* ఏమైంది “బాబూ”..? ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయొచ్చుగా..!?
* 45 ఏళ్లలో బాబుకి మొదటి సారి చుక్కలు
ఏంటీ.., బాబుకి ఏమైంది..? అసెంబ్లీలో పోడియం వద్ద కోర్చోడాలు ఏంటి..? సభలో స్పీకర్ పై అరవడాలు ఏంటి..? సభ బయట ఆ నినాదాలు ఏంటి..? 45 ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకి ఏమైనట్టు..? ఎన్నడూ లేని విధంగా ఈ ఆక్రోశాలు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలు ఎందుకలా ఉట్టి పడుతున్నాయి. వీటన్నిటికీ వెనుక ఫ్రెస్ట్రేషన్ ఉన్నట్టా లేనట్టా..??
మొదటి సారి పోడియం వద్దకు..!!
చంద్రబాబు 45 ఏళ్ళ రాజకీయ అనుభవం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కాలం పక్కన పెట్టేస్తే పుష్కర కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలో ఏనాడూ హుందాతనం, లౌక్యం కోల్పోలేదు. లోపల ఫ్రెస్ట్రేషన్, కసి, క్రోధం ఉన్నా.., పైకి మాత్రం కబుర్లు చెప్తూ వచ్చే వారు. రాజ్యాంగేతర వ్యవహారాలు చేయలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సభ సాక్షిగానే చంద్రబాబుని వెకిలిగా నవ్వుతూ.., సభలోనే నవ్వులపాలు చేసేవారు. చమత్కారంతో నవ్వుతూనే బాబుని ఆదుకునే వారు. దానికి బాబు కూడా నవ్వుతూనే సమాధానం ఇచ్చేవారు. అలా గడిచిపోయేది. కానీ.. ఇప్పుడిప్పుడే బాబులో మార్పులు వస్తున్నాయి. జగన్ మాటలు బాబు తట్టుకోలేకపోతున్నారు. ఒకరకంగా జగన్ ని ఒక సీఎం గా బాబు చూడలేకపోతున్నారు. అందుకే ప్రవర్తనలో మార్పు వస్తుంది. లౌక్యం పోతుంది. ఆవేశం పెరుగుతుంది. మాట అదుపు తప్పుతుంది.
ప్రతిపక్ష నేతగా ఈజీ కాదు..!!
ఇన్నాళ్ల రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయం వేరు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సిఎంలుగా పని చేసారు. ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నారు. నాడు చంద్రబాబు ఓటమి సాధారణ స్థితిలో ఉంది. కానీ 2019 లో జగన్ చేతిలో ఓటమి మాత్రం టీడీపీకి, బాబు అసాధారణ స్థితిలో జరిగింది. ఊహించకుండా అయింది. జగన్ గాలిలో టీడీపీ, 45 ఏళ్ళ చంద్రబాబు కొట్టుకుపోయారు. నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న టీడీపీ పునాదులు జగన్ దెబ్బతో కూలిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే బాబులో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. సభలోనే పళ్ళు నిమురుతూ.., కళ్ళు ఎగరేస్తూ.., రకరకాల హావభావాలు పాలిస్తున్నారు. చంద్రబాబులో ఇన్నాళ్లు చూడని కొత్త నేత ఈ ఏడాదిన్నరగా కనిపిస్తున్నారు. పైకి ఆవేదనని చూపిస్తూ.., లోపల ఆవేశాన్ని, ఈర్ష్యని దాచుకుంటూ నెట్టుకొస్తున్నారు. అవి అప్పుడప్పుడూ బయటకు వస్తూ ఇలా బయట పడుతున్నాయి.
ఎమ్మెల్యేలు మాట వినడం లేదట..!!
ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల మాట కూడా వినడం లేదు. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదు. జగన్ సీఎం అయితే టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో టీడీపీ ఎమ్మెల్యేలు ఊహించే ఉంటారు. కానీ ఇంతలా ఇబ్బందులు పడతామని ఊహించలేదు. అందుకే ఒక్కొక్కరూ బ్యాగులు సర్దుకుంటున్నారు. కొందరు సైలెంట్ అవుతున్నారు. ఉన్న కొద్దీ మంది కూడా బాబుకి సర్ది చెప్తున్నారు. “సర్… జగన్ రాజకీయం వేరు. మనం కాస్త తగ్గి ఉందాం. సభకి వెళ్ళవద్దు. ఈ అవమానాలు మీకు అవసరమా..? గతంలో వాళ్ళు కూడా సభకి రాలేదు. ఇప్పుడు మనం సభకి వెళ్లకుండా జనంలోనే ఉందాం” అంటూ అంతర్గత చర్చల్లో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు బాబుకి సలహాలు ఇచ్చారట. కానీ బాబు ససేమిరా అన్నారు. ఆ ప్రతిఫలమే ఇలా ఉంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో “బాబుకి ఇలా కావాల్సిందే” అనుకుంటున్నారట..!!