TDP : పంచాయతీ ఎన్నికల్లో సగమే పోరాడింది.. మున్సిపల్ ఎన్నికల్లో బలం ఉన్న చోట మాత్రమే పోరాడింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.. టీడీపీ ఒక్కో ఎన్నికలను ఒక్కోలా డీల్ చేస్తుంది. కానీ తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను మాత్రం టీడీపీ పూర్తిస్థాయిలో.. పూర్తి బలంతో.. తమ మొత్తం బలగంతో డీల్ చేస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధతో పగలు ప్రచారాలతో.. రాత్రి వ్యూహాలతో టీడీపీ అసలైన రాజకీయం నడిపిస్తుంది. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో టీడీపీ రాజకీయం చేస్తున్న తీరు, ఫలితాల అవకాశాలు ఓ సారి లోతుగా విశ్లేషిస్తే…!!
TDP : ఎమ్మెల్యేలు, మాజీలు, కీలక నేతలు అక్కడే..!!
టీడీపీకి ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 15 మంది ఎమ్మెల్యేలు తిరుపతిలో తిష్ట వేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో తిష్ట వేశారు.
* ఎమ్మెల్యే స్థాయి నేతలు ఒక్కొక్కరు ఒక్కో మండలానికి ఇంఛార్జిగా.. ద్వితీయ శ్రేణిలో ఒక్కో నేత ఒక్కో మండలానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మండలంలో ప్రచార బాధ్యతలు చూస్తూనే…, వాస్తవ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి.. వ్యూహాలను మారుస్తున్నారు.
* వైసీపీ బలాలు, బలహీనతలు, ఆ పార్టీ బలవంతపు రాజకీయం అన్నిటినీ ఎదుర్కునేలా టీడీపీ ఈసారి పకడ్బందీగా సిద్ధమైంది. అర్ధ, అంగబలాన్ని రంగంలోకి దించింది. కీలక నేతలు అందరూ ప్రచారంలో దిగారు. చంద్రబాబు, లోకేష్ కూడా నేటి నుండి ప్రచారం చేయనున్నారు.
* ఒక్కో ఇంటినీ కనీసం అయిదు సార్లు టచ్ చేసి.. పార్టీకి ఓటు వేయమని అడగాలనేది ప్లానింగ్. ఇప్పటికే మొదటి దశలో అన్ని ఇళ్ళని చుట్టేశారు. బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచార సభలు, వీధివీధినా పాదయాత్రలు, ఇంటింటికీ ప్రచార పత్రాలు పంపిణీ వంటి సాధారణ రాజకీయం చేస్తూనే… వైసీపీ ఎక్కడెక్కడ ఎలా డీల్ చేస్తుంది..? ఆ పార్టీ బాలలు, బలహీనతలు ఏమిటి..? అధికార పార్టీపై అసంతృప్తిని ఓట్ల రూపంలో ఎలా తీసుకురావాలి అనే అంశాలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది..!
గెలుపు విషయం తర్వాత… ఎందుకు ఇంత యాక్టీవ్ అంటే..!?
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు అనే విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. “వైసీపీ అధికారాన్ని పూర్తిగా వాడుకుంటూ రాజకీయాల గతిని మార్చేసిన సంగతి టీడీపీకి తెలుసు. పోలీసులు, యంత్రాంగం, వాలంటీర్లు, అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం అధికార పార్టీ తరపున ఉన్నారని.., పవర్ పాలిటిక్స్ ముందు తాము నిలవలేమని టీడీపీ నేతలకు అంతర్గతంగా తెలుసు..! కానీ టీడీపీ ఇంతగా దృష్టి పెట్టడంలో కొన్ని కారణాలున్నాయి. టీడీపీకి ప్రతీ చోట కనీసం 35 శాతం ఓటు బ్యాంకు ఉంటుంది. ఆ పార్టీకి అసలైన బలం గ్రామస్థాయి, మండలస్థాయి క్యాడర్. వాళ్ళు పూర్తి శక్తి మేరకు పని చేస్తే.. పార్టీ ఓటు బ్యాంకు ఓట్లు పడితే.. కొన్ని న్యూట్రల్ ఓట్లు లాగగలిగితే ఆ పార్టీకి గెలుపు అంచుల వరకు వెళ్తుంది. అందుకే ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలు మేల్కొన్నారు. గ్రామస్థాయిలో.. మండలస్థాయిలో కీలక కార్యకర్తలు పూర్తిగా పార్టీకి పనిచేయాలి అంటే… పార్టీ కీలక నేతలు/ ఎమ్మెల్యేలు/ మాజీలు మొత్తం రంగంలోకి దిగాలన్న సంగతి గ్రహించారు. అందుకే పార్టీని చురుకు చేయడానికి.., కార్యకర్తలను యాక్టీవ్.. ఓటు బ్యాంకు కాపాడుకోడానికి.., న్యూట్రల్ ఓట్లు ఎన్నో కొన్ని లాగడానికి మాత్రమే టీడీపీ రాష్ట్ర నేతలు మొత్తం తిరుపతి చేరిపోయారు.
ఫలితం ఎంత మేరకు ఆశించవచ్చు..!?
టీడీపీ ఇంతగా శ్రమ పడుతుంది..? అందరూ అక్కడే ఉన్నారు..? మరి తిరుపతి పార్లమెంట్ టీడీపీ గెలుస్తుందా..? అంటే మాత్రం దాదాపు అసాధ్యమే. 2019 లో తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో టీడీపీకి 4. 94 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పుడు వైసీపీకి 7. 22 లక్షల ఓట్లు వచ్చాయి. గడిచిన ఏడాదిన్నరలో వైసీపీ పవర్ పాలిటిక్స్ ద్వారా కృత్రిమమగా బలాన్ని పెంచుకుని టీడీపీ ఓట్లని లాక్కుంటుంది. తిరుపతి ఉప ఎన్నిక కూడా అందుకు ప్రత్యామ్నాయం ఏమి కాదు.. ఇక్కడ కూడా వైసీపీ ఇదే తరహా రాజకీయం చేస్తుంది. సో… టీడీపీకి అప్పుడు పడిన ఓట్లు కూడా ఇప్పుడు రావడం కష్టమే. అందుకే మేల్కొన్న టీడీపీ నాటి కంటే కొంచెం ఓట్లు పెంచుకునే పనిలో ఉంది. నిజానికి ఇక్కడ టీడీపీ గెలవాల్సిన పని లేదు. గత ఎన్నికల కంటే 50 వేలు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే గెలిచేసినట్టే. నైతికంగా వైసీపీ ఓడిపోయినట్టే. టీడీపీలో జోష్ పెరిగినట్టే. రాష్ట్రం మొత్తం అలెర్ట్ అయినట్టే. అందుకే టీడీపీ పోరాటం. కనీసం అయిదున్నర లక్షలు ఓట్లు తెచ్చుకుంటే… వైసీపీ ఆధిక్యతని లక్షన్నరకి తగ్గిస్తే టీడీపీ ప్రాణం లేచివచ్చినట్టే…! కానీ జనసేన – బీజేపీ రూపంలో టీడీపీకే కొంత ముప్పు పొంచి వుంది. బీజేపీ- జనసేన కి కలిపి 2019 లో 36 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలకు 75 వేల ఓట్లు వచ్చినా… వాటిలో కొన్ని టీడీపీ ఓట్లే వెళ్లిపోతాయి. అందుకే… టీడీపీ ఇప్పుడు పెడుతున్న శ్రద్ధ కంటే ఇంకా ఎక్కువ పెడితేనే నైతిక గెలుపుని చూడవచ్చు..!!