Tamilnadu elections : తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నో చిత్ర విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ నుండి బహిష్కరింపబడిన నేత శశికళ అలియాస్ చిన్నమ్మ రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చిన శశికళను ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ శశికళ కనుక తమ పార్టీలోకి మళ్లీ రావాలను అనుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపాడు. ఒక్కసారిగా పన్నీర్ ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత తమిళనాడులో ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది.
మనం చూసుకున్నట్లయితే… సీఎం, పార్టీ అధినేత పళని స్వామి తో పాటు ఇదే పన్నీర్ సెల్వం చిన్నమ్మను మరలా పార్టీ లోకి రాకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. శశికళ జైలు నుండి విడుదలైన తర్వాత ఆమే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకున్నారు. దీనిపై కూడా వారు విపరీతంగా మండిపడ్డారు. చిన్నమ్మకు స్థానం లేదంటూ అది ముగిసిన అధ్యాయం అంటూ సంయుక్త ప్రకటన చేశారు.
ఇక అప్పుడు శశికళ ఎలాంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నా… అన్నాడిఎంకె చీలిపోయి… ఇది ప్రతిపక్ష డీఎంకె పార్టీకి బాగా ఉపకరిస్తుంది అని పార్టీ వర్గాల్లో టెన్షన్ కూడా మొదలైంది. ఇక అన్నాడిఎంకె మిత్రపక్షమైన బిజెపి చొరవతో శశికళ రాజకీయాల నుండి తప్పుకుంతున్నట్లు ప్రకటన చేసి ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
అయితే అన్నాడీఎంకే లో ఎటువంటి విభేదాలు అంతర్గత వివాదాలు వచ్చినా తర్వాత తమకు లాభిస్తుందని డీఎంకే హ్యాపీగా ఫీల్ అయితే ఇప్పుడు మళ్లీ చిన్నమ్మని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉపముఖ్యమంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అప్పుడు పన్నీర్ సెల్వం ఆగ్రహించినట్లు గా పార్టీలో మరెవరు ఆమెపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు అతనే ఉన్నట్టుండి పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారో అందరూ అర్థం కావట్లేదు. ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం జరుగుతుందా…? వెనుక బిజెపి హస్తం ఏదైనా ఉందా? లేదా శశికళ తెర వెనుక రాజకీయాలు నడిపారా అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.