేరుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చేస్తోంది. సచిన్ పైలెట్ ను బీజేపీ పంచన చేరుకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ శతథా ప్రయత్నిస్తోంది. ఎట్టి స్థితిలో కాంగ్రెస్లో కొనసాగేలా అడుగులు మొదలుపెట్టింది. తొలుత సచిన్ పైలెట్ వ్యవహారాన్ని లైట్ గా తీసుకున్న పార్టీకి ఇప్పుడు దిమ్మతిరిగే కౌంటర్ ఆఫర్లను సిద్ధం చేశాడు పైలెట్. ప్రస్తుతమున్న పీసీసీ చీఫ్ తన వద్దే ఉంచాలని, ఆర్థిక శాఖ, హోం శాఖ తనకు అప్పగించడంపాటు నాలుగు కీలక శాఖలను తన మనుషులకే ఇవ్వాలంటూ కండిషన్లు పెట్టాడు. అంటే మొత్తంగా పాలన తన కనుసన్నల్లో జరగాలనే సందేశాన్నిచ్చాడు. అవును పైలెట్ ఆఫర్ ఓ రేంజ్ లో ఉంది. దీనికి బీజేపీ అధినాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే పైలెట్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కానీ ఆయన తనువంతా బీజేపీలోనే తిరుగుతుంది.
తన సోదరుడు లాంటి సోదరుడు జ్యోతిరాధిత్య సింధియా సూచనలు, సలహాలు ఇవన్నీ బాగా వంటబట్టించుకున్న సచిన్ పైలెట్… క్రికెట్లో సచిన్ సిక్సర్ కొట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీని బాదేస్తాడనడంలో ఎలాంటి సందేహా లేదు. ఇప్పుడు కుదిరితే ఇప్పుడే…లేదంటే కొంచెం వెయిట్ చేసి. చివరి నిమిషం వరకు పైలెట్ తో సఖ్యత కోసం కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తూనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్ పాఠాలతో తలబొప్పికట్టింది. ఇప్పుడు రాజస్థాన్ వంతు వచ్చింది. గతంలో కర్నాటకలో బీజేపీకి పీఠం దక్కకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన హస్తం పెద్దలు… చివరకు కర్నాటకలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న సర్కారును కాపాడుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీని బతికించుకోవడం అధినాయకత్వానికి అతిపెద్ద పరీక్షలా మారుతోంది.
సచిన్ పైలెట్ తో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆ సంఖ్య డబుల్ చేయగల సత్తా బీజేపీకి ఉంది. ఇప్పటికే 10కి పైగా స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీ సర్కారుకు రక్షణగా నిలిచారు. అయితే వారందరూ ఎప్పుడు ప్లేటు ఫిరాయిస్తారో అర్థం కాని పరిస్థితి. బీజేపీకి మద్దతిస్తే రూ. 15 కోట్లిస్తామంటూ తమతో కాషాయం పార్టీ నేతలు బేరసారాలు జరుపుతున్నారంటూ కొందరు ఇండిపెండెంట్లు కుండబద్ధలుకొట్టారు. ఆ నోటితోనే… బీజేపీలోకి వారు వెళ్లరన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు.
సచిన్ పైలెట్ సైతం తనకు మద్దతుగా నిలిచే 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది. గత మార్చిలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన సింధియా రాజకీయాన్ని ఇప్పుడు కమలం పార్టీ రాజస్థాన్ లో ఆడబోతోంది. కమలం నాథ్ ఏ విధంగా పదవి కోల్పోయాడే ఇప్పుడు గోహ్లాట్ పరిస్థితి కూడా అలాగే మారబోతుంది. మధ్యప్రదేశ్ లో ఎలాంటి వ్యూహాన్నైతే రాజస్థాన్లో పారితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జింతాకా… చితా చితానే.