TDP : జ్యోతుల నెహ్రు నిన్న టీడీపీకి ఒక షాక్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. “పరిషత్ ఎన్నికల పోటీని బహిష్కరిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంతో మనస్తాపానికి గురై ఈ రాజీనామా చేస్తున్నట్టు జ్యోతుల ప్రకటించారు”..! ఉన్నదీ ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇది కేవలం సాకు మాత్రమే. సమయం, సందర్భం చూసుకుని పార్టీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు వేసిన డ్రామా మాత్రమే. పార్టీ భవితపై ఆశలు లేక, పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక టీడీపీలో జ్యోతుల లాంటి వాళ్ళు ఎందరో సమయం, సందర్భం చూసుకుని సాకులు చూపి తప్పుకునే ప్రయత్నాల్లో, ఆలోచనల్లో ఉన్నారు. పార్టీ నుండి బయటకు వచ్చినా.. రాకపోయినా సమయం చూసుకుని.. తమలోని అంటారా అసంతృప్తిని మాత్రం పార్టీ పెద్దలకు చాటి చెప్పడానికి కొందరు నేతలు వెనుకాడే అవకాశం లేదు.
TDP : జగన్ దూకుడు – టీడీపీలో బెనుకుడు..!!
సీఎం జగన్ దూకుడుగా వెళ్తున్నారు. మంచో, చెడో అనేది పక్కన పెట్టి రాజకీయంగా తన పూర్తి ఆధిపత్యంతో వెళ్తున్నారు. ఏ ఎన్నికలు జరుగుతున్నా పూర్తి ఏకపక్షంగా, తన ఆలోచనల మేరకు డీల్ చేస్తున్నారు. తన పార్టీ నాయకత్వానికి కూడా పూర్తిగా స్వేచ్ఛనివ్వక… తాను నమ్మిన వారిని మాత్రమే కీలక బాధ్యతలు ఇస్తూ ఇటు తన పార్టీని, నేతలను గుప్పిట్లో పెట్టుకుంటూనే… అటు ప్రత్యర్థి పార్టీని కూడా శాసిస్తున్నారు/ వణికిస్తున్నారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి నేతని ఎదుర్కోలేదు. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటుంది అని టీడీపీ ఏనాడూ ఊహించలేదు. సో.. ఆ పార్టీ ఇప్పుడు ఆత్మ రక్షణ.. ఆత్మ న్యూనత, అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోంది. జగన్ దూకుడుని, అధికార పార్టీ ఆధిపథాన్ని ఎదుర్కొనే అస్త్రాలు లేక విలవిలలాడుతోంది. అందుకే పార్టీలో జిల్లాస్థాయి/ నియోజకవర్గ స్థాయి నేతలకు పార్టీపై నమ్మకం సడలుతుంది. నాయకత్వంపై ఆశలు పోతున్నాయి. అందుకే జ్యోతుల లాంటి నేతలు సాకులు చూసుకుని.. తప్పుకుంటున్నారు.
జాబితా పెద్దదే.. ఏ రోజైనా బయటకు..!!
జ్యోతుల నెహ్రు పార్టీని వీడలేదు. పార్టీ బాధ్యతలు నుండి మాత్రమే తప్పుకుంటానని ప్రకటించారు. అంటే ఒక ట్రైలర్ విడుదల చేశారు. సినిమా విడుదల పెద్ద కష్టమేమి కాదు. ఇక ఈయన బాటలోనే అనేక మంది నేతలు ఉన్నారు. నివురు గప్పిన నిప్పులా టీడీపీలో ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కళా వెంకట్రావు నుండి చిత్తూరు జిల్లా గల్లా అరుణ కుమారి వరకు కీలక నేతలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. అశోక్ గజపతి రాజు, సుజయకృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు, వరుపుల రాజా, పులవర్తి రామాంజనేయులు, బోండా ఉమా, ఏలూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, అఖిల ప్రియా, జేసీ దివాకర్ రెడ్డి సోదరులు… ఇలా జిల్లాల వారీగా కీలక నేతలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. బయటకు అంతా బాగుంది అనుకుంటున్నా… లోలోపల మాత్రం పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం తీరుపట్ల అసంతృప్తితో పాటూ… పార్టీ ఫ్యూచర్ పై భయంతోనూ ఉన్నారు. వీళ్ళు పార్టీని వీడే ఆలోచనలో లేనప్పటికీ… ఏ క్షణమైనా వీడడానికి మాత్రం వెనుకాడరు.