మూడు రాజధానుల బిల్లుల ఆమోదానికి నిరసనగా…టీడీపీలో చర్చ..ఉత్తరాంధ్ర..సీమ నేతలు కలిసొచ్చేనా?
ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద మద్ర వేసారు. ఈ నిర్ణయం పైన టీడీపీ మండిపడుతోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అయ్యారు. అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక, పార్టీ ఎమ్మెల్యేలు ఇందులో కేంద్రం జోక్యం ఉందని..బీజేపీ..వైసీపీ కలిసే వ్యవహారం నడిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే, తాను ప్రారంభంచిన అమరావతి కేవలం శాసన రాజధానిగా మిగిలిపోవటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో..ఆయన ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి దగ్గర కాగా..మిగిలిన 20 మంది తనతో సహా అందరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పైన అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నేరుగా గవర్నర్ ను కలిసి నిరసన వ్యక్తం చేసి..రాజీనామా లేఖలు అందించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంతటి నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేస్తారా.. చేసినా..ఉత్తరాంధ్ర..సీమ ప్రాంత టీడీపీ నేతలు సహకరిస్తారా…ఈ నిర్ణయంతో ఆ రెండు ప్రాంతాల్లో టీడీపీకి రాజకీయంగా నష్టం కలగదా..అసలు టీడీపీలో ఏం జరుగుతోంది…
నిరసనగా సామూహిక రాజీనామాల యోచన…!
తొలి నుండి మూడు రాజధానుల ఆలోచనలను టీడీపీ వ్యతిరేకిస్తోంది. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని..దీని పైన జ్యూడిషియల్ విచారణ చేయించుకోవాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఒక ప్రాంతం..ఒక వర్గం మీద కోపంతో అమరావతిని చంపేయవద్దంటూ ఫైర్ అయ్యారు. గవర్నర్ బిల్లుల ఆమోదించిన తీరును ఆయన ప్రశ్నించారు. గవర్నర్ నిర్ణయం పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేసారు. మూడు రాజధానుల వ్యవహారంలో ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేసారు. కనీసం రిఫరెండం పెట్టాలని సూచించారు. ఇక, ఇదే సమయంలో అమరావతి జేఏసీ నిర్ణయాల మేరకు వారితో కలిసి ప్రజా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. అమరావతి జేఏసీ నేతలు సైతం తాము న్యాయ పోరాటానికి వెళ్తామని స్పస్టం చేసారు. ఇక, ఇప్పుడు గవర్నర్ నిర్ణయం పైన తమ నిరసనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. టీడీపీ నుండి తనతో పాటుగా ఎమ్మెల్యేలుగా ఉన్న 20 మంది ఎమ్మెల్యే పదవులకు సామూహికంగా రాజీనామాలు చేసి..నేరుగా గవర్నర్ ను కలిసి నిరసన వ్యక్తం చేసి ఆయనకే అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని ద్వారా ఎదురయ్యే లాభ నష్టాలపైనా బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ..ఆ రాజీనామాలకు ఆమోదం లభించి ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నామా లేదా..రాజకీయంగా మరింత నష్టపోతామా అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
సీమ..ఉత్తరాంధ్ర నేతలు కలిసి వస్తారా…
టీడీపీలో జరుగుతున్న చర్చ ఆచరణలోకి వస్తే చంద్రబాబు ఆలోచనలతో టీడీపీ ఉత్తరాంధ్ర..రాయలసీమ నేతలు కలిసి వస్తారా అనే అనుమానం పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ముగ్గురు పార్టీ ఎమ్మెల్యే లు పార్టీని కాదని..వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 23 సీట్లు గెలిస్తే అందులో ముగ్గురు దూరం అయ్యారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు..కడప జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు గెలవలేదు. ఇక , అనంతపురంలో గెలిచిన రెండు సీట్లలో ఒకటి బాలక్రిష్ణ కాగా, రెండోది పయ్యావుల కేశవ్. బాలయ్య కలిసి వచ్చినా..కేశవ్ వైఖరి అనుమానమే. ఆయన పార్టీలోనే ఉన్నా రాజకీయంగా అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. చిత్తూరు నుండి చంద్రబాబు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర నుండి విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా..ఇప్పటికే గంటా పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటుగా మరో ఇద్దరు కలిసి నడుస్తారని చెబుతున్నారు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే..స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంది. విజయనగరంలో పార్టీ ఒక్క సీటు గెలవలేదు. శ్రీకాకుళం గెలిచిన ఇద్దరిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఎమ్మెల్యే అశోక్ సైతం టీడీపీలోనే ఉన్నా..యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో..చంద్రబాబు నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటారా..లేక ఈ రెండు ప్రాంత నేతల సహకారం లేక.. రాజకీయంగా ఆ రెండు ప్రాంతాల్లో టీడీపీ భవిష్యత్ కు నష్టం కలిగే అవకాశాలు ఉండటంతో ఆ ప్రతిపాదన విరమించుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అయితే, చంద్రబాబు మాత్రం అమరావతిని కాపాడుకోవాల్సిందేనంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.