Chinna Jeeyar: ‘ఆధ్యాత్మికం..’ అనే భావనే భారతీయులను ముందుకు నడిపిస్తూంటుంది. సమాజం అంతా ఒకటే.. మనుషులంతా సమానమే అని వెయ్యేళ్ల క్రితమే సుదూర భవిష్యత్ మార్గానికి బాటలు వేసిన సమతామూర్తి రామానుజాచార్యులు. అధ్యాత్మిక భావాన్ని పెంచడంలో తానే దైవంగా.. గురువుగా.. ఓ తపస్సే చేశారు. మరి.. అటువంటి మహనీయుడు చరిత్రలో కాకుండా.. భువిపై శాస్వతంగా నిలిచి భవిష్యత్ తరాలకు శాసనం కావాలంటే.. ఎవరో ఒకరు ఇందుకు ముందడుగు వేయాలి. అటువంటి సంకల్పానికి ఉద్యుక్తులయ్యారు చినజియర్ స్వామి. దాదాపు పదేళ్ల క్రితం తన మదిలో రూపుదిద్దుకున్న ఒక ఆలోచనను సాక్షాత్కరించి తాను కూడా పునీతులయ్యారు. రామానుజుని ఈ భువిపై సజీవంగా మరోసారి ఆవిష్కరించారు. భాగ్యనగరంలో 108 అడుగుల మహారూపంలో.. దేదీప్యమానమై కాంతులీనుతున్నారు. ఇప్పుడు మన హైదరాబాదు ఆధ్యాత్మికతకు కూడా చిహ్నంగా మారడం తెలుగువారికి గర్వకారణం.
ఆయన వల్లే సాధ్యం..
ఇంతటి మహక్రతువు సామాన్యులకు సాధ్యమా..? అంటే.. చినజీయరు స్వామి వారికి మాత్రమే సాధ్యం అని ప్రతి గొంతు పలుకుతుంది. తానే ఒక సైన్యమై.. మహాశక్తి స్వరూపమై.. దైవత్వానికి ప్రతిరూపంలా నిలిచి ఈ మహత్కార్యాన్ని సాధ్యం చేసారు. సంకల్పసిద్ధి ముందు ఎన్ని వ్యయప్రయాసలు.. మరెన్ని వికల్పాలు ఎదురైనా మహానుభావులకు అవి నీటి తుంపరలే అవుతాయని నిరూపించారు. అవిశ్రాంత యోధుడై ఈ మహాక్రతువును పూర్తి చేసి చినజియరు స్వామి సాధించిన విజయం కలియుగంలో జరిగిన ఆధ్యాత్మిక పట్టాభిషేకం అనాల్సిందే. పంచలోహాలతో మూర్తీభవించిన ఆ నిండైన విగ్రహం రామానుజుల ప్రత్యక్ష సాక్షాత్కారం అనాల్సిందే. జీవం ఉట్టిపడతున్న ఆ విగ్రహంలో.. కరుణ చూపించే కళ్ళు.. ఆశీస్సులు అందించే అభయహస్తం.. రామానుజ విగ్రహం సమస్తంలో జీవమే.
భవిష్యత్ తరాల కోసం..
కల్మషమైపోయిన నేటి మానవాళి మనస్సును జీనోద్దరణకు రామానుజాచార్యులు మరోసారి కార్యోన్ముఖుడయ్యారా.. అంటే కాదని చెప్పగలమా..! ఎన్ని యాగాలు.. క్రతువులు చేస్తే ఇంతటి పుణ్యకార్యం చేయగలరు ఎవరైనా..? సాక్షాత్తూ చినజియర్ స్వామి మాత్రమే ఈ మహాద్భుతానికి చిరునామా అయ్యారు. 108 ఆలయాలు.. ఆధ్యాత్మిక నిలయాలను సువిశాల స్థలంలో నిర్మించి భక్తి నదిని పారించడం ఆయనకే సాధ్యం. చినజీయర్ స్వామి తానే శిల్పిగా.. వజ్రసంకల్పితుడై.. తన హృదయంలో మనో బలంతో ఆవిష్కరించిన అద్భుతం ఈ రామానుజాచార్యుల సాక్షాత్కారం. జగద్గురువుకు గుడి కట్టిన శ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి సామాన్యులం ఏం చేయగలం.. ప్రణామాలు అర్పించడం తప్ప..!