కరోనానా…!! అది మనతోనే ఉంటుంది. సహజీవనం చేస్తుంది. ఇట్ కమ్స్ అండ్ గోస్… జీవితం పోతే ఎలా…? రోజులు పోతే ఎలా..? రోజులో ముక్క పోతే ఎలా..? చుక్క లేకుంటే ఎలా…??
“అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది…!” అదే అదృష్టం తోడుండే “ఐశ్వర్య రాయ్ రెండో పెళ్లి నన్నే చేసుకునుంది” అటువంటిది కరోనా రావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది. అయినా అడిగేవాళ్ళు అమాయకులు కాకపోతే…! కరోనా భయం ఏమిటండీ..?
కరోనానా…. అదెక్కడ? అదేం లేదే…! అయినా మేము చికెన్, మటన్ తిని కండలు పెంచేస్తుంటే కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది…! ప్రభుత్వాలకు బుద్ధి లేదు. లాక్ డౌన్ అన్నాయి! మాకేమైనా బుద్ధి లేదనుకున్నారా ఏంటి? మేము భలే బుద్ధిమంతులం. ఆదివారం వస్తే ముక్క, చుక్క లోనికి వెళ్లాల్సిందే. అవి అందకపోతే ఎలా? కరోనాకి మాత్రం ఆదివారం సెలవులు ఉండవా ఏంటి? అది వారం సెలవు తీసుకుంది, అందుకే మేము ఇలా రోడ్డుపైకి తెగబడ్డాం….! మాస్కులూ లేవు, సామజిక దూరమూ లేదు. మాకున్నది అంటా సామజిక బాధ్యత, ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వాలనే సామజిక బాధ్యత..!!
మొన్నెప్పుడో మద్యం దుకాణాలు వద్దు మొర్రో అంటూ మహిళలు గోల చేసారు. రెండు రోజులు ఆపేసారు. మళ్ళీ మొదలెట్టారు. కరోనా సోకానీ, కాపురాలీ కూలిపోనీ మద్యం ఆగదు. అందుకే జనంలో కూడా “పందండి ముందుకు.. పందండి తోసుకు.. పోదాంపోదాం పైపైకీ..” అంటూ ఎగబడ్డారు.. ఇంటికే పరిమితం కావాల్సిన డేంజర్ సమయంలో వీళ్లంతా ఎగబడింది చికెన్, మటన్ కొనుక్కునేందుకు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అవకాశం దొరకదేమో అన్నంత ఆతృత ప్రదర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకం.. ఆదివారం తెల్లారీ తెల్లారకముందే పోలోమంటూ బజార్నపడ్డారు. కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.
ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే జనం బాధ్యత లేకుండా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది. జనం యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా తమపై వస్తున్న విమర్శలు, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 1970 దశకం చివర్లో స్కైలాబ్ పడుతుందని, ఇక ఇవే ఆఖరి రోజులని భావించిన జనం కోళ్ళూ, మేకలు, గొర్రెలు.. ఇలా కనిపించిన దాన్నల్లా కోసుకుతినేశారు. విజ్ఞానం పెరిగిన ఈరోజుల్లోనూ జనం నాలుకకు రుచికరమైన తిండికోసం.., పూత పూటకి చుక్కకోసం ఇలా వెంపర్లాడటం పట్ల మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్. దీనికి మందులు లేవు. ఇళ్లలోనే వుంటూ సామాజిక దూరం పాఠించటం ఒక్కటే ముందున్న ప్రత్యామ్నాయం. ఓ మనిషీ, నీకర్థమౌతోందా…!