ఒకప్పుడు తెలుగు రాజకీయ నేతలు ఎవరైనా ఢిల్లీ వెళ్లారు అంటే… ఏ ఆత్మగౌరవ నినాదమో.., ఏ జంతర్ మంతర్ వద్ద ధర్నాకో.., ఏ కయ్యానికో.., రాష్ట్ర ప్రగతికో అయ్యి ఉంటుంది..! కానీ కాలం మారింది. ఢిల్లీ పవర్ పెరిగింది. ఆ పవర్ లో ఎంతో కొంత దక్కకపోతుందా అని బిచ్చగాళ్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కువయ్యారు. ఆ సమయం ఇప్పుడు తెలుగు సినీ రాజకీయులు ఇద్దరికి వచ్చింది.
“ఢిల్లీకి పోయినాము.. దేహి దేహి అంటున్నాము..!” ముందూ, వెనుకా తీసేస్తే ఈ పాట మాత్రం ఇప్పుడు ఢిల్లీలో ఉన్న మన తెలుగు సినీ నేతలకు అతుకుతుంది. ఢిల్లీకి వెళ్లిందే దేహీ అనడానికి. ఒకరు “తనకు విలువ ఇవ్వండి బాబోయ్.., తన పార్టీకి ఏదో ఒక దారి చూపండి. పట్టించుకోండి” అంటూ వేడుకోడానికి.., మరొకరు “తనను చేర్చుకోండి.., తనకూ ఏదో దారి చూపండి. కార్చులకు కష్టంగా ఉంది” అంటూ ఢిల్లీ విధులకు చేరారు. మరి వారి కృషి ఫలించినట్టేనా..!? వారి బొచ్చె నిండినట్టేనా..!? చూద్దాం..!!
పవన్ ఏం సాధించినట్టు..!?
పవన్ జనసేన పార్టీ పెట్టి ఏడేళ్లు అవుతుంది. మొదటి(2014) ఎన్నికల్లో పోటీ చేయలేదు. రెండో(2019) ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేదు. దీనికి కారణం ఆ ఐదేళ్లలో పార్టీ నిర్మాణం చేయకపోవడమే. ఇప్పుడు చేస్తున్నది అదే తప్పు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక ప్రణాళిక, ఒక విధి విధానం, సరైన సిద్ధాంతం లేదు. బీజేపీతో ఎందుకు కలిసారో స్పష్టత లేదు. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి డైలాగులు చెప్పేవారో.., ఇప్పటికీ అవే డైలాగులు చెప్తున్నారు తప్పితే పార్టీకి మాత్రం అతీ గతీ లేదు. బీజేపీతో పొత్తుతో ఒక స్పష్టత లేదు. ఎవరి దారి వారిది. ఒకరు టీడీపీని తిడతారు. ఒకరు వైసీపీని తిడతారు. ఒకరు బాబుపై ఈగ వాలనివ్వరు. ఒకరు జగన్ పై ఈగ వాలనివ్వరు. తీరా ఎన్నికల్లో పోటీ విషయంలో కూడా రెండు పార్టీలకు ఒక స్పష్టత లేదు.
బీజేపీ అంటే వేరు. ఆ పార్టీకి ఏపీ కాకపోతే బోలెడన్ని రాష్ట్రాలున్నాయి. కానీ జనసేనకి ఏపీ తప్ప ఇంకేం లేదు. మరి పవన్ ఏం చేస్తున్నట్టు..? బీజేపీతో ఈ ఏడాది పొత్తులో ఏ సాధించినట్టు..? పాపం పవన్..!! చివరికి ఎన్నికల్లో పోటీకి కూడా బీజేపీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం వారికి తెలియాల్సింది ఉంది. జనసేన ఇలా ఉండడమే మేలు. ఒకవేళ ఎన్నికల్లోకి మళ్ళీ దిగితే.. పొరపాటున 2019 ఫలితాలు రిపీట్ అయితే.. ఆ పార్టీ పూల రెక్కల్లా రాలిపోతుంది. అందుకే తన సేఫ్ కోసమే పవన్ ఢిల్లీ చేరినట్టు ఒక సమాచారం. పార్టీని అవసరమైతే బీజేపీకి ఇచ్చేయడానికి కూడా సిద్ధమేనంటూ ఒక ప్రతిపాదన తీసుకువెళ్లారట..!
విజయశాంతి బీజేపీలో చేరిక లాంఛనమే..!!
ఇక మరో రాజకీయ (సినీ) బిచ్చం విజయశాంతిది. ఇరవై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆమె చేసిన ఉద్యమం లేదు, పోరాటం లేదు. జనంలోకి వచ్చిన ప్రతీసారి సినీ డైలాగులు చెప్పుకొస్తూ పబ్బం నడిపేశారు ఆమె. ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని.., పార్టీలకు సంబంధం లేకుండా అక్కడ క్యాడర్ నిర్వహించడం.., పోటీ చేసి గెలవడం.., సభల్లో తన వాణి వినిపించడం చేయలేదు. రెండు దశాబ్దాల నుండి తన ఉనికి కోసం తప్పితే.., తన పట్టు కోసం తప్పితే.., తన స్వలాభం కోసం తప్పితే.. ఏం సాధించింది లేదు. బీజేపీ మొదలుకుని, సొంత పార్టీ, టీఆరెస్, కాంగ్రెస్ తిరగేసి మళ్ళీ బీజేపీకి చేరుతున్నారు. ఇక బీజేపీకి తిరుగులేదు. ఆ పార్టీలోకి వెళ్తే తనకు తిరుగుండదు.., తనకు ఎంతో కొంత లాభమే.., గిట్టుబాటుగా ఉంటుంది.. ఇవన్నీ ఆలోచించి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ గ్రేటర్ ఎన్నికల్లో ట్వీటుతున్నారు. హేమిటో..”! సినిమాలు ఇచ్చిన కృత్రిమ బలం, కృత్రిమ నాయకత్వంతో ఏలేద్దామంటే వీళ్ళకి బుద్ధి ఎక్కడున్నట్టు..!?