Telugu Desam Party: ఓడిపోయి రెండేళ్లయింది.. మొదటి ఏడాది బాధలో పోయింది. రెండో ఏడాది కరోనాలో కొట్టుకుపోయింది. ఇంకా మిగిలింది ఏడాదిన్నర మాత్రమే.. ఆ తర్వాత మొత్తం పొలిటికల్ సీన్ లో కొట్టుకుపోతుంది. అప్పుడు మొత్తం పాదయాత్రలు, బస్సు యాత్రలు, రథయాత్రలు అంటూ బిజీ బిజీగా గడపాలి. అందుకే టీడీపీకి రాజకీయంగా ఉనికి నిలబెట్టుకోడానికి మిగిలి ఉన్నాది ఈ రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలం మాత్రమే. ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిస్థాయిలో ఇప్పటి రావుకు పోరాడింది లేదు. రోడ్డెక్కి కూర్చున్నది లేదు. ధర్నాలు, ఆందోళనలు ఏమి జరగలేదు. ఓడిన తర్వాత నైరాశ్యంలో ఓ ఏడాది.., కరోనా కాలంగా మరో ఏడాది పోయింది కాబట్టి.. ఇప్పుడు టీడీపీ అప్రమత్తమైంది. అందుకే పరీక్షలు.., వాక్సిన్లు.. కేసులు, డెయిరీలు దేన్నీ వదలట్లేదు.
Telugu Desam Party: చంద్రబాబు .. లోకేష్ పోటాపోటీగా ..!
టీడీపీకి అప్పటికీ.. ఇప్పటికీ చంద్రబాబే వెన్నెముక. నారా లోకేష్ ఇంకా నాయకుడిగా ఎదగలేదు. పరిపక్వత చెందలేదు. జగన్ లా.., కేటీఆర్ లా లోకేష్ అలుపెరగని పోరాటాలు, ఉద్యమాలు చేయలేదు. మాస్ ఇమేజీ సంపాదించుకోలేదు. లోకేష్ సులువుగా ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆ బాటలోనే ఉన్నాడు. సో.. లోకేష్ వలన పార్టీకి ఒరిగేదేమి ఉండదు. చంద్రబాబే మోయాలి. తెరవెనుక ప్లాన్ బాబుదే.. తెరముండు దాన్ని అమలు చేయాల్సింది బాబే. అప్పటిలా సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నమ్మకమైన నీడలు కూడా లేరు. సో.., ఈ తరుణంలో బాబు రానున్న ఏడాదిలో పార్టీ పోరాటాలను ఎలా ముందుకు తీసుకువెళతారు అనే దానిపైనే పార్టీ క్షేత్ర భవిత ఆధారపడి ఉంటుంది. జగన్ దూకుడు ఎక్కువగా ఉంది. నాయకులపై కేసులు, ఆర్ధిక మూలాలపై దెబ్బలు, ఫిరాయింపులతో ఏ మాత్రం టీడీపీకి ఊపిరి సలపనీయడం లేదు. చంద్రబాబుతో పాటూ లోకేష్ కూడా కొంచెం విజ్ఞత, లోకజ్ఞానం, పరిజ్ఞానం, పరిపక్వత సంపాదించుకుని రంగంలోకి దిగితే చానెళ్లకు వేడినీళ్లలాగా ఉంటుంది. లేకపోతే చంద్రబాబుకి సినిమా కష్టాలే..
కరోనా దెబ్బ వేస్తున్నట్టేనా..!?
కరోనా దేశ ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీస్తుంది. పేదోళ్ల బతుకుల్ని దెబ్బ తీస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలను మూయించేస్తుంది. ఇదే సమయంలో కరోనా రాజకీయ పార్టీలను కూడా దెబ్బ వేస్తుంది. రాజకీయాలను కూడా మార్చేస్తుంది. ఈ ఏడేళ్లలో బీజేపీపై ఎన్నడూ లేని వ్యతిరేకతని తీసుకొచ్చింది కరోనా రెండో దశ. ఏపీలో టీడీపీని కూడా అలాగే దెబ్బె వేస్తుంది. టీడీపీకి ఇది క్లిష్ట సమయం. ప్రజల్లో ఉంటూ పోరాడాల్సిన సమయం. ఈ ఏడాది పోరాటాలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తే.. వచ్చే ఏడాది బస్సు యాత్రలూ.., పాదయాత్రలో చేసుకోవచ్చు. అదేమి లేకుండా ఇంట్లో కూర్చుని జూమ్ మీటింగులు పెట్టుకుంటే పార్టీ భవిష్యత్తు ఏం కానూ..!? ఉనికి ఏం కానూ..!? ప్రజా పోరాటాలూ ఏం కానూ..!? అందుకే టీడీపీకి ఆ అవకాశం లేకుండా కరోనా చేస్తుంది.