తెలంగాణలో కరోనా విజృంభిస్తుండటం, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా కనిపించక పోవడం ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొనడం ఇవన్నీ గవర్నర్ ను చిక్కుల్లో పెట్టాయి. వీటన్నింటికి మించి ప్రతిపక్షాల రూపంలో గవర్నర్ కు సవాళ్ళు ఎదురవు తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ గవర్నర్ కు ఎదురవ్వని కొత్త సమస్య లు తెలంగాణ గవర్నర్ తమిళి సై కి ఎదురవుతున్నాయి. ఓ వైపు కరోనా పెరుగుతోంది. కరోనా వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్నారు. మరో వైపు దాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఒ పట్టాన పట్టించుకోవడం లేదు. సమీక్షలు లేవు.. సర్వేలు లేవు.. సరైన పరీక్షలు లేవు.. ఏమి లేక పరోక్షంగా చేతులెత్తేసింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే గవర్నర్ బాధ్యత తీసుకొని సమీక్షలు చేసి కరోనా నియంత్రణ కు సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. అంత వరకు బాగానే ఉంది.
పునర్విభజన చట్టంలోని సెక్షన్ లు బయటకు..!
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన సందర్భంలో సెక్షన్ 8 అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారం శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఆ ప్రాంతాన్ని గవర్నర్ తన పరిధిలోకి తీసుకొని తాను ఏక్షణమైనా సమీక్ష చేయవచ్చు. అవసరమైతే రాష్ట్రపతి పరిపాలనకు సిఫార్సు కూడా చేయవచ్చు. ఇదే సెక్షన్ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ప్రతిపక్షంలో తన వాయిస్ గట్టిగా వినిపించే రేవంత్ రెడ్డి పదే పదే ఈ సెక్షన్ లేవనెత్తుతూ గవర్నర్ ఈ సెక్షన్ ప్రయోగించి హైదరాబాద్ ను తన ఆధీనంలోకి తీసుకొని కరోనా ను అదుపు చేయాలని, అవసరమైతే కేంద్రానికి నివేదిక ఇచ్చి రాష్ట్రపతి పరిపాలనకు సిఫార్సు చేయాలని కోరుతున్నారు. కానీ ఆ సెక్షన్ ప్రకారం చూస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తితేనే అది అమలు చేయాలి. కానీ కరోనా అనేది శాంతిభద్రతల సమస్య ఏమాత్రం కానే కాదు. అందుకే గవర్నర్ దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఒక రకంగా బాధ్యతలు మాత్రం ఆవిడ పైనే పడ్డాయి.
మాట వినని అధికారులు.. ఎటూ తేల్చుకొని గవర్నర్
తన బాధ్యతలు ఏంతో కొంత నిర్వర్తించడానికి గవర్నర్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని కరోనాపై నివేదిక ఇవ్వాలని, సమీక్ష చేయాలి రావాలని ఆహ్వానించారు. కానీ వాళ్ళు రాలేదు. దీంతో గవర్నర్ ఏమీ చేయలేక నిస్చేస్టులై ఉండిపోయారు. ఇక్కడ తలెత్తుతున్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే గవర్నర్ పిలిచినప్పుడు అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలి. కానీ అలా వెళ్తే అది ప్రభుత్వానికి మచ్చ వచ్చినట్లే. గవర్నర్ నేరుగా ఏ అధికారులతో సమీక్ష చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మాత్రమే అధికారులను పిలిపించుకుని నివేదిక తీసుకోవాలి. కానీ ఈ కరోనా సమయంలో గవర్నర్ ఇలా అధికారులను పిలిచి సమీక్ష చేస్తే అది కేసీఆర్ ప్రభుత్వానికి మచ్చగా మిగులుతుంది. అందుకే ఈ ఇద్దరు అధికారులను వెళ్లకుండా కేసీఆర్, కేటీఆర్ పరోక్షంగా అడ్డుకున్నారని తెలంగాణలో మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే గవర్నర్ బిజెపి మనిషి. సో..పరోక్షంగా పరిపాలనలో బిజెపి ఎంటర్ అయినట్లు ఉంటుందని కేసీఆర్ భావించారట. అందుకే అధికారులు వెళ్ళవద్దని కోరారట. మూడు నాలుగు రోజుల్లో మొత్తం సర్దుకొని కేసీఆర్ స్వయంగా పరిపాలన రంగంలోకి దిగి మొత్తం అందరికీ సమాధానం చెబుతారని తాను ఎందుకు విశ్రాంతి తీసుకున్నది, ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తారని ఆయన వర్గం భావిస్తోంది.