YSRCP – TDP రాజు ఓడిన తర్వాత సైన్యం ఆటోమేటిక్ గా బలహీనమైపోతుంది..! యుద్ధంలో సూత్రం ఇది..!!
అధినేత నైతికంగా ఓడితే.. శ్రేణులు ఆటోమేటిక్ గా చల్లబడతాయి..! రాజకీయాల్లో వైనం ఇది..!! సీఎం న్యాయపరంగా ఓడితే.. యంత్రాంగం ఆటోమేటిక్ గా మెత్తబడింది..! పాలనలో పటిస్థితి ఇది..!! రాజు అయినా.. అధినేత అయినా.. సీఎం అయినా ఇక్కడ వైఎస్ జగన్ మాత్రమే. నైతికంగా.., న్యాయపరంగా ఓడింది ఆయనే. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోయి, శ్రేణులు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయా..!? నిమ్మగడ్డపై జగన్ ఓటమిని వైసీపీ శ్రేణులు జీర్ణించుకుంటున్నాయా..!? స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆత్మస్థైర్యం ఎలా ఉంది. క్షేత్ర పోరులో టీడీపీకి వైసిపికి ఉన్న ప్రధాన బలం, తేడా ఏమిటో ఈ కథనంలో లోతుగా చూద్దాం..!!
YSRCP వైసీపీ వాళ్ళు బాగా నమ్మకంగా ఉన్నారు..!!
“మా సీఎం జగన్ అనుకున్నది చేసి తీరుతారు. జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత వరకైనా వెళ్తారు” ఇదీ వైసీపీ శ్రేణుల్లో ఉన్న గట్టి నమ్మకం. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిమ్మగడ్డ విషయంలో జగన్ వెనకడుగు వేయక తప్పలేదు. ఒక లాజిక్ లెస్.., ఒక పాయింట్ లెస్ వాదనతో స్థానిక ఎన్నికల వాయిదాకి ప్రయత్నం చేసినప్పటికీ అవ్వలేదు. కోర్టుల అనుమాధి, ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరుకున్నట్టే పంచాయతీ ఎన్నికలు జరిగిపోతున్నాయి. కానీ దీనికి వైసీపీ వాళ్ళు సిద్ధంగా లేరు అన్నది వాస్తవం. ఇన్నాళ్లు “స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయిలే, మాకేం అవసరం లేదు. మేము ఎలా అయినా ఉండవచ్చు” అనుకుంటూ క్రమశిక్షణ తప్పారు. చాలా నియోజకవర్గాల్లో శ్రేణులు, నాయకులు ఓటర్లకు దూరమయ్యారు. ఓ వైపు జగన్ అనేక సంక్షేమ పథకాలు, కొత్త కార్యక్రమాల ద్వారా పేదల్లో దూగు కట్టుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం అక్కడక్కడా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి ఇప్పుడు మానసికంగా సిద్ధమవ్వడం కష్టంగానే ఉంది. తప్పని స్థితిలో.., జగన్ బొమ్మని, సంక్షేమ పథకాలను నమ్ముకుంటూ “టార్గెట్ 90 శాతం విజయం” అంటూ వెళ్తున్నారు.
టీడీపీకి కొండంత బలం..!!
తెలుగు దేశం పార్టీ మాత్రం ఇప్పుడు అనూహ్యంగా కొండంత బలం పోగేసుకుంది. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిగి ఉంటె టీడీపీ ఇంత జోష్ గా ఉండేది కాదు. కానీ నిమ్మగడ్డ పట్టింది పట్టుగా., జగన్ పై కోర్టుల్లో విజయం ద్వారా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది టీడీపీకి బాగా కలిసి వచ్చిన అంశమే. నిమ్మగడ్డ జగన్ కి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉండడం.., వైసీపీ విధానాలు నిమ్మగడ్డకి వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఎన్నికల కమీషనర్ మద్దతు మాత్రం పరోక్షంగా టీడీపీకి ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల కమీషనర్ హోదాలో ఒక పార్టీకి ఆయన మద్దతుగా ఉంటారు అనుకోవడం రాజ్యాంగ విరుద్ధం అనుకున్నా… ఆయనకు, సీఎం జగన్ కి వ్యక్తిగత వైరం ఉంది కాబట్టి… గడిచిన ఏడాదిలో జరిగిన పరిణామాలు చూస్తే నూటికి నూరు పాళ్ళు వైసీపీ పై నిమ్మగడ్డ బృందం నిఘా గట్టిగా ఉంటుంది అనే నమ్మకంలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఇది తమకు కలిసి వస్తున్నది భావిస్తున్నారు.
ఏకగ్రీవాలకు తక్కువ అవకాశాలు..!!
టీడీపీలో జోష్ లేకపోతే పల్లె ఎన్నికల్లో పెద్దగా ఉత్సాహం ఉండదు. అధికార పార్టీ హవా ఉంటుంది. ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉండడం.., టీడీపీ కూడా యాక్టీవ్ అవ్వడంతో ఏకగ్రీవాలు తగ్గే అవకాశం ఉంది. గత ఏడాదిలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటె సుమారుగా 35 నుండి 40 శాతం పల్లెలు ఏకగ్రీవం అయి ఉండేవి. అప్పట్లో టీడీపీ ఉన్న పరిస్థితి వేరు. వైసిపిలో జోష్ వేరు..! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏకగ్రీవాలు కూడ 15 నుండి 20 శాతం పల్లెలు కంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. సాధారణంగా పల్లెల్లోనే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా., పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతున్నప్పటికీ.., పల్లెల్లో మాత్రం పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు రంగంలోకి దిగుతుంటారు. సో.., ఇప్పుడు ఏకగ్రీవాలు తగ్గి.., చాలా చోట్ల తీవ్రమైన పోరు జరగనున్నట్టు చెప్పుకోవచ్చు..!!